Kasi Majili Kathalu Episode 11 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : చోళదేశపు యువరాజు విక్రమసింహుడు ఒక చిత్రపటాన్ని చూశాడు. అందులో ఉన్న స్త్రీని మోహించి, ఆమెకోసం మిత్రుడైన బహుశ్రుతునితో కలిసి వెతకసాగాడు. ఇంతలో అనుకోని రీతిలో క్రౌంచ ద్వీపానికి ఎగిరి వెళ్లాడు. ఆ ద్వీపంలో పురుషులు వికృత స్వరూపులు, స్త్రీలు రాక్షసులు. కాగా, అందగాడైన విక్రమసింహుని వల్ల ఆ ద్వీపంలోని స్త్రీలంతా గర్భవతులయ్యారు. సుందరులైన పుత్రులను కన్నారు. ఏడాది తరువాత ద్వీపం నుంచి వచ్చి, తన మిత్రుడైన బహుశ్రుతుని కలుసుకున్నాడు విక్రమసింహుడు.
“మిత్రమా! ఆ పురుషద్వేషిణిది ఇక్కడికి దగ్గరలోని సామమంతమనే రాజ్యం. ఈ రాజ్యాన్నేలే భానుమంతునికి ఒక్కగానొక్క కుమార్తె ఆమె. అసలు పేరేమిటో ఎవ్వరూ ఎరగరు. కానీ, ఇక్కడికి దగ్గరలోని ఒక సరస్సు వద్దకు ఆమె ప్రతిరోజూ జలక్రీడల కోసం వస్తుంది. ఇది ఆమె వచ్చే సమయం. మనం ఎవ్వరికీ కనబడకుండా సరస్సు ఒడ్డునున్న చెట్ల చాటున దాగి ఉండి ఆమెను చూడవచ్చు” అని చెప్పాడు బహుశ్రుతుడు.
“ఇకనేం పద.. ఇప్పుడే వెళ్లి ఆమెను చూద్దాం” అన్నాడు విక్రమసింహుడు.
అలా వాళ్లిద్దరూ చెట్లమాటున దాగి ఆమె రాకకోసం ఎదురుచూస్తూ ఉన్నారు. కొద్దిసేపటికి పురుషద్వేషిణి తన చెలికత్తెలతో కలిసి సరోవరం వద్దకు వచ్చింది. పై వస్ర్తాలను గట్టుమీద వదిలి, అందరూ నీటిలోకి దిగారు.
పురుషద్వేషిణి చేపపిల్లలా ఈదసాగింది. ఆమెను చూసిన చెలికత్తెలలో ఒకామె పక్కనున్న మరో చెలికత్తెతో..
“మంజువాణీ చూశావుటే! ఈనీటిలో వెల్లకిలా పడుకుని వెనక ఈత కొడుతున్న మన పురుషద్వేషిణి కుచములకు ఎర్రతామర మొగ్గలకు తేడా కనిపించడం లేదు కదూ!” అన్నది.
“ఔనే కలభాషిణీ! ఆమె చూచుకములపై నల్లటి చిరుతుమ్మెదలు వాలినట్లుంది” అన్నది మంజువాణి.
“ఆమె మోమును చూస్తుంటే నీకేమనిపిస్తున్నది?” ప్రశ్నించింది కలభాషిణి.
“ఆకాశంలోని చందమామ ప్రతిబింబం నీటిలో పడి ఈదుకుంటూ పోతున్నట్లున్నది” అని సమాధానమిచ్చింది మంజువాణి.
ఓవంక పురుషద్వేషిణి అందాన్ని కన్నులతో ఆస్వాదిస్తూ, మరోవంక వారిద్దరి మాటలనూ చెవులతో ఆలకిస్తున్న విక్రమసింహునికి ఆమెపై విరహవేదన అంతకంతకూ పెరగసాగింది.
చెలికత్తెల మాటలు సాగుతున్నాయి.
