వాషింగ్టన్: ప్రతిష్టాత్మక కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నీని అర్జెంటీనా సొంతం చేసుకున్నది. రియోలోని మారకానా స్టేడియంలో హోరాహోరీగా జరిగిన ఫైనల్లో 1-0 తేడాతో బ్రెజిల్పై విజయం సాధించింది. అర్జెంటీనా ఆటగాడు ఏజెల్ డీ మారియా గోల్ చేసి తన జట్టుకు అపురూపమైన విజయాన్ని సాధించిపెట్టాడు. దీంతో 28 ఏండ్ల తర్వాత కోపా అమెరికా టోర్నీని అర్జెంటీనా కైవసం చేసుకున్నది. అదేవిధంగా కెప్టెన్ లియోనల్ మెస్సీ సారథ్యంలో తొలిసారిగా అతిపెద్ద టోర్నీని గెలిచినట్లయింది.
అర్జెంటీనా చివరిసారిగా 1993లో కోపా అమెరికా కప్ను గెలుచుకున్నది. మొత్తంగా ఇప్పటివరకు ఆ జట్టు 15 సార్లు ఈ టైటిల్ను సొంతం చేసుకుంది. దీంతో కోపా అమెరికా టోర్నీలో అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా ఉరుగ్వే సరసన నిలిచింది. ఆ జట్టు ఇప్పటివరకూ 15 సార్లు ఈ టోర్నీలో గెలుపొందింది.
కాగా, కోపా అమెరికా ఫైనల్లో బ్రెజిల్, అర్జెంటీనా తలపడడం ఇది మూడోసారి. 1937లో తొలిసారి ఈ టోర్నీ ఫైనల్లో ఈ రెండు జట్లు పోటీపడ్డాయి. అప్పుడు కూడా అర్జెంటీనా జట్టు విజేతగా నిలిచింది. ఆ తర్వాత రెండు సార్లు (2004, 2007) బ్రెజిల్ టైటిల్ సొంతం చేసుకున్నది. ఇప్పటి వరకూ అర్జెంటీనా, బ్రెజిల్ 112 మ్యాచ్ల్లో తలపడగా.. బ్రెజిల్ 46 మ్యాచ్లు, అర్జెంటీనా 41 మ్యాచ్ల చొప్పున గెలుపొందాయి.