Goreti Venkanna | పల్లె కన్నీటిని ప్రపంచానికి పరిచయం చేసిన కలం. మన సంత గురించి మనసంతా మురిసేలా పాడిన గళం. కాటుక చీకటిని సైతం పండు వెన్నెలంత గొప్పగా వర్ణించిన వైనం. నల్లతుమ్మలోనూ కల్పతరువును చూసిన కళాత్మక హృదయం. మలిదశ తెలంగాణ ఉద్యమ వీచికలో విజృంభించిన గీతిక మన గోరటి వెంకన్న. పల్లెపాటల మొనగాడు, పదాలను పరిపరి విధాల ప్రయోగించిన మాటల చెలికాడు. తెలంగాణ భాషకు తన కవిత్వంతో పరిమళాలు అద్దిన ఆధునిక వాగ్గేయకారుడు. ‘వల్లంకి తాళం’ కవితా సంకలనంతో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న గోరటి వెంకన్న ‘జిందగీ’తో పంచుకున్న అనుభవాలు..
మీ ఊరు సంతలో సంబురంగా ఎత్తిన కలం, గళం ఇప్పుడు సాహిత్య పురస్కారం అందుకున్నది. ఎలాంటి అనుభూతికి లోనవుతున్నారు?
చాలా ఆనందంగా ఉంది. ఊహించని పురస్కారం ఇది. జీవితంలో ఎప్పటికైనా వస్తుంది అనుకున్నాను గానీ, ఇప్పుడు వస్తుందని ఊహించలేదు. నాకు పురస్కారం ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ గొప్పదనానికి కృతజ్ఞతలు.
మానవీయ సంస్కృతి, ప్రకృతి వనరుల ప్రాధాన్యం, వన సౌందర్యం.. ఇలా విభిన్న అంశాల మేళవింపుతో ‘వల్లంకి తాళం’ కవితా సంపుటిని ఆవిష్కరించారు. సాహిత్య అకాడమీ పురస్కారం రావడంతో కవితా సంపుటి లక్ష్యం పరిపూర్ణమైందని అనుకోవచ్చా?
ఈ పురస్కారం రావడం వల్ల నా కవితా సంపుటికి విశేషమైన ఆదరణ కలుగుతుందని భావిస్తున్నా. నాకు బలగం లేదు. ఒక పుస్తకం తేవాలంటే మాటలు కాదు. రాయడం వరకే నా పని. ఎన్నో సంకలనాలు అచ్చుకు నోచుకోకుండా అలాగే ఉండిపోయాయి. సాహిత్య పురస్కారం ఫలితంగా ‘వల్లంకి తాళం’ వేర్వేరు భాషల్లోకి కూడా తర్జుమా అవుతుంది. నా భావజాలం మరింత విస్తృతంగా ప్రజల్లోకి చేరుకుంటుందని నమ్ముతున్నా.
మాటా, పాటా.. ఈ బలాలు మీరు ఎక్కడి నుంచి పొదుగుకున్నారు?
నా పాటలకు ఊట మా పల్లెలే. నాగర్ కర్నూల్ జిల్లా గౌరారం మా గ్రామం. మాది పెద్ద బలగం. మా ఊళ్లో వాళ్లు, వీళ్లు అందరూ నా మాటను ప్రభావితం చేసినవారే. మా చుట్టాలు, ఊళ్ల ఉండే మనుషులు, వాళ్ల ప్రేమతోనే నా మాటకు, పాటకు చేవ చేకూరింది. ఈ ఒరవడిలో నా పాత స్నేహితుల పాత్ర కూడా ఉంది. కూలికి పోయే వ్యక్తి నుంచి భూస్వామి వరకు రకరకాల స్నేహితులు ఉండేవారు. మా ప్రతి కలయికా నాకు పాఠంగా ఉపయోగపడింది.
మీ నాన్నగారు యక్షగాన కళాకారుడు కదా! మరి మీరేమో పల్లెపాటలతో ఆధునిక వాగ్గేయకారుడిగా ఖ్యాతి గడించారు. ఈ భిన్నత్వం ఎలా సాధ్యమైంది?