“నాచుపై తేలుతున్న కెంజాయ పూలవంటి శిరోజాలు.. తామర తూడుల వంటి చేతులు.. మకరాలను పోలిన జంఘాలు.. దక్షిణావర్తమైన నాభి.. అబ్బబ్బా! చూస్తుంటే ఆడవాళ్లమైన మనకే మతులు పోతున్నాయి కదా! ఇటువంటి సోయగాన్ని సరిజోడైన పురుషుని పరము చేయకుండా మన సఖి అడవికాచిన వెన్నెల వలె బతుకు సాగదీయడానికి కారణమేమై ఉంటుంది?” అన్నది కలభాషిణి.
“అమ్మయ్యో! ప్రమాదం. ఆమె వద్ద పురుషుల ప్రస్తావన తెస్తే మన తలలు తెగిపడవచ్చు” అన్నది మంజువాణి భయపడుతూ.
ఇంతలో పురుషద్వేషిణి ఈదుకుంటూ వారి వద్దకు వచ్చింది.
“ఏమిటే! ఏవో మంతనాలు సాగిస్తున్నారు?” అని ఆరా తీసింది.
“మరేమీ లేదమ్మా! నీ అంతటి అందగత్తె మూడులోకాల్లోనూ లేదంటే పొల్లుమాట కాదు. ఇటువంటి నీవు పురుషుల మాట ఎత్తితేనే మండిపడటానికి కారణం ఏమిటి? ఈ సంగతి తెలుసుకోకపోతే నా మనసును నేను సమాధాన పరుచుకోలేను. దయచేసి చెప్పవమ్మా! నాకు చేతనైతే నీ కష్టం తీర్చి, నీకో అందగాణ్ని జతకూర్చి నా ముచ్చట తీర్చుకుంటాను” అని వినయంగా అడిగింది కలభాషిణి.
“అంతపని చెయ్యకు. ఈనాటి వరకూ నేను నా తల్లిదండ్రులకు కూడా ఆ వివరం చెప్పలేదు” అన్నది పురుషద్వేషిణి.
“నేను కూడా ఎవరికీ చెప్పను” హామీ ఇచ్చింది కలభాషిణి.
పురుషద్వేషిణి తన కథను ఇలా చెప్పడం మొదలుపెట్టింది..
* * *
“నాకు చిన్ననాడే పూర్వజన్మ స్మృతి కలిగింది. నేను కిందటి జన్మలో ఒక రత్నాల వ్యాపారి కూతురిని. అప్పుడు నాపేరు రత్నాంగి. నాకు చిన్ననాడే తల్లిదండ్రులు కాంతివర్మ అనే వాడికిచ్చి పెళ్లి చేశారు. ప్రాయం రాగానే నేను కాపురానికి వెళ్లాను. నా మగడు మంచి కుటుంబంలో పుట్టిన వాడే. కానీ సహవాస దోషం వల్లనో, పూర్వకర్మ వశం చేతనో జూదరి అయినాడు. తాతతండ్రులు సంపాదించిన ఆస్తినంతా జూదంలో కరిగించి వేశాడు. నేను అనేకసార్లు జూదం మానుకోమని పోరుపెట్టాను. కానీ నా బోధ అతనికి ఉపకరించలేదు.
నా మెత్తనితనం కనిపెట్టి, నా పుట్టింటివారిచ్చిన నగలను కూడా తీసుకుపోయి, జూదంలో ఓడిపోయాడు. చివరికి కట్టువస్త్రాలు, తినకూడు లేనివాళ్లం అయిపోయాం. అప్పులవాళ్లు రోజూ ఇంటిమీదికి వస్తుంటే తట్టుకోలేక, ఒకసారి నా మగడిని తీసుకుని పుట్టినింటికి వెళ్లాను.
‘నాన్నా! మీ అల్లుడు సముద్రం మీద వర్తకం ప్రారంభించారు. ఈ మధ్యనే రెండులక్షల విలువగల సరుకులు విదేశాలకు ఎగుమతి చేశారు. ఆ ఓడ ఇంకా వెనక్కు రాలేదు. ఈలోగా ఇక్కడ కొన్ని సరుకులు కొనాల్సి ఉంది. నువ్వు కొంత సొమ్ము బదులిస్తే వడ్డీతో తిరిగి ఇప్పిస్తాను’ అని మా తండ్రిగారిని కోరాను.
