ఆదిలాబాద్,( నమస్తే తెలంగాణ)/ నెట్వర్క్ బృందం, జూలై 31 ; మూడు రోజులుగా ఎకధాటిగా కురిసిన వానతో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని పెన్గంగ, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నదీ తీర ప్రాంతంలోని పొలాలన్నీ నీటమునిగాయి. మొదట్లో వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డ రైతులు ఈ వానలతో పంటలు దెబ్బతినడం, చేలలో ఇసుక మేటలు ఏర్పడడంతో కన్నీటి పర్యంతమయ్యారు. వరద తాకిడి రోడ్లు, వంతెనలు దెబ్బతినడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎడతెరపి లేని వానతో పాత ఇండ్లు కూలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది.
తలమడుగు మండలంలో వర్షంతో ఉమ్రి, కప్పర్దేవి, కోసాయి, దేగామ, తదితర గ్రామాల్లో దాదాపు 650 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ఏవో ప్రమోద్ రెడ్డి తెలిపారు. జైనథ్ ఉమ్మడి మండలంలో పెన్గంగా వరద నీరు మరో పక్క సాత్నాల వరద నీరు ఉధృతికి పెండల్ వాడ సంగెం వద్ద వరద పోటెత్తింది. పెండల్వాడ, సాంగ్వి, కౌఠ, కాప్రి, కరంజి గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పత్తి, సోయా, కంది జొన్న పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు.
జల దిగ్బంధంలో మారుమూల గ్రామాలు
ఇంద్రవెల్లి మండలం మామిడిగూడ(జీ)లో ఉధృతంగా ప్రవహించిన వాగును దాటేం దుకు ఆదివాసీ గిరిజన మహిళలు, యువకులు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం వంతెన నిర్మించాలని కోరారు. ఉట్నూర్ మండలంలో పులిమడుగు, శ్యాంపూర్, నాగాపూర్, పెర్కగూడ, దంతన్పెల్లి, మత్తడిగూడ, నర్షాపూర్(జే), వంకతుమ్మ వాగులు ఉధృతం గా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భీంపూర్ మండలంలోని కరంజి(టి), గుబిడి, వడూర్, గోముత్రి,అంతర్గాం, అర్లి, గొల్లగడ్ శివారులో పెన్గంగ ఉ ధృతంగా ప్రవహిస్తున్నది. సరిహద్దులో నాటుపడవలు నిలిచిపోవడంతో మహారాష్ట్రకు సంబంధాలు తెగిపోయాయి. పెన్గంగ, వాగుల వరదతో వందల ఎకరాల్లో ప త్తి చేలలో ఇసుక మేటలు వేయడంతో మొక్కలు పనికిరాకుండా పోయాయి. కరంజిలో గొల్లి ప్రవీణ్ అనే రైతుకు చెందిన మోటారు, పైపులు కొట్టుకుపోయాయి. టేకిడిరాంపూర్ వాగుకు పెద్ద చెట్లు కొట్టుకువచ్చి కల్వర్టు తెగింది. సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
బేల్సరిరాంపూర్ సమీప జెండాగూడ ప్రాజెక్టు, గుంజాల సమీప గుండాల జలపాతం పరవళ్లు తొక్కింది. బేల మండలంలో బెధోడ, సంగిడి, మానియార్పూర్, గూడ గ్రామాల సమీపంలోని వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకపోయాయి. పెన్ గంగా నది వరదలో పత్తి, సోయాబీన్ చేలు నీటమునిగాయి. కడెం నది ఉధృతంగా ప్రవహించడంతో బజార్హత్నూర్ మండలంలో భూతాయి గ్రామానికి చెందిన బాంద్రే గురుదేవ్ సింగ్కు చెందిన మక్క చేను మునిగింది. వర్తమన్నూర్లో ఉన్న పాఠశాల వంటగది కూలిపోయింది. కొత్తపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు బండ్రేవ్ వాగుపై గల వంతెనకు ఇరువైపులా అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. గోకొండ గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధమై రూ.లక్ష ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు జాట్ సోదరి బాయి తెలిపారు.
ప్రాజెక్టులకు వరద ఉధృతి..
భోరజ్ మండలంలోని చనకా-కొరటా బ్యారేజీ పూర్తి స్థాయి నీటి మట్ట 213.000 మీటర్లకు చేరుకున్నది. ఒకేసారి బ్యారేజీలో 2,48,973 లక్షల క్యూసెకుల వరద నీరు వచ్చి చేరగా అంతే స్థాయిలో నీరు దిగువకు వెళ్లింది. అకోలి, కామాయి, పెండల్ వాడ, సాంగ్వి-కె సహా దిగువన ఉన్న గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్, శంకర్గూడ గ్రామాల మధ్యగల త్రివేణి సంగమం ప్రాజెక్టు మత్తడిపై నుంచి వరద పారింది. చేపలు పట్టేందుకు స్థానికులు ఎగబడ్డారు.
