సిమ్లా: పుట్టింట్లో ఉన్న భార్యతో ఒక వ్యక్తి ఫోన్లో గొడవ పడ్డాడు. అయితే భార్యపై కోపాన్ని కుమారుడిపై చూపించాడు. అతడి వద్ద ఉంటున్న ఆరేళ్ల కొడుకును వంతెన పై నుంచి నదిలోకి విసిరేశాడు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చి లొంగిపోయాడు. (Man Throws Son Into River) హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హితేష్ కుమార్ గత ఏడాది కాలంగా పరేల్లోని ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. రోజువారీ కూలీగా అతడు పనిచేస్తున్నాడు. అతడి భార్య గత నెల రోజులుగా చిన్న కుమారుడితో కలిసి అమృత్సర్లోని పుట్టింట్లో నివసిస్తున్నది. ఆరేళ్ల పెద్ద కుమారుడు గగన్దీప్ అతడి వద్ద ఉంటున్నాడు.
కాగా, ఆగస్ట్ 10న రాత్రి వేళ హితేష్ కుమార్ ఫోన్లో భార్యతో గొడవపడ్డాడు. ఆ తర్వాత కుమారుడు గగన్దీప్ను పరేల్ వంతెన వద్దకు తీసుకెళ్లాడు. ఉధృతంగా ప్రవహిస్తున్న రావి నదిలోకి ఆ బాలుడ్ని విసిరేశాడు. మంగళవారం తెల్లవారుజామున పోలీస్ హెల్ప్లైన్కు అతడు ఫోన్ చేశాడు. తన కుమారుడ్ని నదిలోకి విసిరేసినట్లు చెప్పాడు.
మరోవైపు పోలీసులు తొలుత హితేష్ మాటలను నమ్మలేదు. అయితే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. అతడు నివసిస్తున్న అద్దె ఇంట్లో ఆ బాలుడు కనిపించకపోవడంతో కుమారుడ్ని అతడు నదిలోకి విసిరేసినట్లు నిర్ధారించారు. దీంతో ఆ బాలుడి కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆ పిల్లవాడి మృతదేహం ఇంకా లభించలేదు.
నిందితుడైన హితేష్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి భార్య మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను కూడా పోలీసులు విచారిస్తున్నారు. కుమారుడ్ని నదిలోకి విసిరేసే ముందు ఆ దంపతుల మధ్య ఏం గొడవ జరిగింది అన్నది తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.