అందుకాయన, ‘తల్లీ! మీకు నా సొమ్ము తినే హక్కు ఉంది. నీకు కావలసిన డబ్బు తీసుకో. నాకు తిరిగివ్వనక్కర్లేదు’ అన్నాడు.
నా తండ్రి వద్ద తీసుకున్న డబ్బుతో జూదం ఆడనని, నా మగనితో మూడుసార్లు ప్రమాణం చేయించుకున్నాను. రుణాలు పోను మిగిలిన డబ్బుతో ఏదైనా వ్యాపారం చేద్దామని చెప్పాను.
కానీ, డబ్బు మాత్రం వాని చేతిలో పెట్టలేదు. నావద్దనే భద్రంగా ఉంచుకుని మా ఊరికి తిరిగి ప్రయాణం కట్టించాను.
దారి మధ్యలో ఏమైందంటే..
ప్రాణం పోయినా సరే, ఆ డబ్బును తన స్వేచ్ఛావిహారం కోసం ఇవ్వనని అతనికి అర్థమైంది. అందుకే నేనొక బావివద్ద మంచినీరు తాగుతుండగా.. నాకాళ్లు రెండూ ఎత్తిపట్టి, నన్ను తలకిందులుగా బావిలో పడదోశాడు. తన దోవన తాను పోయాడు.
దైవవశాత్తూ ఆ బావిలోని ఒక మర్రిమొక్కను పట్టుకుని నేనెలాగో బతికాను. అటువైపుగా వెళుతున్న బాటసారులెవరో నన్ను చూసి, బావిలోకి గెడలు దింపి నన్ను రక్షించారు. నా తండ్రి పేరు విని, వారే నన్ను మా పుట్టింటికి చేర్చారు.
నా తండ్రి నా అవస్థకు పరితపిస్తుంటే, దారిలో మమ్మల్ని దొంగలు దోచుకున్నారని అబద్ధం చెప్పాను.
‘నేను వెంటనే మా ఇంటికి వెళ్లిపోవాలి, ఆయనను చూడాలి’ అని గొడవ చేసి వెంటనే ప్రయాణం కట్టాను.
తెల్లవారేసరికి గుమ్మంలో నన్ను చూచిన నా మగడు విభ్రాంతుడయ్యాడు. నేను అతడినేమీ అనకుండా మునుపటివలెనే అతనితో మెలగసాగాను. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతాడా.. నా బతుకు బాగుపడకపోతుందా.. అనుకున్నాను. కానీ పాముకు పాలుపోస్తే విషం కక్కకుండా మానుతుందా? నేను పుట్టింటి నుంచి మళ్లీ బోలెడంత డబ్బు తెచ్చి ఉంటానని, కానీ తనకు ఇవ్వడం లేదని భ్రమించాడు. నేను నిద్రపోతున్నవేళ కటికవాడు పశువును నరికేసినట్లు నా మెడ నరికి చంపాడు.
నా పూర్వపుణ్యం చేత నాకు గతజన్మ జ్ఞానం మిగిలి ఉంది. అందుకే ఈ జన్మలో పురుషుని నీడైనా నాపై పడకూడదని శపథం చేసుకున్నాను. మీరు నాకు ప్రాణతుల్యమైనవారు. కనుక మీతో చెప్పాను. మీరీ వృత్తాంతాన్ని ఎవ్వరితోనూ చెప్పకూడదు. అంతేకాదు.. ఇకపై పురుషుల ప్రస్తావన నాముందు తీసుకురాకూడదు” అని హెచ్చరిక చేస్తూ పురుషద్వేషిణి తన కథను పూర్తి చేసింది.
* * *
గట్టుపైకొచ్చి పొడివస్ర్తాలను ధరించి, చెలికత్తెలతో కలిసి నగరానికి తిరిగి వెళ్లిపోయింది. చెట్టుమీద నుంచి విక్రమసింహుడు, బహుశ్రుతుడు కిందికి దిగారు. కొంతదూరం పురుషద్వేషిణిని అనుసరించి వెళ్లారు.
అటుపైన బహుశ్రుతుడు తన మంత్రాంగాన్ని ప్రారంభించాడు. స్నేహితులిద్దరూ సామమంతపురానికి, ఆవల కొంత భూమిని కొనుగోలు చేశారు. గృహనిర్మాణంలో చేయితిరిగిన శిల్పులను రప్పించి ఆఘమేఘాల మీద ఒక కోటను నిర్మింప చేశారు.
చుట్టుపక్కలనున్న గ్రామాలను కలుపుకొని, ఆ రాజ్యానికి ‘స్త్రీద్వేషీ’ రాజ్యమని పేరుపెట్టారు.
ఆ రాజ్యానికి సామ్రాట్టు విక్రమసింహుడు. మంత్రి బహుశ్రుతుడు. వారివద్ద కొంత సైన్యం కూడా జతపడింది.
పురుషద్వేషిణి వీధులవెంట వెడుతుంటే.. పురుషులెవ్వరూ చూడకూడదు అన్నట్లుగానే, విక్రమసింహుడు వస్తున్నప్పుడు స్త్రీలెవ్వరూ బయటికి రాకూడదని నియమం ఏర్పరిచారు.
ఆ మేరకు శాసనాలు వ్రాయించి, సామమంతపురంలో కూడా ప్రకటించారు.
ప్రతిరోజూ పురుషద్వేషిణి కేళీసరోవరానికి బయలుదేరే సమయానికే.. స్త్రీద్వేషీ మహారాజు కూడా కోటనుంచి బయటికి వస్తాడు. దాంతో అటు పురుషులకు, ఇటు స్త్రీలకు కూడా గొప్ప చిక్కు వచ్చిపడింది. పౌరులందరూ కలిసి భానుమంతుని వద్దకు వెళ్లి..
“మహారాజా! ఒకప్పుడు యువరాణిగారు వస్తున్నారంటే ఎటువంటి అవసరమైన పనిలో ఉన్నా మగవాళ్లందరూ ఇళ్లలోకి దూరవలసి వచ్చేది. పులిమీద పుట్రలా ఇప్పుడీ స్త్రీద్వేషీ రాజు వచ్చాడు. ప్రస్తుతం ఆడామగా తేడాలేకుండా అందరికీ పనులు చెడుతున్నాయి. ఈ సమస్యను మీరే తీర్చాలి” అని మొరపెట్టుకున్నారు.
తన కూతురి అఘాయిత్యాన్ని మాన్పించడం ఎలాగో తోచక తలబద్దలు కొట్టుకుంటున్న రాజుకు.. ఈ స్త్రీద్వేషి ఎవరో తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది.
‘ఒకసారి మీరు మా కొలువు కూటానికి రాగలరు’ అని లేఖ రాసి, విక్రమసింహునికి పంపాడు.
దానికి సమాధానంగా బహుశ్రుతుడు..
“అలాగే వస్తాం. కానీ, మా మహారాజుగారు స్త్రీలను చూడరు. వారు వచ్చే సమయంలో మీ సభలో స్త్రీలు ఉండరాదు. మీరు స్త్రీ ప్రసంగం చేయకూడదు” అని షరతుపెట్టి పంపాడు.
భానుమంతుని వద్దనుంచి ‘సరే’ అన్న హామీ వచ్చింది.
విక్రమసింహుడు వచ్చే సమయానికి భానుమంతుడు పెద్ద సభ చేశాడు. కొందరు పౌరులు కూడా వచ్చారు. అందరికంటే ముఖ్యంగా.. పురుషద్వేషిణి కూడా సభకు వచ్చింది. గోడ
చాటుగా పరదాల మాటున కూర్చుంది.
మర్యాదలు పూర్తయిన తరువాత వృద్ధుడైన మంత్రి లేచి నిలబడి విక్రమసింహుని ఉద్దేశించి..
