న్యూయార్క్: అంతర్జాతీయ విద్యార్థుల నుంచి ట్రంప్(Trump) సర్కారు లక్ష డాలర్ల ఫీజు వసూల్ చేసే ప్రణాళిక వేసింది. అమెరికా వర్సిటీల్లో విద్యాభాస్యం పూర్తి చేసిన తర్వాత అక్కడే పని చేయాలనుకుంటున్న స్టూడెంట్స్ నుంచి లక్ష డాలర్లు వసూల్ చేసే ఆలోచనలో ట్రంప్ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ దీనిపై కథనాన్ని రాసింది. హెచ్1-బీ వీసాదారుల నుంచి లక్ష డాలర్ల ఫీజు వసూల్ చేయాలన్న ప్రతిపాదనను అమెరికా కోర్టు కొట్టివేయడంతో.. ట్రంప్ సర్కారు కొత్త మార్గాన్ని అన్వేషిస్తున్నది. విద్యార్థులకు ఇచ్చే ఎఫ్-1 వీసాలకు ఎక్స్టెన్షన్గా భావించే ఆప్టికల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ వీసాలపై అధిక ఫీజును వసూల్ చేయాలని ఆ దేశ హోంశాఖ భావిస్తున్నట్లు ద వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో వెల్లడించింది. ఓపీటీ ప్రోగ్రామ్ ప్రకారం విదేశీ విద్యార్థులు తాము విద్యను పూర్తి చేసుకున్న ప్రాంతంలో సుమారు మూడేళ్ల వరకు పనిచేసే అవకాశం ఉంటుంది. 2024 నాటి రికార్డుల ప్రకారం సుమారు 4 లక్షల 19వేల విదేశీ విద్యార్థులు ఓపీటీ స్కీమ్ కింద అమెరికాలో పనిచేస్తున్నట్లు తెలిసింది. హెచ్1-బీ వీసాదారులపై లక్ష డాలర్ల ఫీజును వసూల్ చేయడాన్ని అమెరికాలోని టెకీ కంపెనీలు వ్యతిరేకించాయి. అమెరికా వర్సిటీల్లో చదివే విద్యార్థులకు ఆ కంపెనీలే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటాయి.