UPI Payments : యూపీఐ లావాదేవీలపై వసూలు చేసే ఛార్జీలపై కేంద్రం స్పష్టతనిచ్చింది. రూ.2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఛార్జీలు వసూలు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్)గా పిలిచే ఈ ఛార్జీలు వ్యాపారులు మాత్రమే చెల్లించాలి. వినియోగదారులు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ అంశంపై ఎన్పీసీఐ (ద నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కీలక వివరాల్ని వెల్లడించింది.
దీని ప్రకారం వచ్చే అక్టోబర్ 15 నుంచి ఈ ఛార్జీలు అమలులోకి వస్తాయి. యూపీఐ నుంచి మర్చంట్స్కు చేసే చెల్లింపులపైనే ఈ ఎండీఆర్. అలాగే, యూపీఐ నుంచి బ్యాంకులకు, యూపీఐ అకౌంట్లకు చేసే చెల్లింపులు ఎప్పట్లాగే ఉచితం. నిబంధనల ప్రకారం అర్హులైన వ్యాపారులకే ఇది వర్తిస్తుంది. అలాగే, కొన్ని చిన్న వ్యాపారాలు, ప్రత్యేక, అత్యవసర సేవలకు ఈ విషయంలో మినహాయింపు ఉంటుంది. ఈ ఛార్జీలకు సంబంధించి వినియోగదారులకు ఎలాంటి భారం పడదు. రూ.2,000 దాటి చేసే యూపీఐ చెల్లింపులపై, ప్రతి లావాదేవీపై 0.4 శాతం ఎండీఆర్ను వ్యాపారులే చెల్లించాలి.
గరిష్టంగా రూ.300 వరకే ఉంటుంది. సగటు ఛార్జీలు ఇలా ఉంటాయి. రూ.3,000 లావాదేవీపై రూ.12, రూ.50,000 లావాదేవీపై రూ.200, రూ.75,000 లావాదేవీపై రూ.300 డీపీఆర్ చెల్లించాలి. రూ.75,000 దాటినా సరే.. గరిష్టంగా ఒక లావాదేవీపై రూ.300 మాత్రమే ఛార్జీ ఉంటుంది. ఎన్పీసీఐ చెబుతున్న వివరాల ప్రకారం 95 శాతం యూపీఐ లావాదేవీలు రూ.2,000 కంటే తక్కువగానే ఉంటున్నాయి. అందువల్ల 5 శాతం లావాదేవీలపైనే ఈ ఛార్జీలు ఉంటాయి.
వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు ఈ విషయంలో పీ2పీఎం కింద మినహాయింపు ఉంటుంది. అలాగే, క్యూఆర్ కోడ్ ద్వారా నెలకు రూ.1 లక్ష లావాదేవీ దాటిన వాటిపైనే ఎండీఆర్ చార్జీలుంటాయి. అది రూ.లక్ష లావాదేవీ మూడు నెలలు వరుసగా దాటితే వారిని పెద్ద వ్యాపారులుగా పరిగణిస్తారు.