Kasi Majili Kathalu Episode 49 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : మణిభద్ర అగ్రహారంలో ఉండే దేవశర్మకు మతి చలించింది. ‘అంతా విచిత్రమే’ అని గొణుక్కుంటూ దేశాటన చేస్తుండేవాడు. అతనికి… ‘అంతా దైవాధీనం’, ‘ఎవరికెవరూ లేరు’ అని గొణుక్కునే మరో ఇద్దరు పిచ్చివాళ్లు తోడయ్యారు. దైవాధీనానికి అనుకోకుండా రాకుమారి మాలతితో పెళ్లయింది. ఆ తరువాత అడవిలో ఒక మర్రిచెట్టు వద్దనుంచి మాలతిని రక్షించారు వాళ్లు ముగ్గురూ.
“నాన్నా! ఎందుకలా చేశారు? దైవ సపర్య చేయాలని చెప్పి.. నన్ను అర్ధరాత్రివేళ చీకట్లో తీసుకువెళ్లింది అందుకా?! ఆవేళ జరిగింది పూజ కాదా?! నా పెళ్లా?! ఇలాంటి పరువు తక్కువ పని ఎందుకు చేశారు?!” తీవ్రంగా ప్రశ్నించింది మాలతి.
సమాధానం చెప్పలేక తల దించుకున్నాడు మందపాలుడు. కూతురు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తల్లి ఇలా చెప్పుకొచ్చింది.
“నీ చిన్నతనంలో మన రాజ్యానికి విదేశాలనుంచి గొప్ప జ్యోతిషుడు వచ్చాడు. మీ నాన్నగారు నీ జాతకాన్ని ఆయనకు చూపించారు. ఆయన మనకు తెలియని భాషలో ఏదో రాసి ఇచ్చారు. అప్పుడు మీ నాన్నగారు ఆ భాష తెలిసిన ఒక పండితుణ్ని రప్పించి.. అందులో ఏముందో చదివించారు. అందులో నీ మొదటి భర్త పెళ్లినాడే మరణిస్తాడని, నీకు రెండోపెళ్లి తప్పదని రాసి ఉన్నది. నీకు వైధవ్యదోషం తప్పించేందుకే మీ నాన్నగారు ఆ పిచ్చివాడికిచ్చి నీకు మొదటి పెళ్లి జరిపించారు” అని చెప్పింది.
ఇంతలోనే ఏమనిపించిందో ఏమో కానీ మహారాజు వైపు తిరిగి..
“ఇప్పుడు జరిగింది చూస్తుంటే అంతా తారుమారుగా ఉంది. పోనీ మరోసారి ఆయనేం రాశారో చదివించకూడదా ప్రభూ!” అన్నది మహారాణి.
“నిజమే!” అంటూ మందపాలుడు అప్పటికప్పుడు ఆ భాష తెలిసిన మరో పండితుని కోసం కబురు చేశాడు.
ఆ పండితుడు వచ్చి జాతక ఫలితాన్ని చదివాడు.
“ఇంతకుముందు చదివిన వారెవరో కానీ కొంచెం తికమక పడ్డట్లుగా ఉన్నారు మహారాజా! యువరాణిగారి భర్త చక్రవర్తి అవుతాడని ఇందులో రాసి ఉంది. రెండోసారి పెళ్లాడాలని ప్రయత్నించినవాడు వెనువెంటనే చస్తాడట” అన్నాడాయన.
“ఇది కూడా తప్పే! మొదటిసారి పెళ్లాడింది ఈ పిచ్చివాణ్ని. వీడు చక్రవర్తి అవుతాడా?!” విసుగ్గా అన్నాడు మందపాలుడు.
“చక్రవర్తి కాకపోయినా, వెర్రివాడయినా నా భర్తను నేను విడిచిపెట్టలేను. రెండోసారి మీరు జరిపింది నిజమైన పెళ్లి కాదు. నాన్నా! దయచేసి చెప్పండి.. ఈ ముగ్గురిలో నా భర్త ఎవరు?” దీనంగా అడిగింది మాలతి.
మందపాలుడు అయోమయంగా ముఖం పెట్టాడు.