“ఆర్యా! ఆదియందు సృష్టికర్త తన శరీరాన్ని సగానికి చీల్చి ఎడమభాగాన్ని స్త్రీగానూ, కుడిభాగాన్ని పురుషునిగానూ తీర్చిదిద్దాడు. ఆ జంటవల్లనే ప్రజావృద్ధి కలిగింది. దీనికి గుర్తుగానే త్రిమూర్తులు తమ భార్యలను తమతమ శరీరాలయందే ధరించి ఉన్నారు. యుగాల తరబడి సాగుతున్న సృష్టిలో ఎవరో కొందరు చెడ్డవాళ్లు ఉంటే ఉంటారు. అంతమాత్రం చేత స్త్రీపురుషులు ఒకరిపై ఒకరు కత్తిగట్టడం సమంజసమేనా? స్త్రీని చూడనని చెప్పడం మీకు ధర్మమేనా?! ఇందుకు కారణమేమిటో మాకు తెలుసుకోవాలని ఉంది. దయచేసి చెప్పండి” అన్నాడు.
విక్రమసింహుడు కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. తరువాత ఒక నిట్టూర్పు విడిచి..
“మహారాజా! ఇది నా వ్యక్తిగత విషయం. ఇంతవరకూ ఎవ్వరికీ చెప్పలేదు. కానీ నలుగురు పెద్దలు కలిసి అడిగినప్పుడు ఎంతటి మహారహస్యమైనా బయటపెట్టి తీరాలని బృహస్పతి నీతి చెబుతున్నది. కనుక చెబుతాను. వినండి” అన్నాడు. అందరూ ఆసక్తిగా వింటుండగా, తన కథను ఇలా చెప్పాడు..
* * *
“రాజా! నేను పూర్వజన్మలో ఒక వర్తకుని కుమారుడిని. అప్పుడు నా పేరు కాంతివర్మ. నాకు యుక్తవయస్సు వచ్చేనాటికి ఎందరెందరో పెద్దపెద్ద కట్నాలతో, తమ పిల్లలనిచ్చి వివాహం చేస్తామని వచ్చారు. కానీ వారందరినీ కాదని, రూపవతి అయిన రత్నాంగి అనే ఆమెను వివాహం చేసుకున్నాను.
భార్యా రూపవతీ శత్రుః అన్నట్లు ఆమె రూపమే నా పాలిట శాపమైంది. దాని దుర్గుణాలను సరిచేయడానికి నా శక్తి చాలలేదు. కాపురానికి వచ్చినది మొదలు నా భార్య చేసిన దుశ్చర్యలను కప్పిపెట్టడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. నా తల్లిదండ్రులు నా భార్య కాపురానికి వచ్చిన వెంటనే చనిపోయారు. ఇంటిపెత్తనం అంతా చేజిక్కించుకున్న నా భార్య దుబారా ఖర్చులు చేసి ఆస్తినంతా కరిగించింది. నన్ను రుణగ్రస్తునిగా మార్చింది.
నేను వద్దని ఎంత బతిమాలినా వినకుండా ఒకనాడు పుట్టింటికి బయల్దేరింది. పరువు చెడిపోతుందని భయపడి నేనూ ఆమె వెంట వెళ్లాను. మార్గ మధ్యంలో ఆమె నన్నో బావిలోకి తోసేసింది. దైవవశాత్తూ చేతికి దొరికిన మర్రికొమ్మను పట్టుకుని వేలాడుతున్న నన్ను బాటసారులు రక్షించారు.
అక్కడినుంచి నేను మళ్లీ అత్తవారింటికి వెళ్లాను. ఎలాగోలా బతిమాలి భార్యను కాపురానికి తెచ్చుకోవాలని ప్రయత్నించాను. కానీ ఆమె మనసులో క్రౌర్యం పోలేదు. ఒకనాడు నేను నిద్ర
పోతుండగా కటికవాడు పశువును నరికినట్లు నా భార్య నా మెడనరికి చంపింది. నా పూర్వపుణ్యం వల్ల నాకిప్పుడు పూర్వజన్మ జ్ఞానం ఉంది. గత జన్మలోని చేదు అనుభవాల వల్ల ఈ జన్మలో ఆడదాని ఊసు తలపెట్టకుండా బతకాలని నిశ్చయించుకున్నాను”.. అని ముగించాడు.
