చెన్నై: తమిళనాడు సీఎం విజయ్(CM Vijay) ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలకు భారీ బొనాంజా ప్రకటించారు. ప్రతి ఎమ్మెల్యేకు ఓ కారు, పెట్రోల్ అలెవన్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చెప్పారు. తమిళనాడులో మొత్తం 234 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు వారందరికీ ప్రభుత్వం తరపున ఓ కారు అందనున్నది. దాని పెట్రోల్, మెయింటెనెన్స్ ఖర్చులు ప్రభుత్వమే ఇవ్వనున్నది. నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యేలు నిత్యం ప్రయాణం చేయాల్సి ఉంటుందని, ప్రభుత్వ వాహనం వల్ల పారదర్శక, అవినీతిలేని ప్రభుత్వాన్ని నడపవచ్చు అని అన్నారు.
పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేనివారు ఈసారి చాలా మంది ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, ప్రజా ప్రతినిధిగా తమ విధులను డిశ్చార్జ్ చేసేందుకు ఓ కారు అవసరమని అసెంబ్లీలో విజయ్ పేర్కొన్నారు. తమకు లాజిస్టిక్స్ సపోర్టు లేదని, కార్లు ఇవ్వాలని వీసీకే ఎమ్మెల్యే జ్యోతిమణి ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే కారు డ్రైవర్, ఇంధనం, మెయింటేనెన్స్ ఖర్చుల కోసం 75 వేలు ఇవ్వనున్నారు. ఎమ్మెల్యేలకు సెక్రటరీలను కూడా ఇవ్వనున్నారు. వారి కోసం అదనంగా 25వేలు ఖర్చు చేయనున్నారు. సీఎం ప్రకటనను ఎమ్మెల్యేలు స్వాగతించారు.