“అమ్మాయీ! ఆవేళ చీకటిలో నేను ముఖం సరిగా చూడలేదు. వాళ్లలో నిన్ను పెళ్లాడింది ఎవరో పోల్చుకోలేను. అయినా పిచ్చివాణ్ని వరించి నువ్వేం సుఖపడతావమ్మా?! హాయిగా మరో పెళ్లి చేసుకో. లేదంటే నువ్వు మాకు బరువు కాదు” అన్నాడు వేదనగా.
“వద్దు నాన్నగారూ! నేను నా భర్త ఎవరో తెలుసుకోవాలి. ఆయననే సేవించి నా జన్మ చరితార్థం చేసుకోవాలి”.. దృఢంగా చెప్పింది మాలతి.
ఆ తరువాత ‘అంతా విచిత్రం, అంతా దైవాధీనం, ఎవరికెవరూ లేరు’ అని ఎప్పుడూ పలికే ఆ పిచ్చివాళ్లు ముగ్గురినీ కోటలో ప్రవేశపెట్టారు. ఎందరో రాజవైద్యులు వారి పిచ్చి కుదర్చాలని ప్రయత్నిస్తున్నారు. రాకుమారిగా భోగాలు అనుభవించాల్సిన మాలతి, నారచీరలు ధరించి విరాగిణిలా మారి.. వాళ్లను సేవిస్తుండేది.
* * *
కొంతకాలం బాగానే గడిచింది. ఒకరోజు తెల్లవారేసరికి ఆ ముగ్గురూ కోటలోనుంచి మాయమయ్యారు. విరాగిణిగా మారిన మాలతి కూడా ఎవరికీ తెలియకుండా వాళ్లను వెతుక్కుంటూ బయలుదేరింది.
అనేక గ్రామాల్లో సంచరించి, ఎన్నో కష్టాలు భరించిన తరువాత.. ఆమె కృషి ఫలించింది. ఒక గ్రామంలో వాళ్లు ముగ్గురినీ ఆమె కనుక్కున్నది. మళ్లీ వాళ్లకు సేవలు చేయడంలో నిమగ్నమైంది. ఆ గ్రామంలోని ప్రజలే ఆ ముగ్గురికీ ఆహారం సమకూర్చి పెడుతుండేవారు.
అలా ఉండగా ఒకసారి ఆ గ్రామానికి.. దేశాటనలో ఉన్న భట్టి విక్రమార్కులు వచ్చారు. ఆ పిచ్చివాళ్లను, మాలతిని చూసి.. అసలు సంగతేమిటో తెలుసుకోవడానికి వాకబు చేయసాగారు.
“అమ్మాయీ! నిన్ను చూస్తుంటే గొప్పింటి బిడ్డలా ఉన్నావు. నీకింత కష్టం ఎందుకు వచ్చింది?! వీరు విక్రమార్క మహారాజులవారు వీరితో చెప్పుకో అమ్మా!” అన్నాడు భట్టి.
విక్రమార్కునికి మరోసారి నమస్కారం చేసి..
“మహాప్రభూ! నేను నా కష్టాన్ని ఎవరితోనూ చెప్పాలని అనుకోలేదు. కానీ, మీరు నా తండ్రిలాంటి వారు. మీతో చెప్పకుండా ఉండటం మంచిది కాదు కనుక, చెబుతున్నాను” అంటూ మాలతి తన కథనంతా వివరంగా చెప్పింది. పూర్తయిన తరువాత..
“ప్రభూ! వీళ్లు ముగ్గురిలో నా భర్త ఎవరో మీరే నిరూపించి చెప్పాలి” అని కోరింది.
“అమ్మాయీ! నీ కష్టాన్ని తొలగించకుండా మేం ఉజ్జయినికి తిరిగి పోయేది లేదు” అని విక్రమార్కుడు అభయమిచ్చాడు.
ఆ ముగ్గురినీ తేరిపార చూసి..
