న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగర వాసులకు చేదు గుళిక.. శబ్ద కాలుష్య నిబంధనలను ఉల్లంఘిస్తే ఢిల్లీ వాసులు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లను వాడినా, డీజేలు పెట్టినా.. శబ్ద కాలుష్యం ఉల్లంఘిస్తే రూ.10 వేల నుంచి రూ. లక్ష వరకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఢిల్లు కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ) నిబంధనలను సవరించింది.
సవరించిన నిబంధనల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేకుండా రాత్రి వేళ లౌడ్ స్పీకర్ వాడినా, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వాడినా రూ.10 వేలు జరిమానా వసూలు చేస్తుంది డీపీసీసీ. అలాగే లౌడ్ స్పీకర్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా జప్తు చేస్తారు.
1000 కేవీఏ సామర్థ్యం గల డీజిల్ జనరేటర్ సెట్ చేస్తే రూ. లక్ష, 62.5 నుంచి 1000 కేవీఏ సామర్థ్యం గల డీజేలను ఏర్పాటు చేస్తే రూ.25 వేలు జరిమాన చెల్లించాలి. 62.5 కేవీఏ సామర్థ్యం గల డీజేలను ఏర్పాటు చేస్తే రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
రెసిడెన్షియల్ ప్రాంతాల్లో పగలు శబ్ద స్థాయి 55 డెసిబుల్స్, రాత్రి వేళ 45 డెసిబిల్స్ వరకు మాత్రమే అనుమతిస్తారు. వాణిజ్య సముదాయాల్లో పగలు 65 డెసిబుల్స్, రాత్రి 55 డెసిబుల్స్, సున్నిత ప్రాంతాల్లో పగలు 50 డెసిబుల్స్, రాత్రి 40 డెసిబుల్స్కు అనుమతించారు.
పాఠశాలలు, కాలేజీలు, హాస్పిటల్స్, కోర్టుల పరిసరాల్లో 100 మీటర్ల వరకు నిశ్శబ్ద జోన్లుగా ప్రకటించారు.