మా నాన్న నర్సింహ మంచి యక్షగాన కళాకారుడు. సూక్ష్మగ్రాహి. ఎక్కువ మాట్లాడేటోడు కాదు. ఎప్పడూ నవ్వుముఖంతో ఉండేవాడు. ఆయనకు కోపం తెలియదు. ఎవరినీ బాధపెట్టంగ చూడలేదు. గొప్ప సంస్కారవంతుడు. చిన్నప్పుడు నేనెప్పుడూ బడి ఎగ్గొట్టాలని చూస్తుండే. చదువుకోవద్దని అనుకుంటుండే! మా మామలకు ఎడ్లుంటుండే, మాకూ పశువులు ఉంటుండే. వీటెంబటి తిరగాలని ఉండేది నాకు. అయితే, మా నాన్న పెద్దగా చదువుకోలేదు. ఆయనకు అంబేడ్కర్ మహాశయుడి గురించి కూడా తెలియదు. అలాంటి నాన్న ‘చదువుకుంటే గొప్పోళ్లు అయితరు బిడ్డా!’ అనేటోడు. నాన్నే నాకు తొలి గురువు. అక్షరాలు, సంయుక్తాక్షరాలు నాన్నే నేర్పిండు. రెండో తరగతి దాకా ఇంట్లోనే! ఆయనే నా తొలిగురువు. నాన్న శతక పద్యాలు పాడుతుంటే ఆదమరచి వినేటోణ్ని. మా అమ్మ ఈరమ్మ మంగళ హారతులు చక్కగ పాడేది. ఆ దంపతుల కడుపున పుట్టడమే నేను చేసుకున్న అదృష్టం. వారి వల్లనే సాహిత్యంపై మమకారం ఏర్పడింది. నాన్నది మంచి గాత్రం. యక్షగానాలు అద్భుతంగా పాడేవాడు.
ఆరేడేండ్ల వయసులోనే పాటలు పాడేవారు కదా! మీ పాఠశాలలో మిమ్మల్ని ప్రత్యేకంగా చూసేవారా?
చిన్నప్పుడు బడిలో నేను ప్రత్యేకమనే చెప్పాలి. దోస్తులంతా నన్ను గొప్పగా చూసేటోళ్లు. ఐదో తరగతిలో ఉండంగ నేను వీరపాండ్య కట్టబొమ్మన, మాయల ఫకీర్, అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయాలు చేసిన. దోస్తులంతా నన్ను హీరోలా చూసేది.
మొదట్లో పద్య సాహిత్యం, భావకవిత్వంపై ఆసక్తి ఉన్న మీరు, తర్వాత మానవీయ బంధాలు, మనుషుల బాధలపై దృష్టి సారించారు. మీ పంథా మార్చుకోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా?
మొదట్లో పద్య కవిత్వంపై ఇష్టం ఉండేది. దువ్వూరి రామిరెడ్డి గారి పద్యాలు అలవోకగా పాడేది. నేను, నా స్నేహితుడు ఛందస్సులో పద్యాలు కూడా రాసేటోళ్లం. వెంకట్రెడ్డి సార్ రాకతో నా దృక్పథం మారింది. ఆయనకు మార్క్సిస్ట్ భావజాలం ఉండేది. ఆయన వచ్చిన తర్వాతనే చదువుల్లో రాణించాను. నా వ్యక్తిత్వంలో కూడా మార్పు వచ్చింది. గోవర్ధన్రెడ్డి సార్ లెక్కలు చెప్పేవారు. ఆయన లెక్కలు కూడా కళాత్మకంగా చెప్పేవారు. వెంకట్రెడ్డి సార్ ఇంగ్లిష్ బోధించేవారు. ఇద్దరూ నాపై ప్రత్యేక శ్రద్ధ చూపేది. ఇంట్ల పెట్టుకొని పాఠాలు చెప్పేది. వారి చలువ వల్ల పదో తరగతి పాసైన. వెంకట్రెడ్డి సార్ ప్రభావంతోనే మార్క్సిస్ట్ భావజాలం వైపు అడుగులు వేశాను. పద్యాలు, భావ కవిత్వం నుంచి ఇటువైపు వచ్చా.
మార్క్సిజం, నక్సలిజం వైపు ఆకర్షితులైనా మీ పాటల్లో, కవితల్లో పచ్చదనం మాత్రం అంతే చిక్కగా ఉండటానికి కారణం?
