హైదరాబాద్ : క్షుద్రపూజలు అని చెప్పి క్షుద్ర రాజకీయాలు ( Vile Politics ) చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయే ( Congress Party ) నని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ఆరోపించారు. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లం. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వాళ్లం. క్షుద్ర రాజకీయాలు చేయవలసిన అవసరం తమకు లేదని వెల్లడించారు. అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ బాగుండాలని కోరుకుంటాం. కాంగ్రెస్ లాగా పార్టీ క్షుద్ర రాజకీయాలు మాకు తెలియదని పేర్కొన్నారు.
హరీష్ రావు గుడికి పోతే తప్పా? ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయవచ్చా? కాంగ్రెస్ పార్టీలాగా మేడిగడ్డకు, చెక్ డ్యామ్లోనూ ధ్వంసం చేసి ఓట్లు దండుకోవాలని చూడలేదని ఆరోపించారు. నీళ్లు ఉన్నా కూడా రైతులను ఎండబెట్టే కాంగ్రెస్ సంస్కృతి బీఆర్ఎస్ది కాదని అన్నారు. కరెంటు ఉండి కూడా వ్యవసాయదారుడికి 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు. ఏ సబ్ స్టేషన్కైనా రావడానికి మేము సిద్ధం. 24 గంటల కరెంట్ వస్తే ఇంకా ఎక్కడ ఉందో చెప్పాలి. కనీసం ఐదు, ఆరు సార్లు ప్రతిరోజూ కరెంట్ కోతలు అవుతున్నాయని విమర్శించారు.
హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరి విచారకరం
కోర్టులు చెప్పినా హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిని ప్రజాస్వామిక వాదులు గుర్తించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక ఆలోచనా విధానాన్ని గుర్తించాలని, రేవంత్ రెడ్డి హిట్లర్ అని చెప్పుకున్నట్లే రాజ్యాంగ వ్యవస్థలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండున్నర లక్షల మందికి 58 జీవో ద్వారా పట్టాలు ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క పట్టా అయినా ఇవ్వలేదని, పైగా వేలాది మంది ఇళ్లను కూలగొట్టిందని ఆరోపించారు. హైదరాబాద్ లోని 10,000 ఎకరాల విలువైన భూమి పారిశ్రామిక భూముల విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న 5 లక్షల కోట్ల స్కామ్ పైన రాష్ట్ర ప్రజలను జాగృతం చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. హిల్ట్ పాలసీ ద్వారా రాష్ట్ర ప్రజల సొమ్మును ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం జేబులో వేసుకుంటుందో ప్రజలందరికీ అర్థమయ్యేలా లేఖల రూపంలో, ప్రజెంటేషన్ ల రూపంలో ప్రజల ముందు ఉంచుతామన్నారు.