HMDA | సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా అత్యంత మెరుగైన రోడ్డు నెట్వర్క్ను నిర్మించడమే లక్ష్యంగా చేసుకొని హెచ్ఎండీఏ శివారు ప్రాంతాల్లో కొత్త రోడ్లు నిర్మిస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం మహానగరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మాస్టర్ప్లాన్లో పొందుపర్చిన 33 రేడియల్ రోడ్లతో పాటు వాటికి అనుసంధానంగా లింకు రోడ్ల నిర్మాణం చేపట్టింది. కొత్తగా లింకు రోడ్ల నిర్మాణంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో పట్టణీకరణ మరింత వేగవంతమైంది. ఇప్పటి వరకు 137కు పైగా లింకు రోడ్ల నిర్మాణ పనులు చేపట్టగా, వీటిలో ఐటీ కారిడార్ పరిధిలోనే ఎక్కువగా త్వరితగతిన పూర్తయ్యాయి.
ఐటీ కారిడార్లోని తెల్లాపూర్ నుంచి ఔటర్ రింగు రోడ్డు వరకు రేడియల్ రోడ్డు నంబరు 7ను నిర్మించాలని ప్రతిపాదించారు. కేసీఆర్ ప్రభుత్వం రేడియల్ రోడ్డు 7 ఎక్స్టెన్షన్ పేరుతో తెల్లాపూర్ హుడా కాలనీ నుంచి ఓఆర్ఆర్ ఈదుల నాగులపల్లి మీదుగా మోకిల-కొండకల్ రోడ్డు వరకు రోడ్డును నిర్మించింది. గచ్చిబౌలి హెచ్సీయూ నుంచి గోపన్పల్లి మీదుగా వట్టినాగుల పల్లి వరకు మరో రహదారి నిర్మాణం చేపట్టింది. ఐటీ కారిడార్ను ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో నివాస ప్రాంతాలు పెద్ద మొత్తంలో విస్తరిస్తున్నాయి. ట్రాఫిక్ రద్దీ సైతం గణనీయంగా పెరుగుతున్నది. దీంతో మాస్టర్ప్లాన్కు అనుగుణంగా రహదారుల నిర్మాణంతో పాటు ఇప్పటికే చేపట్టిన రేడియల్ రోడ్ల నిర్మాణాలను మరింత ముందుకు పొడిగించేలా హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. రేడియల్ రోడ్డు 30కి పొడిగింపుగా కొత్తగా నల్లగండ్ల హుడా కాలనీలోని రేడియల్ రోడ్డు 7తో అనుసంధానం చేస్తూ రోడ్డు నిర్మాణం చేపట్టింది. అవసరం ఎక్కడ ఉందో గుర్తించి, అక్కడ క్షేత్ర స్థాయిలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏతో పాటు స్థానిక మున్సిపాలిటీ అధికారులతో కలిసి లింకు రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోనే భారీ ఎత్తున గేటెడ్ కమ్యూనిటీ, హైరైజ్ భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. దీంతో పెరుగుతున్న ట్రాఫిక్కు అనుగుణంగా మెరుగైన రోడ్ నెట్ వర్క్ను కల్పించేందుకు అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా లింకు రోడ్లను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా చేపట్టిన రెండు రేడియల్ రోడ్డు, వాటికి అనుసంధానంగా లింకు రోడ్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. ఇవి అందుబాటులోకి వస్తే ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఇక్కట్లకు చోటు ఉండదని స్థానికులు పేర్కొంటున్నారు.లింకు రోడ్ల ద్వారా ప్రధాన రహదారులపై ట్రాఫిక్కు భారీగా ఊరట కలగడంతో పాటు సమయం, ఇంధనం సైతం ఆదా అవుతుందంటున్నారు.
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిలో నిజాంపేట, కొంపల్లి, దుండిగల్, అమీన్పూర్తో పాటు ఐటీ కారిడార్ వైపు ఉన్న తెల్లాపూర్, నార్సింగి, మణికొండలు ఉన్నాయి. తెల్లాపూర్ నుంచి శంకర్పల్లి వరకు ఒక లింకు రోడ్డును నిర్మించేందుకు కేసీఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెల్లాపూర్ నుంచి ఈదులనాగులపల్లి వరకు రహదారిని నిర్మించారు. అక్కడి నుంచి మోకిల్, కొండకల్ ప్రాంతాలను కలుపుతూ శంకర్పల్లి వరకు రోడ్డును నిర్మిస్తున్నారు. ఇలా శివారు ప్రాంతాల్లో ఔటర్ రింగు రోడ్డు లోపలి వైపు, బయట వైపు ఉన్న ప్రాంతాలను కలుపుతూ.. కొత్త రోడ్లను నిర్మించడంతో మెరుగైన రోడ్డు నెట్ వర్క్ ఐటీ కారిడార్ వైపు అందుబాటులోకి వస్తోంది.