అది మా ఊరు గొప్పదనమనే చెబుతాను. మా ఊరు చుట్టూ చెట్లే ఉంటుండే. చెట్లను చూస్తే ఓ ఆనందం కలిగేది. మోదుగలు పూస్తే సంతోషం. చిన్నప్పుడు మోదుగ చెట్టు ఎక్కి కూసునేది. చెట్లు, చేలు ఇదే ప్రపంచం. సజ్జ, జొన్న మొక్కలతోని మాట్లాడేటోణ్ని. మక్కకంకితోని ముచ్చట్లు పెడుతుండే. వాటితో కాలం గడుపుతుంటే మనిషితోనే ఉన్నానన్న భావన కలిగేది.
మీ పాటల్లో స్థానికత ఎక్కువగా కనిపిస్తుంటుంది. పదాల పోహళింపు కూడా వైవిధ్యంగా ఉంటుంది. భాషపై ఇంత పట్టు ఎలా సాధించగలిగారు?
నాపై వ్యావహారిక భాష ఉద్యమ ప్రభావం ఉంది. ప్రజల భాష గొప్పదనే భావన నాది. గంగు, గద్దరన్న, నాజర్ అన్న పాటలు బాగా వినేవాణ్ని. అలాగే వేమన ప్రభావం కూడా ఉండొచ్చు. చదువుకునే రోజుల్లో అన్నమయ్య గీతాలు ఇష్టపడేవాణ్ని. వైవిధ్యమైన తెలుగు పదాలు ఎన్నో ప్రయోగించిండు ఆయన. యక్షగాన సాహిత్యంలో అందమైన తెలుగు ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా నా భాషంతా మా ఊళ్లో నుంచి వచ్చిందే అని నమ్ముతా. మా దోస్తులది గాలిబ్యాచ్ ఉంటుండే! వాళ్లతో పిచ్చాపాటీ మాట్లాడుకునేటోళ్లం. ఆ మాటలే నాకు ఊట అయిందేమో అనిపిస్తుంటది. ప్రాచీన సాహిత్యంపై అపారమైన గౌరవం ఉంది. చాలా పుస్తకాలు చదివిన. అర్థం కాని విషయాలు పెద్దలను అడిగి తెలుసుకునేటోణ్ని. అయితే, వాటిని బలవంతంగా ఎన్నడూ ఉపయోగించే ప్రయత్నం చేయలేదు. నా కవితలు, పాటలు అప్రయత్నంగా జాలువారుతాయి. ‘జీవనసారం నిలుపుకొన్న ఆ పామరులే నిజ సిద్ధులు రా’ అని రాసుకున్నా. పామరత్వంపై నాకు ఎంతో గౌరవం. అదే నా పాండిత్యం. అదే నా బలం. ఏ పాట రాసినా కృష్ణశాస్త్రి, ఆముక్తమాల్యద, కృష్ణదేవరాయలు, శ్రీనాథుడు, వ్యాసవాల్మీకాదులు ..వీరంతా మెదులుతూనే ఉంటారు. అయితే, అందరినీ మర్చిపోయి నా పంథాలో నేను రాసుకుంటూ పోతుంటా. సహజంగా వచ్చేస్తాయంతే. నా భాషే కవితా వస్తువును నిర్ణయిస్తుందేమో అనిపిస్తుంది.
ఎవరూ అంతగా ప్రాధాన్యం ఇవ్వని చీకటి, తుమ్మచెట్టు ఇలా విభిన్నమైన అంశాలను కవితా వస్తువులుగా ఎంచుకుంటారు ఎందుకు?
ఈ పాటలు బాగా తెలిసి రాయలేదు. సృష్టిలోని ప్రతి వస్తువు, లోకంలో జరిగే ప్రతి సంఘటన మీద నాకు మమకారం ఉంటుంది. రాత్రి, చీకటి, పగలు, వెన్నెల వేటికవే వైవిధ్యమైనవి. చీకటి కూడా కనిపించని విషయమేదో చెప్తది. ఊళ్లో నైరాశ్యం అలుముకున్నప్పుడు దుఃఖంలో చీకటి పాట రాశాను. నా మొత్తం సాహిత్యంలో ఇష్టమైన పాటల్లో ఇదీ ఒకటి. నల్లతుమ్మ నాకు బాగా నచ్చిన పాట. ఓ రోజు తుమ్మచెట్టు కనిపించింది. దాని కింద కూర్చుని రాసిన పాట ఇది.
ఒళ్లంత ముళ్లున్న ఒడి మెత్తనోయమ్మ
కొల్లలుగ పిట్టలకు కొలుపు నీ ఇల్లమ్మ
కాటుకా పూతలా నీ తనువు నలుపున్న
కడుపులో జాలోలె పసుపూరుతావమ్మ.. ఓ నల్లతుమ్మా!