జూలై నాటికి 492.4 మిల్లీ మీటర్ల వర్షాపాతం
ఆదిలాబాద్ జిల్లాలో ఈ సీజన్లో శుక్రవారం వరకు 533.2 మిల్లీ మీటర్లకు గాను 492.4 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైంది. మత్తడి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరగా అధికారులు గేట్లు వదిలి నీటిని విడుదల చేశారు. సాత్నాల ప్రాజెక్టులోకి సైతం భారీగా నీరు చేరింది. కుంటాల, పొచ్చెర, కనకాయి జలపాతాలు ఉప్పొంగి ప్రవహించాయి. నదులు, వాగుల సమీపంలో పంటలు నీట మునిగి నష్టం వాటిల్లగా మరోవైపు ఎండిపోయే స్థితిలో ఉన్న పంటలకు జీవం పోసినట్లయిందని మరి కొందరు రైతులు తెలిపారు.
నిర్మల్ జిల్లాలో..
దస్తురాబాద్ మండల కేంద్రంతో పలు గ్రామాల్లో వరదలో పంటలు నీట మునిగాయి. ఆకొండపేట సమీపంలో బీటీ రోడ్డు వర్షానికి కోతకు గురైంది. దస్తురాబాద్లో కూలిన ఇంటిని తహసీల్దార్ కనక యాదవరావు, ఆర్ఐ ఆర్తీ పరిశీలించారు. తానూర్ మండలంలోని హిప్నెల్లిలో వర్షంతో 5 ఇండ్లు కూలిపోయాయి. కూలిన ఇండ్లను జీపీవో రజిత, పంచాయతీ కార్యదర్శి అజీజ్, సర్పంచ్ చంద్రే గంగాసాగర పరిశీలించారు.
కడెం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. శుక్రవారం ప్రాజెక్టు వద్ద పరిస్థితిని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పరిశీలించారు. ఇన్ఫ్లో వివరాలు తెలుసుకొని నీటిపారుదల శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. మొర్రిగూడెంలో గురువారం రాత్రి కోల సత్యనారాయణ ఇల్లు కూలింది. ఇంట్లోని కుటుంబ సభ్యులు ముందుగానే బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. ఇంట్లోని వస్తువులు ధ్వంసమై నష్టం వాటిల్లింది. నవాబ్పేట్కు చెందిన రైతు సిందం గంగన్న(70) గురువారం 3 పశువులను తీసుకొని సమీప అటవీ ప్రాంతానికి వెళ్లి రాలేదు. కుటుంబసభ్యులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఖానాపూర్ పట్టణంలోని హైటెక్ సిటీలోని మహాత్మాజ్యోతిబాఫూలే వసతి గృహానికి వెళ్లే మార్గం భారీ వర్షాలకు దెబ్బతినడంతో కలెక్టర్ భవేశ్ మిశ్రా, అధికారులు, మున్సిపల్ నాయకులతో వెళ్లి పరిశీలిం చారు. విద్యార్థులకు నిత్యావసర వస్తువులు, ఆహారం, తాగునీరు, ఇతర అవసరమైన సామగ్రి కొరత లేకుం డా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిరంతరం సరఫరా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించా రు. ఖానాపూర్ మండలంలోని రాంరెడ్డిపల్లెకు చెందిన రైతు లెక్కల రాజ్కుమార్ పక్కనే ఉన్న పాతఎల్లాపూర్ లో గల తన నాలుగు ఎకరాల భూమిలో ఇరవై రోజుల క్రితం వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేశాడు. వాగు నుం చి వచ్చిన వరదతో పొలం నీట మునిగి ఇసుక మేటలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.
నెల రోజుల్లో 513.1 మి.మీ. వర్షపాతం..
నిర్మల్ జిల్లాలో వ్యాప్తంగా జూన్ 1 నుంచి జులై 31 వరకు 513.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సాధారణ వర్షపాతం 476.9 మిల్లీ మీటర్లతో పోలిస్తే 76 శాతం అధికంగా జూలై 31న ఒకేరోజు జిల్లా సగటు వర్షపాతం 62.5 మి.మీటర్లు నమోదైంది. కడెం, పెద్దూర్, పెంబి, దస్తురాబాద్ మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా కుభీర్, తానూర్, బాసర మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాపాతం నమోదైంది. ఈ వర్షంతో పంటలకు ప్రాణం పోయగా రైతన్నలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. నిర్మల్ జిల్లాలో శుక్రవారం 62.5 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కడెం పెద్దూరు గ్రామంలో 95.7 మి.మీ, దస్తూరాబాద్ మండలంలో 94.7 మి.మీ తానూరు లో 44.4 మి.మీ వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు.