మాదాపూర్, ఏప్రిల్ 26: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపునకు శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి శుక్రవారం హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని గంగారం విలేజ్, మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రాబోస్ నగర్ కాలనీలో పాదయాత్ర చేసి.. కరపత్రాలను ఇంటింటికీ అందజేశారు.
చేవెళ్ల గడ్డపై కాసానిని అత్యధిక మెజార్టీతో గెలిపించి.. కేసీఆర్కు కానుకగా అందిద్దామన్నారు. హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజలను ఉచిత హామీలతో మభ్యపెట్టే ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ప్రజలకు ఎల్లప్పుడు అండగా నిలుస్త్తూ వస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనన్నారు.