హైదరాబాద్: హైదరాబాద్లో ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి భక్తులు తొలి బోనం సమర్పించారు. ఆలయ కమిటీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. ఉత్సవాల్లో భాగంగా లంగర్హౌస్ నుంచి తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫుణ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత బోనాల పండుగ ఘనంగా జరుగుతున్నదని చెప్పారు. భాగ్యనగరంలోని అన్ని ఆలయాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. గతేడాది కరోనాతో పండుగ జరుపుకోలేకపోయామన్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ బోనాలు జరుపుకోవాలని మంత్రి తలసాని సూచించారు.
ఆదివారం ప్రారభమైన ఆషాఢ బోనాలు వచ్చే నెల 8వ తేదీవరకు కొనసాగనున్నాయి. ప్రతి ఆదివారం, గురువారం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పి్స్తారు. గోల్కొండ బోనాల సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 600 మందికిపైగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు విధిగా కరోనా నిబంధనలు పాటించాలి అధికారులు కోరారు.