శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నది. ఉగ్రవాదులకు నిధుల కేసు దర్యాప్తులో భాగంగా శ్రీనగర్, బారాముల్లా, అనంత్నాగ్ జిల్లాల్లో తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా కేసుతో సంబంధమున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నది. వారిలో అనంత్నాగ్లో నలుగురు, శ్రీనగర్లో ఒకరిని అరెస్టు చేసింది. వీరంతా ఐసిస్ సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వీరితోపాటు పలువురిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు.
కాగా, జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగంలో ఉన్న 11 మంది ఉద్యోగులను ప్రభుత్వం శనివారం తొలగించింది. వారిలో హిజ్బుల్ ముజాహిదీన్ అధినేత, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అయిన సయీద్ సలవుద్దీన్ కుమారుడు కూడా ఉన్నాడు. వారిపై ఉగ్రవాద సంస్థల కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
షేర్-ఐ-కశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, విద్యా శాఖలో పనిచేస్తున్న సయీద్ అహ్మద్ షకీల్, షాహిద్ యూసుఫ్ల టెర్రర్ ఫండింగ్ ట్రయల్స్ను ఎన్ఐఏ పసిగట్టింది. వీరు నిషేధిత హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ టెర్రర్ కార్యకలాపాల కోసం హవాలా ద్వారా నిధులను సేకరించడమే కాకుండా వారిని టెర్రరిస్టులకు చేరవేస్తున్నారని అధికారులు తెలిపారు.