* * *
అతని మాటలింకా పూర్తి కాకముందే..
“అంతా పెద్ద అబద్ధం” అనే అరుపు వినిపించింది. పరదాలు తొలగించుకుని పురుషద్వేషిణి సభలో ప్రవేశించింది.
“నాన్నగారూ! ఇతడి మాటలు నమ్మకండి. పూర్వజన్మలో ఇతగాడు నాపట్ల చేసిన అపచారాలన్నీ, నేను చేసినట్లుగా నామీద బనాయిస్తున్నాడు” అన్నదామె.
“ఓహో రత్నాంగీ నువ్వా! నువ్వు మళ్లీ ఇక్కడ తగులుకున్నావా? కిందటి జన్మలో నన్ను చంపినదానవు నువ్వు కాదా!” అన్నాడు విక్రమసింహుడు.
వారిద్దరి మధ్య చాలాసేపు తగువు కొనసాగింది. ఈలోపుగా భానుమంతుడు, అతని మంత్రులు కూడా బహుశ్రుతుని వద్ద చేరి, తమకు కావాల్సిన వివరాలన్నీ సేకరించారు. తగువులాడుకుంటున్న వారిద్దరినీ శాంతపరిచి కూర్చోబెట్టారు.
“విక్రమసింహా! మీరిద్దరూ పూర్వజన్మలో భార్యాభర్తలని మీ ఇద్దరికీ ఎరుకపడింది కదా! అసలింతకీ మీలో ఎవరికి సరైన పూర్వజన్మ జ్ఞానం ఉందనే విషయంలో మాకుండే అనుమానాలు మాకున్నాయి. ఏది ఏమైనా ఈ జన్మలో మీరిద్దరూ తిరిగి భార్యాభర్తలై, పాతపగలు మరిచిపోయి హాయిగా కాపురం చేసుకుంటే.. మీ ఇద్దరికీ నిష్కృతి లభిస్తుందని మా సలహా. ఇప్పుడే నేను చోళదేశానికి వెళ్లి మీ నాన్నగారికి మీ వివాహవార్త పంపిస్తాను” అన్నాడు భానుమంతుడు. విక్రమసింహుడు చిరునవ్వుతో మిత్రునివంక సాభిప్రాయంగా చూశాడు. పురుషద్వేషిణి అయిన రత్నాంగి సిగ్గులమొగ్గయి అంతఃపురంలోనికి వెళ్లిపోయింది.
త్వరలోనే వాళ్లిద్దరికీ వివాహం జరిగింది. తండ్రి వానప్రస్థానికి మరలిపోగా, విక్రమసింహుడు చోళదేశానికి చక్రవర్తి అయ్యాడు. రత్నాంగితో అతని దాంపత్యం మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగిపోయింది.
(వచ్చేవారం.. కీలుగుర్రం)
అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu Episode 10 ( కాశీ మజిలీ కథలు ) | పురుషద్వేషిణి
Kasi Majili Kathalu Episode 9 ( కాశీ మజిలీ కథలు ) | తిరిగి కలిసిన మిత్రులు
Kasi Majili Kathalu Episode 8 ( కాశీ మజిలీ కథలు ) | విద్యాధరి రాగమంజరి
Kasi Majili Kathalu Episode 7 ( కాశీ మజిలీ కథలు ) | మంత్రిగారి భార్య
Kasi Majili Kathalu Episode 6 ( కాశీ మజిలీ కథలు ) | హేలానగరంలో ప్రవరుడు
Kasi Majili Kathalu Episode 5 | రాముని మెచ్చిన లతాంగి
Kasi Majili Kathalu Episode 4 | చేపమింగిన కంకణం
“Kasi Majili Kathalu Episode 3 | పంజరంలో రామచిలుక”
“Kasi Majili Kathalu Episode 2 | దేవతా వస్త్రాలు”
“Kasi Majili Kathalu Episode 1 | జారిపడ్డ మామిడిపండు”