జైపూర్: ఆమె ఓ కానిస్టేబుల్. వివాహం నిశ్చయం అయ్యింది. ఈనెల 30న పెళ్లి వేడుక. ముందుగా నిర్ణయించిన ప్రకారం శుక్రవారం సాయంత్రం హల్దీ వేడుక జరగాలి. అయితే కరోనా విధుల్లో భాగంగా ఇంటికి వెళ్లలేకపోయింది. దీంతో తోటి కానిస్టేబుల్లే కుటుంబ సభ్యులు అయ్యారు. ముహూర్తం ప్రకారం ఆమెకు ఘనంగా హల్దీ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీస్ స్టేషనే వేదిక అయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. ఆషా అనే మహిళా కానిస్టేబుల్ రాజస్థాన్లోని దుంగార్పూర్ కొత్వాలీ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నది. గతేడాది మేలో జరగాల్సిన ఆమె వివాహం కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. అప్పుడే ఈ ఏప్రిల్ 30ని ముహూర్తంగా పెద్దలు నిశ్చయించారు. ఆ శుభఘడియ రానే వచ్చింది.
అయితే గత నెలరోజులుగా దేశమంతటా కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. రాజస్థాన్లోనూ భారీగా నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కర్ఫ్యూ అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో పోలీసులకు సెలవులవులు రద్దు చేశారు. ముందుగా అనుకున్న ప్రకారం శుక్రవారం సాయంత్రం ఆషాకు హల్దీ వేడుక నిర్వహించాలి. అయితే కరోనా కారణంగా ఆమెకు సెలవు లభించలేదు. అయితే ఈ విషయం తెలుసుకున్న స్టేషన్ ఇన్చార్జీ దిలీప్ దాన్ ఆమెకు సర్ప్రైస్ ఇద్దామని నిర్ణయించుకున్నారు. స్టేషన్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లతో శుక్రవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఆమెకు నిర్వహించారు.
హల్దీ వేడుకకు వెళ్లడానికి కుదరడంలేదని తెలుకున్న మేము.. స్టేషన్లో ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నామని దిలీప్ దాన్ వెల్లడించారు. ఈ వేడుకను ఇంట్లో ఎలాగైతే నిర్వహిస్తారో ఇక్కడ కూడా అదేవిధంగా చేశామన్నారు. దీంతో ఆషాకు మేము సర్ప్రైస్ చేశామన్నారు. కాగా, ఆమెకు శుక్రవారం రాత్రి సెలవు మంజూరయ్యిందని, ఇక ఆమె తన ఊరికి వెళ్లొచ్చని ఆయన చెప్పారు. కరోనా నిబంధనల కారణంగా ఈ కార్యక్రమానికి ఆషా తల్లిదండ్రులు హాజరుకాలేకపోయారని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..