కాందహార్: ఆఫ్ఘనిస్థాన్లో మరోసారి తాలిబన్లు ఒక్కో ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటుండటంతో అక్కడి భారత అధికారులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చే పని ప్రారంభించింది ప్రభుత్వం. ఇప్పటికే కాందహార్లోని ఇండియన్ కాన్సులేట్ నుంచి 50 మంది దౌత్యవేత్తలు, ఇతర సిబ్బందిని తరలించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆఫ్ఘనిస్థాన్లో దిగజారుతున్న భద్రతా పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, అక్కడి భారతీయుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పిన విషయం తెలిసిందే.
ఆఫ్ఘనిస్థాన్లో అమెరికా తన బలగాలను ఉపసంహరించుకుంటుండటంతో అక్కడ గత కొన్ని వారాలుగా వరుసగా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. సుమారు రెండు దశాబ్దాల పాటు అమెరికా మిలిటరీ ఆఫ్ఘనిస్థాన్లో ఉంది. ఆగస్ట్ చివరిలోగా బలగాలను మొత్తం ఉపసంహరించాలని అమెరికా భావిస్తుండటంతో అక్కడ మళ్లీ తాలిబన్లు రాజ్యమేలడానికి సిద్ధమవుతున్నారు.