గువాహటి: అసోంలో గత బుధవారం అపహరణకు గురైన ఓఎన్జీసీ ఉద్యోగుల్లో ఇద్దరిని భద్రత బలగాలు రక్షించాయి. శుక్రవారం రాత్రి ఇండియన్ ఆర్మీ, అసోం రైఫిల్స్ సంయుక్తంగా గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ క్రమంలో నాగాలాండ్లోని మాన్ జిల్లాలో ఇద్దరు ఉద్యోగులను రక్షించారు. వారిని అలకేష్ సైకియా, మోహిని మోహన్ గొగోయిగా గుర్తించారు. మరో ఉద్యోగి కోసం గాలింపు కొనసాగుతున్నదని, ఘటన స్థలంలో ఏకే-47 రైఫిల్ లభించిందని, దానిని స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు.
గత బుధవారం తెల్లవారుజామున అసోంలోని శివసాగర్ జిల్లాలో లకువా ఫీల్డ్లోని రిగ్ సైట్ నుంచి ఓఎన్జీసీకి చెందిన ముగ్గురు ఉద్యోగులను సాయుధ దుండగులు ఎత్తుకెళ్లారు. వారిలో ఇద్దరు జూనియర్ ఇంజినీర్లు, ఒక జూనియర్ టెక్నీషియన్ ఉన్నారు. వారిని ఓఎన్జీసీకి చెందిన ఆపరేషనల్ వెహికిల్లో ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఆ వాహనాన్ని అసోం-నాగాలాండ్ సరిహద్దుల్లోని నిమోనగడ్ అటవీ ప్రాంతంలో వదిలివెళ్లారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..