“ప్రభూ! వీళ్లను చూస్తే కులీనుల్లా ఉన్నారు. సామాన్యులు మాత్రం కాదు. ముఖ్యంగా దైవాధీనాన్ని ఎక్కడో చూసినట్లుంది. కానీ, ఎందుకు వీళ్లిలా పిచ్చివాళ్లుగా మారారో తెలుసుకుంటే తప్ప ఈ చిక్కుముడి విడిపోదు” అన్నాడు భట్టి.
“పోనీ ఒక్కసారి వాళ్లనే పలకరించి చూడకూడదా?!” అన్నాడు చిరునవ్వు చిందిస్తూ విక్రమార్కుడు.
భట్టి వాళ్లతో మాట్లాడాలని ప్రయత్నించాడు. కానీ, వాళ్లు ముగ్గురూ అదే పాత పాట పాడారు.
‘అంతా విచిత్రమే, అంతా దైవాధీనం, ఎవరికెవరూ లేరు’ అన్న మూడు మాటలూ తప్ప మరో మాట లేదు.
“ఈ మాటలకు ఏదో అర్థం ఉండకపోదు. పిచ్చి పట్టేంతగా వీళ్ల మనసులు చెదిరిపోయిన తరువాతే ఈ మాటలు పుట్టి ఉంటాయి. అవేమిటో కనుక్కోవాలి” అన్నాడు భట్టి.
విక్రమార్కుడు తల ఊపాడు. అప్పటినుంచి ఆ ముగ్గురూ ఎక్కడికి వెళ్తే అక్కడికి మాలతితో పాటుగా భట్టి విక్రమార్కులు కూడా అనుసరిస్తూ వెళ్లసాగారు. కొంతకాలానికి వారంతా జయంతమనే పట్టణానికి చేరుకున్నారు.
అక్కడికి చేరిన రెండోరోజునే రాజవీధిలో పెద్ద కోలాహలం బయల్దేరింది. పట్టణాన్నేలే బలవర్ధన రాజుకు సంతానం లేదు. అందువల్ల ఆయన తన వారసుణ్ని ఎంపిక చేయడానికి గానూ.. పట్టపుటేనుగుకు బంగారు కలశాన్ని, పూలదండను ఇచ్చి పంపాడు. ఆ ఏనుగు కలశంలోని నీటిని ఎవరిపై అభిషేకించి, పూలదండ వేస్తుందో.. వాళ్లే ఆ రాజ్యానికి తదుపరి రాజు అవుతాడు.
ఏనుగు ఎన్నిక చేయబోతున్నదనే సరికి పట్టణంలో ఉండే కొందరు పౌరులకు ఆశ పుట్టింది. ఆ ఏనుగును మాయచేసి దండ వేయించుకోవాలని ప్రయత్నించ సాగారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఏనుగు వారినెవరినీ ఎన్నిక చేయలేదు.
సరాసరి దైవాధీనం వద్దకు పోయింది. అతడి శిరస్సుపై కలశ జలాన్ని పోసి, మెడలో మాల వేసింది. రాజభటులు వచ్చి, అంబారీ ఎక్కమని ప్రార్థించారు. కానీ, అతడు వాళ్ల మాటలేమీ పట్టించుకోలేదు. ఎప్పటిలాగానే ‘అంతా దైవాధీనం’ అంటూ కూర్చున్నాడు.
సంగతి తెలిసి, బలవర్ధనుడు హతాశుడయ్యాడు.
“మరోసారి ఏనుగును సిద్ధం చేయండి. మరొకరిని ఎంపిక చేస్తుందేమో చూద్దాం” అని ఆజ్ఞాపించాడు.
కానీ, భటులు తెచ్చిన వర్తమానాన్ని విన్న తరువాత అప్పటివరకు కొలువులోనే ఉన్న విజయవర్ధనుడు అనే వ్యక్తి పైకి లేచాడు.
“ఆయన ఎక్కడున్నాడో నాకు చూపించండి” అంటూ దారి తీశాడు.
దూరం నుంచే చేతులు జోడించి.. “భూపాలదేవ చక్రవర్తీ జయము జయము!” అని దైవాధీనాన్ని పిలిచాడు.
అతనిలో మాత్రం ఏ కదలికా లేదు.
అప్పుడు విజయవర్ధనుడు ఒక పద్యం చదివాడు. ఆ పద్యానికి అర్థం ఏమిటంటే..
