హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా గెలుపొంది పార్టీ మారిన కడియం శ్రీహరిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నుంచి కడియంకు భారీగా డబ్బులు అందాయని ఆరోపించారు. అవినీతితో వందల కోట్లు సంపాదించారని విమర్శించారు. ఆ సొమ్ముతో తన కూతురు కడియం కావ్యను లోక్సభ ఎన్నికల్లో గెలిపించుకోవడానికి ఓటుకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు ఇవ్వబోతున్నాడని చెప్పారు. కూతురికోసం రూ.100 కోట్లు ఖర్చ పెట్టనున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. అవినీతిపరుడైన కడియంను ఈ ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కుమార్తె కడియం కావ్య కోసం స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికార కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ ఆమెకు టికెట్ ఇచ్చినప్పటికీ.. దానిని కాదని హస్తం పార్టీ తీర్థంపుచ్చుకున్నారు. దీంతో వరంగల్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా పార్టీ అధినే కేసీఆర్.. సుధీర్ మాదిగను ప్రకటించారు.