న్యూఢిల్లీ, జూలై 10: కరోనా మహమ్మారి వ్యాప్తి నెమ్మదించలేదని, చాలా దేశాల్లో కేసులు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ హెచ్చరించారు. పలుదేశాల్లో డెల్టా వేరియంట్ ఉద్ధృతంగా ఉందని చెప్పారు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 5 లక్షల మంది కరోనా బారినపడ్డారని, 9,300 మంది చనిపోయారని తెలిపారు. వ్యాక్సిన్ల కొరత, డెల్టా వేరియంట్, కొవిడ్ నిబంధనలు పాటించకపోవడం కరోనా కేసుల పెరుగుదలకు కారణం అని ఆమె పేర్కొన్నారు. కాగా, అత్యవసర వినియోగ టీకాల జాబితాలో కొవాగ్జిన్ను చేర్చడంపై డబ్ల్యూహెచ్వో 4-5 వారాల్లో నిర్ణయం తీసుకొంటుందని సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. టీకా అనుమతికి కావాల్సిన అన్ని పత్రాలను భారత్ బయోటెక్ ఇప్పటికే సమర్పించిందని అన్నారు.