“ఓ భూపాలదేవ చక్రవర్తీ! ఆడవారిలో చెడ్డగుణాలను ఏకరవు పెట్టడం గొప్పతనం అనిపించుకోదు. ఉత్తములైన స్త్రీలవల్లే ఈ లోకంలో ధర్మం పాలించబడుతున్నది. ఇక్కడ బంధాలు – బాంధవ్యాలు అన్నీ దైవాధీనమే! కానీ, నిజానికి ఎవరికి ఎవరూ లేరు. సముద్రంలో కెరటాల్లా సంసారంలో కూడా కష్టసుఖాలు కలుగుతుంటాయి. వీటన్నిటినీ చూస్తూ కర్మగతిని అనుసరించి పోవడమే తప్ప.. ఒక్క నిట్టూర్పు విడిచి వైరాగ్యాన్ని తెచ్చుకునేందుకు కూడా మానవునికి స్వాతంత్య్రం లేదు. ఈ విషయాన్ని గుర్తెరిగి ప్రజలను చక్కగా పాలించి, కీర్తి గడించు”
.. ఈ పద్యం విజయవర్ధనుని నోటివెంట వస్తూనే దైవాధీనానికి పిచ్చి కుదిరిపోయింది. వెంటనే తన మంత్రిని చేరుకుని..
“విజయవర్ధనా! కుశలమా?” అని అడిగాడు.
దైవాధీనంతోపాటు దేవశర్మ, ‘ఎవరికెవరూ లేరు’ కూడా ఒకేసారి మామూలు వాళ్లయ్యారు.
జరుగుతున్నదంతా చూస్తూ మాలతి, భట్టి విక్రమార్కులు ఆశ్చర్యపోయారు. దూరాన నిల్చుని చూస్తున్న పౌరులకు కూడా ఏ విషయమూ సరిగా అర్థం కాలేదు.
అప్పుడు విక్రమార్కుడు..
“భూపాలదేవా! మీ విజయవర్ధనుల వారు చదివిన పద్యంలో ‘ఉత్తములైన స్త్రీలవల్లనే లోకంలో ధర్మం రక్షించబడుతున్నది’ అని చెప్పారు. ఆ ఉత్తమ స్త్రీ ఇదిగో.. ఈమె పేరు మాలతి. మీ ఇల్లాలు” అన్నాడు.
మాలతి తన భర్తకు నమస్కారం చేసింది. భూపాల దేవుడు ఆమెను స్వీకరించాడు. ఆ తరువాత తాను పిచ్చివాడిగా ఎలా మారాడో స్వయంగా వివరించాడు.
“నేను రాజ్యానికి వచ్చిన చాలాకాలం తరువాత కూడా వివాహం చేసుకోలేదు. పిల్లల కోసమైనా పెళ్లి చేసుకోమని మా విజయవర్ధనుడు ఎప్పుడూ హెచ్చరించేవాడు. కానీ, నేనతని మాటలు లెక్క చేయలేదు. పైగా ఆడవాళ్లు దుష్టులనీ, వాళ్ల మనసులు ఎప్పుడెలా మారిపోతాయో చెప్పలేమని, వాళ్ల సాంగత్యంలో మగవాడు పూర్తిగా చెడిపోతాడని వాదించేవాణ్ని. నన్ను ఒప్పించడానికి విజయవర్ధనుడు ఎన్నెన్నో ప్రయత్నాలు చేసేవాడు.
ఒకరోజున గొప్ప సిద్ధపురుషుణ్ని తీసుకువచ్చాడు. ఆయనతో కూడా చాలాసేపు వాదించాను. చివరికాయన..
‘దైవాధీనమై నడిచే జగత్తులో పురుషప్రయత్నం నామమాత్రమే’ అన్నాడు. ఇందాకా విజయవర్ధనుడు చదివిన పద్యాన్ని చదివి వెళ్లిపోయాడు. నేనాయన వట్టి వెర్రివాడని అనుకున్నాను.
