Supreme Court | గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానం ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంబానీ నామినేషన్ తిరస్కరణకు గురైంది. మిగతా అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. అయితే, సూరత్ ఎన్నికకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే, ఓటర్లు నోటా ఆప్షన్పై ఓటుహక్కు ప్రాతిపదికన పిటిషన్ దాఖలు చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురై.. ఇతర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్న తర్వాత నోటాకు ఓటు వేసే అవకాశం ప్రజలకు ఉంటుందని పిటిషన్లో పేర్కొన్నారు. దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించడంతో ఓటర్లు తమ ఓటుహక్కును కోల్పోయారని.. నోటా విశ్వసనీయతను కాపాడుకోవాలంటే సూరత్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని పిటిషన్లో కోరారు.
ఈ సందర్భంగా పిటిషనర్ ప్రతాప్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటర్లకు ఎలాంటి అవకాశం లేకుండా చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేననన్నారు. ఓటర్ల నుంచి నోటా ఆప్షన్ను లాక్కోవడమే అవుతుందన్నారు. ఇది ఏ విధంగా సరైందని చెప్పలేమని.. ఓటర్ల హక్కులను కాపాడేందుకు సూరత్లో ఎన్నికలు నిర్వహించడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
సుప్రీంకోర్టు న్యాయవాది అశ్వినీ కుమార్ దూబే మాట్లాడుతూ.. ఇప్పటి వరకు పోటీలో ఒకరే అభ్యర్థి ఉన్న సమయంలో ఏకగ్రీవంగా ఉన్నట్లు ప్రకటించే విధానం ఉందన్నారు. నోటా ఆప్షన్ వచ్చిన తర్వాత అతి ప్రతి ఓటరు రాజ్యాంగ హక్కుగా మారిందన్నారు. ఈ విషయంలో ఇంకా ఎలాంటి ఏర్పాట్లు లేవన్నారు. అయితే, ఈ వ్యవహారంలో తన వైఖరిని చెప్పాలని ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిందన్నారు. విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉందన్నారు.