ఇప్పుడు ఆలోచిస్తుంటే అంతగా ప్రాధాన్యం లేని వాటిని కవితాంశాలుగా ఎంచుకోవడం వెనుక వాటిపై ఉన్న ఆపేక్ష, సమదృష్టే కారణం. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనే భావన నాకెప్పుడూ ఉండదు. వెన్నెల బాగుంటది, చీకటి బాగుండదన్న ఆలోచనే రాదు. అలాగని చీకటికీ, వెన్నెలకూ పోటీ పెట్టను. దేని సౌందర్యం దానిది. ఇవేవీ తెలిసి చేసినవని అనుకోను. ఇలా ఎలా రాశానని ఇప్పుడు అనిపిస్తుంటుంది. కానీ, రాయాలని బలవంతంగా కూర్చొని రాసినవి కావు. నాకు బాధనో, ఆనందమో అయితే రాసిన. నా అంతరంగంలో ఏ భావన కలిగితే అది రాసిన. పేరుకోసం రాయలే. బహుశా అచలగురు సిద్ధ సంప్రదాయం ప్రభావం ఇందుకు ప్రేరణ కావచ్చు.
పద్య రచనలోనూ ప్రావీణ్యం ఉండేది కదా! ఆ దిశగా ప్రయాణం అసంపూర్ణంగా మిగిలిపోయిందని ఎప్పుడైనా అనిపిస్తుంటుందా?
పద్యం నాకు చాలా ఇష్టం. నాకు వందల పద్యాలు కంఠస్థం వచ్చు. బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి హరిశ్చంద్ర పద్యాలు దాదాపు 300 వరకు ఉంటే, 150 కంఠతా వచ్చు. పద్యం అంటే అంత మమకారం. అయితే పద్యాలకు దూరమయ్యానన్న భావన కలుగుతుంటుంది. చిన్నప్పుడు ఛందస్సు బాగా వచ్చేది. మర్చిపోయిన వ్యాకరణాన్ని మిత్రుడు కోటేశ్వరరావు దగ్గర నేర్చుకుంటున్నా. తేటగీతిలో పద్యాలు రాస్తున్నా. త్వరలోనే ఓ సంపుటి తీసుకొస్తున్నా.
పల్లెల గురించి, నగరాల గురించి పూర్తి సాధికారతతో మాట్లాడుతారు. చరిత్రపై ఎలా పరిశోధన చేస్తారు?
నేను ఏ ఊరికైనా వెళ్తే ఊరికే ఉండను, ఆ ప్రాంతం గురించి అన్ని వివరాలు తెలుసుకుంటా. సంచారం, చదవడం.. ఈ రెండూ నాకు ఆసక్తి. తెలంగాణతోపాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలన్నీ బాగా తిరిగిన. ఆయా ప్రాంతాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటా. ‘పూసిన పున్నమి వెన్నెల మేన తెలంగాణ వీణ’ గీతం తెలంగాణ చరిత్రను ఆవిష్కృతం చేస్తుంది. శ్రీరాములయ్య సినిమాలో రాసిన ‘ననుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ..’ పాటలో అక్కడి విశేషాలన్నీ వివరించే ప్రయత్నం చేసిన. ఉత్తరాంధ్ర గురించి ‘ఆలమందల అరుపు పాడిపంటల మెరుపు..’ పాటలో విశిష్టతపై స్పష్టతతో రాసిన. బండి నారాయణస్వామి గారు నా పాట గురించి చెబుతూ ‘క్షేత్రం నా పాటకు బలం’ అన్నారు. అది నిజమేనేమో!
వాగ్గేయకారుడిగా గొప్ప ఆదరణ చవిచూశారు. ప్రజాప్రతినిధిగా మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏమిటి?
ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఇచ్చిన గొప్ప అవకాశం ఇది. దీనిని బాధ్యతగా నిర్వర్తిస్తున్నా. అనారోగ్యంతో బాధపడుతూ ఎవరొచ్చినా నా చేతనైనా సాయం చేస్తా! సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో వెంటనే స్పందిస్తా. అధికారులు కూడా నేను చెప్తే వెంటనే పని చేస్తుండటం సంతోషంగా ఉంది. మనం ఎంత కవిత్వం రాసినా, మన దగ్గరికి వచ్చినవారికి సాయం చేయడంలో ఉన్న తృప్తి గొప్పది. మండలిలోనూ కళలు, కళాకారుల గురించి స్పష్టంగా మాట్లాడే అవకాశం వచ్చింది. నా పరిధిలో నలుగురికీ అందుబాటులో ఉంటూ, నా బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తున్నా.