ఆ రాత్రి నేను నిద్రిస్తుండగా ఏదో ఒక మహాశక్తి నా చేయి పట్టుకుని లేపింది. నన్ను చాలాదూరం నడిపించింది. ఎంతసేపు నడిచానో నాకే తెలియదు. తెల్లవారి చూసేసరికి మానవ మాత్రులెవరూ ఒక్కరాత్రిలో నడవలేనంత దూరం వచ్చేశానని అర్థమైంది. దైవమంటూ ఒకటి ఉంటే ఆ వేళ నన్ను చేయిపట్టుకుని నడిపించిందే అయి ఉంటుందని అనిపించింది. అప్పటినుంచి అంతా దైవాధీనం అన్నమాటనే తలుచుకుంటూ ఉండిపోయాను” అని చెప్పాడు.
“మీరు మాయమైన తరువాత, ఆ సిద్ధపురుషుడే నాకు ఆ పద్యాన్ని చదివితే మీరు బాగవుతారని చెప్పాడు మహారాజా! దానివల్లనే మిమ్మల్ని, మన రాజ్యాన్ని కాపాడుకోగలిగాను” అన్నాడు విజయవర్ధనుడు.
ఆ తర్వాత దేవశర్మ తాను ‘అంతా విచిత్రమే’ అంటూ ఉండిపోవడానికి మూలమైన కథను వినిపించాడు. ఆ తరువాత వంతు.. ‘ఎవరికెవరూ లేరు’ అని పలికే వ్యక్తిది. ఆయన అసలుపేరు నవకుబేరుడు. గొప్ప వర్తకుడు. బహుకుటుంబీకుడు. వార్ధక్యదశ సమీపిస్తున్నా కుటుంబం కోసమే డబ్బు కూడబెట్టేవాడు. బీదసాదలకు దానధర్మాలు చేసేవాడు కాదు. డబ్బు ఖర్చయిపోతుందని పుణ్యకార్యాలకు దూరంగా ఉండేవాడు. కాశీ రామేశ్వరాలు చూసిన పాపాన పోలేదు.
“భూపాలదేవునిలాగే నాకు కూడా ఒక సిద్ధపురుషుని వల్ల జ్ఞానోదయమైంది. ఏ కుటుంబం కోసమైతే నేను పిసినారిగా బతుకుతున్నానో.. ఆ కుటుంబంలో ఏ ఒక్కరికీ తమ ప్రాణాలకంటే నేను ఎక్కువ కాదని అర్థమయ్యేలా ఆయన చేశాడు. దాంతో అప్పటినుంచి ‘ఎవరికెవరూ లేరు’ అన్నమాటలనే తారకమంత్రంగా భావిస్తూ బతుకుతున్నాను” అని నవకుబేరుడు తన కథ వినిపించాడు.
మాలతి జాతకం నిజమైంది. చక్రవర్తి అయిన భూపాలదేవుడే ఆమెకు భర్తగా లభించాడు. అదనంగా లభించిన జయంతరాజ్యాన్ని భూపాలదేవుడు తన మిత్రులిద్దరికీ బహుమానంగా సమర్పించాడు. ఉత్తమురాలైన మరో స్త్రీని పెళ్లాడి దేవశర్మ రాజయ్యాడు. నవకుబేరుడు అతనికి మంత్రిగా స్థిరపడ్డాడు. ఉత్తములైన స్త్రీలవల్లనే ఈ లోకంలో ధర్మం ఇంకా నిలబడుతున్నదని సందేశమిచ్చి.. భట్టి విక్రమార్కులు ఉజ్జయినికి ప్రయాణమయ్యారు.
(వచ్చేవారం.. విక్రమార్కుని మనుమడు)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | గెలుపు ఎప్పుడూ మంచికే!
Kasi Majili Kathalu | ఇద్దరు మోసగాళ్లు
Kasi Majili Kathalu | శ్రీశైలంలో దేవకన్య
Kasi Majili Kathalu | వామన గుహ
Kasi Majili Kathalu | నలుగురు రాకుమారులు
Kasi Majili Kathalu | ఎగిరే జింక-2
Kasi Majili Kathalu | ఎగిరే జింక
Kasi Majili Kathalu | జయభద్రుని తెలివి
Kasi Majili Kathalu | నీతిమంతురాలు