Loksabha Elections 2024 : ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో మొత్తం వీవీప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపధ్యంలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా జరిగే పోరాటం ముగిసిపోదని అఖిలేష్ వ్యాఖ్యానించారు. ఇది దీర్ఘకాలిక పోరాటమని ఆయన స్పష్టం చేశారు. ఈవీఎంలపై సర్వోన్నత న్యాయస్ధానం తీర్పును అందరూ అంగీకరించినా పోలింగ్ మెషీన్లకు వ్యతిరేకంగా జరిగే పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు.
వీవీప్యాట్, ఈవీఎంలపై మున్ముందు సుదీర్ఘ పోరాటం సాగుతుందని అన్నారు. ప్రపంచంలోని పలు దేశాలు ఈవీఎంలను విశ్వసించడం లేదని, వాటిని ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించడాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని అఖిలేష్ పేర్కొన్నారు. ఈవీఎంల వాడకాన్ని రాజ్యాంగ విరుద్ధమని జర్మనీ సహా పలు దేశాలు వ్యవహరిస్తున్నాయని గుర్తుచేశారు.
జర్మనీ, నెదర్లాండ్స్, అమెరికా వంటి పలు అభివృద్ధి చెందిన దేశాలు ఈవీఎంల వాడకాన్ని నిషేధించాయని చెప్పారు. విపక్ష ఇండియా కూటమి, ఎస్పీలకు పట్టం కడితే కేంద్రంలో ఏర్పాటయ్యే తమ ప్రభుత్వం ఈవీఎంల వాడకాన్ని నిలిపివేస్తుందని అఖిలేష్ హామీ ఇచ్చారు. ఇప్పటికే రెండు దశల పోలింగ్ ముగిసిందని విపక్ష కూటమికి దేశ ప్రజలంతా అండగా నిలిస్తే తాము ఈవీఎంల వాడకాన్ని నిషేధిస్తామని చెప్పారు.
Read More :