1994 ప్రాంతంలోనే తెలంగాణ వెనుకబాటుతనంపై ఎన్నో పాటలు రాశాను. ‘రేలా దూలాతలాళ్లడే నేలా.. నా తెలంగాణ..’ పాట అప్పుడు రాసిందే. అవన్నీ మలిదశ ఉద్యమంలో ‘ధూం ధాం’ వేదికలపై ప్రతిధ్వనించాయి. ఉద్యమ సమయంలో ఎన్నో పాటలు రాశాను. ‘ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా!’, ‘జబ్బకు సంచి చేతిల జెండా’, ‘మందెంట పోతుండె ఎలమంద..’ లాంటి గీతాలతో మలిదశ ఉద్యమంలో నా గొంతు వినిపించిన.
నా బాల్యం నుంచీ నల్లమల సౌందర్యం మనసారా ఆస్వాదించాను. మా ఊళ్ల చుట్టూ ఆ అడవే. తీరిక దొరికితే అడవులపొంటి వెళ్తుంటా. నాకు జ్ఞానం కావాలనుకున్నప్పుడు అడవితల్లి ఒడిలోకి చేరుకుంటా. అక్కడి చెంచుకోనల్లో రోజులకు రోజులు గడుపుతా. చెంచుకోనలో మల్లయ్య అనే తాత్వికుడు ఉంటడు. ఆయనతో తిరుగుతా. కల్మషం లేని ఆ నల్లమల కాన అంటే నాకు ప్రత్యేక అభిమానం.
మా మిత్రమండలితో ఇప్పటికీ నాటకాలు వేస్తుంటాం. నాగర్కర్నూల్ స్నేహితులు కేశవాచారి, వెంకటపతి, నర్సింహారెడ్డి, రాములు తదితరులతో కలిసి నెల, నెలన్నరకు ఒకటి చొప్పున ఏడాదికి పది పద్య నాటకాలు వేస్తుంటం. వచన కవిత్వం ‘సూర్య బేతాళం’ త్వరలో రాబోతున్నది. సంగీతంపైనా మమకారం ఉంది. అయితే, ఆ జోలికి వెళ్తే.. కవిత్వం పోతుందని నా ఇష్టాన్ని అణచుకున్నా.
నా పిల్లలే నాకు వరం. ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకు. అందరూ సెటిలయిండ్రు. వంద రూపాయలిస్తే పది మాత్రమే ఖర్చు పెట్టి, తొంభై రూపాయలు వెనక్కి తెచ్చిస్తరు. చాలా కష్టాలు పడ్డం. కారు అంత రూమ్ల కూడా ఉన్నం. వాళ్లకు మంచి-చెడు తెలుసు. అందరూ బాగా చదువుకున్నరు. ఇప్పుడు హాయిగా ఉంటున్నరు.
✍ కణ్వస
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
2021లో మహిళల కోసం జిందగీ అందించిన ప్రత్యేక కథనాలు మీకోసం..
Gray hair | చిన్నవయసులోనే తల నెరిసిన వారికి ఈమె ఓ ఇన్స్పిరేషన్.. ఎందుకంటే?
Vijayalakshmi | చదివింది పదో తరగతే కానీ.. చేసేది కోట్ల బిజినెస్
shaik saleema | తెలంగాణలో తొలి ముస్లిం ఐపీఎస్గా షేక్ సలీమా రికార్డ్.. ఆమె బ్యాక్గ్రౌండ్ ఇదీ..
Saami Saami | పుష్పలో సామీ సామీ పాట పాడిన మౌనికకు ఇన్స్పిరేషన్ ఈమెనే
విదేశాలకూ తెలంగాణ రుచులను అందిస్తున్న కరీంనగర్ మహిళలు
మూడేండ్ల క్రితం దాకా టీ పెట్టడం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్టర్ చెఫ్
sheela bajaj | 78 ఏండ్ల వయసులో వ్యాపారం మొదలుపెట్టిన బామ్మ
వైకల్యం వారి ప్రతిభకు అడ్డం కాలేదు.. మోడలింగ్లో దూసుకెళ్తున్న కేరళ యువతులు