యాదాద్రి భువనగిరి, జూలై 31 (నమస్తే తెలంగాణ) : సాధారణంగా వేసవిలో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ ఈ ఏడాది వానకాలంలోనూ తాగునీటి కోసం ప్రజలు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల కారణంతో నీటి ఎద్దడి ముంచుకొస్తున్నది. భూగర్భజలాలు అడుగంటడం, బోర్లు ఒట్టిపోవడంతోపాటు రిజర్వాయర్ల నుంచి జిల్లాకు సరిపడా జలాలు రాకపోవడంతో ప్రజలు నీటి కోసం అరిగోస పడుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు మూడు, నాలుగు రోజులకోసారి సరఫరా అవుతుండటంతో పాట్లు పడుతున్నారు.
జలాల సరఫరా డౌన్..
జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు, 717 ఆవాసాలు ఉన్నాయి. మొత్తంగా 1.76 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. మూడు మార్గాల ద్వారా జిల్లాకు జలాలను తరలిస్తున్నారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లోని 517 ఆవాసాలకు హైదరాబాద్ మెట్రో వాటర్ గ్రిడ్ నుంచి, 131 ఆవాసాలకు అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, 69 చోట్లకు నల్లగొండ జిల్లా ఉదయసముద్రం నుంచి తాగునీరు సరఫరా అవుతున్నది. హెచ్ఎండబ్ల్యూస్ నుంచి ప్రజల కోసం రోజుకు 72 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ ఫర్ డే) నీరు అవసరం. కానీ ప్రస్తుతం 26 నుంచి 29 ఎంఎల్డీలు మాత్రమే జిల్లాకు వస్తున్నాయి. ఇక చౌటుప్పల్, నారాయణపురం, భూదాన్పోచంపల్లి మండలాల్లోని 131 ఆవాసాలకు నల్లగొండ జిల్లాలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 12 నుంచి 13 ఎంఎల్డీల జలాలు అందుతున్నాయి. రామన్నపేట, మోత్కూర్, అడ్డగూడూర్ మండలాల్లోని ఆవాసాల్లోకి పానగల్ రిజర్వాయర్ నుంచి 9 ఎంఎల్డీల నీరు సరఫరా అవుతున్నది. ఇవి కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయి. మొత్తంగా జిల్లాకు 89 ఎంఎల్డీల డిమాండ్ ఉండగా, ఇప్పుడు 52 ఎంఎల్డీలు మాత్రమే వస్తున్నాయి.
నీటి కష్టాలు షురూ..
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి నీటి బాధలు షురూ అయ్యాయి. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో తిప్పలు తప్పడం లేదు. సరిపడా నీళ్లు లేకపోకపోవడంతో మిషన్ భగీరథ నీళ్లలోనే స్థానిక బోరు నీళ్లను కలిపి సరఫరా చేస్తున్నారు. అది కూడా వారానికి రెండు సార్లు మాత్రమే అందిస్తున్నారు. కొన్ని చోట్ల నీటి సరఫరా లేకపోవడంతో వాటర్ ట్యాంకర్లే దిక్కవుతున్నాయి. కాలనీల్లో ట్యాంకర్ల నుంచి పట్టుకొని డ్రమ్ముల్లో నింపుకొంటున్నారు. ఇవి కనీస అవసరాలకు కూడా చాలకపోవడంతో ఎప్పుడో వచ్చే వాటర్ ట్యాంకర్ల కోసం పడిగాపులు కాయాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు ప్రైవేట్ ట్యాంకర్లను డబ్బులు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. భువనగిరి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న ప్రజలకు ట్రాక్లర్ల ద్వారా అందించే నీళ్లే ఆధారం. ఇప్పుడు అవి కూడా సక్రమంగా రావడం లేదు. ఇక్కడ అన్ని వార్డుల్లో ఇదే పరిస్థితి. బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లి, మైలారం, పకీర్గూడెం, మేడిపల్లి గ్రామాల్లో ఐదు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. ఆత్మకూరు మండలంలో మూడు, నాలుగు రోజులకోసారి నీళ్లు వదులుతున్నారు. అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య షురూ అయ్యింది. తాజాగా నీటి కోసం మోత్కూరు, భువనగిరి మున్సిపాలిటీల్లో ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే.
271 ఆవాసాలకు ముప్పు..
జిల్లాలో 1220 ట్యాంక్లు, 303 చేతి పంపులు, 631 సింగిల్ ఫేజ్, 1782 త్రీఫేజ్ బోర్లు, 33 బావుల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలోని 271 ఆవాసాల్లో నీటి ముప్పు ఉందని అధికారులు అంచనా వేశారు. నీటి కష్టాలు తప్పకపోవడంతో ప్రత్యామ్నా య మార్గాలను అన్వేషిస్తున్నా రు. కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు గ్రామాల వారీగా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోతుండటంతో కొత్తగా వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నీళ్ల కోసం వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నారు. పాత బోర్లను రిపేర్ చేయిస్తున్నారు. ఇక మిషన్ భగీరథ నీళ్లు సరిపడా అందకపోవడంతో జనం వాటర్ ప్లాంట్లకు క్యూ కడుతున్నారు. నీరు సరిపోకపోవడంతో ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకుంటున్నామని మిషన్ భగీరథ ఈఈ కరుణాకర్ రెడ్డి తెలిపారు.