KTR | సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుడు ఆడిచర్ల సాయి కుటుంబ సభ్యులను గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కరీంనగర్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పరామర్శించారు. సిరిసిల్ల పట్టణంలోని పద్మనగర్కు చెందిన అడిశర్ల కైలాసంకు భార్య పద్మ, ఇద్దరు కొడుకులు మహేందర్, సాయి, కూతురు మౌనిక ఉన్నారు. కూతురికి పెండ్లి చేశాడు. నేత కార్మికుడైన కైలాసంకు పదేళ్ల క్రితమే పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయింది. వైద్యఖర్చుల కోసం రూ. పదిలక్షలు అప్పు అయ్యింది. చిన్నపాటి పెంకుటిల్లు కూలిపోవడంతో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.
పెద్దకొడుకు మహేందర్ మెడికల్ ఏజన్సీలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. చిన్న కొడుకు సాయి (26) సిరిసిల్ల పట్టణంలోని ఓ వస్త్ర యజమాని వద్ద మరమగ్గాలకు బీములు పోసే (వార్పిన్) పనిచేస్తున్నాడు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి చేతినిండా పనికల్పించింది. ప్రభుత్వం మారిన తర్వాత వస్త్రపరిశ్రమలో సంక్షోభం నెలకొంది. దీంతో వేలాది మంది ఉపాధి కోల్పోయారు. వార్పిన్లు కూడా బంద్ పడి సాయి ఉపాధి కోల్పోయాడు. ఇంటి వద్దనే ఉండి తండ్రిని చూసుకుంటున్నాడు. నాలుగు నెలలుగా పనిలేక పోవడంతో మానసికంగా కుంగిపోయాడు. ఇంటి అద్దె చెల్లించలేక, కుటుంబాన్ని పోషించలేక మనస్తాపం చెందాడు. గురువారం సాయంత్రం ఇంట్లోనే చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.