చాలా రోజులవరకూ మా ఇంట్లో రేడియో లేదు. మా ఇంటికెదురుగా ఉన్న గ్రామపంచాయతీ ఆఫీసులో రేడియో ఉండేది. బయట పెద్దసైజు ఉమ్మెత్త పువ్వు ఆకారంలో దాని మైక్ ఉండేది. అది మా ఇంటి వైపు గురిచూసి పెట్టినప్పుడల్లా.. ఆ రేడియోలో వాళ్లంతా మా ఇంట్లోనే కూర్చుని పెద్ద గొంతులతో మాట్లాడుకున్నట్టు అనిపించేది.
ఆ మైకు కొంచెం అవతలి వైపు తిప్పి పెట్టించమని మా నాన్నను అడిగేవాళ్లం. నాన్నెప్పుడూ అవతలి పక్షమే కదా! “పాపం అటుదిక్కు ఉండేటోళ్లకు మాత్రం ఆ చప్పుడు రాదా?! ఏం గాదు.. ఓర్చుకోవాలె!” అంటూండేవాడు. వాళ్లే పాపం ప్రజాస్వామిక విధానంలో ఓ నెల అటూ, ఓ నెల ఇటూ.. అలా అష్టదిక్కులూ తిప్పుతూ ఉండేవారు. అయితే పొద్దున్నే రేడియో ఆన్చేస్తే.. అలా మోగుతూనే ఉండేది. ఒక్కోసారి వాళ్లు ఆఫ్ చేయడం మర్చిపోతే ‘టుక్.. టుక్.. టుక్’ అంటూ మళ్లీ ప్రసారం మొదలయ్యే దాకా దుర్భరంగా చప్పుడు చేస్తూనే ఉండేది.
పొద్దున ఆరు గంటలకే ‘కూ.. గుయి గుయి.. గుయి గుయి..’ అంటూ ఆకాశవాణి నిద్ర లేచేది. ఆ తరువాత ‘భక్తి రంజని’లో వచ్చే భక్తి పాటలన్నీ కులమత భేదాల్లేకుండా మాకు నోటికి వచ్చేవి. ‘పదములె చాలు రామా..’; ‘నారాయణ నారాయణ అల్లా అల్లా’; ‘హే ప్రభు ఏసు హే ప్రభు ఏసు’ లాంటివన్న మాట. ఇప్పటికీ ఆ లిరిక్స్ గుర్తున్నాయి.
‘రహస్యం’లో గిరిజా కల్యాణం.. సగానికి పైగా మాటలు తెలియకపోయినా ఏదో ఒక మాట అనుకుని మేనేజ్ చేసేవాళ్లం. దాంట్లో ‘తత్త తిందాం.. తతత తిందాం’ అనే మాటకు ‘రొట్టె తిందాం.. పప్పు తిందాం’ అని అనువదించుకుని నవ్వుకునేవాళ్లం. అలాగే ‘చిలుక తత్తడి రౌతు’ అనే మాటకు చాన్నాళ్లు అర్థం తెలిసేది కాదు. తెలుగు సార్ను అడగాలంటే భయం! చివరికి అమ్మనడిగితే.. “చిలుక తత్తడి రౌతు అంటే చిలుక వాహనముగా కల మన్మథుడు” అని చెప్పింది. అమ్మకెంత తెలుగొచ్చో అనుకున్నాను.
రేడియోలో ఎప్పుడు పాటలొస్తాయో, ఎప్పుడు వార్తలొస్తాయో, ఎప్పుడు ప్రసంగాలుంటాయో మాకు గుర్తే ! ఆయా కార్యక్రమాలను వాటి ముందు వచ్చే మ్యూజిక్ ద్వారానే గుర్తుపట్టేవాళ్లం. పొద్దున్నే భక్తి రంజని కాగానే.. “ఇప్పుడు మార్కెట్ ధరలు వింటారు. మీర్ ఆలం మండిలో.. సబ్జీ మండిలో ధరలు ..” అని మేమే మిమిక్రీ చేసేవాళ్లం. బడికి తయారయ్యే సమయంలో సంస్కృతంలో వార్తలు వచ్చేవి. ‘ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శృయంతాం ప్రవాచకాః బలదేవానంద సాగరః’ అని ఎవరు ముందు చెపితే వాళ్లు గెలిచినట్టు అక్కా, నేనూ పోటీ పెట్టుకునేవాళ్లం.
మధ్యాహ్నం ఇంటికొచ్చి మళ్లీ బడికి వెళ్లేటప్పుడు కార్మికుల కార్యక్రమం ఇంటింటా రేడియోల్లో వినిపిస్తూ ఉండేది. మేము బడికి చేరేలోగా ఒక్క మాట కూడా మిస్ అవకుండా మొత్తం వినేవాళ్లం. చిన్నక్క, ఏకాంబరం, రాంబాబు.. మా ఇంట్లో సభ్యులే! వాళ్లు అందులో చెప్పని అంశం ఉండేది కాదు. ముఖ్యంగా క్రమశిక్షణ, పరిసరాల శుభ్రత, ట్రాఫిక్ రూల్స్, సేవాభావం, దయాగుణం, దానగుణం, స్నేహం, నిజాయతీ, మృదుభాషణం, పెద్దలపట్ల గౌరవం, మొక్కల పెంపకం, ఇంటిపనిలో సాయపడటం, చదువులో శ్రద్ధ, దురలవాట్లకు దూరంగా ఉండటం, ఆరోగ్యం.. ఇలా ఎన్నో విషయాలు రేడియో ద్వారా నేర్చుకున్నాం. ఒక విధంగా చెప్పాలంటే అమ్మానాన్నలు, కుటుంబం తరువాత మా వ్యక్తిత్వాలను తీర్చిదిద్ది, సంస్కారం నేర్పింది పుస్తకాలు, రేడియోనే!
ఇక జాతీయ పర్వదినాల అప్పుడు వేసే దేశభక్తి గేయాలు అప్పట్లో ఎంత బావుండేవో! మన దేశాన్ని, తోటి మనుషుల్ని ప్రేమించాలనే భావన కలగడానికి మూలకారణం ఆ గీతాలే!
రోజూ రేడియో టైం ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు నాన్న భోజనం కోసం లేవగానే మేమంతా అనుసరించేవాళ్లం. ‘నేను తరువాత తింటాను’ అనే మాటలకు ఆ రోజుల్లో తావు లేదు. అందరూ ఒకేసారి తినాల్సిందే! తొందరగా నిద్రపోయి మళ్లీ పొద్దున్నే లేవాల్సిందే! ఉదయం ఆరు దాటాక లేస్తే ఆలస్యంగా లేచినట్టే! అయినా పెద్ద గొంతుతో మా రేడియో నిద్రలేపేది కూడా!
ప్రతి గురువారం ‘వార్తా వాహిని’ అనే న్యూస్ రౌండప్ నాన్న తప్పకుండా వినేవాడు. ఆ సమయంలో మేమూ నిశ్శబ్దంగా హోమ్వర్క్ చేసుకునే వాళ్లం. రేడియోలో లలిత సంగీతం తీరే వేరు. కేబీకే మోహన్ రాజు, చిత్తరంజన్, శ్రీరంగం గోపాలరత్నం, వేదవతి ప్రభాకర్, శాంత, రామలక్ష్మీ రంగాచార్య గార్లే కాదు.. ప్రముఖ సినీ నేపథ్య గాయకులు కూడా రేడియోలో లలిత సంగీతం పాడేవారు. ఆ పాటలు ఎంత బావుండేవో! దేవులపల్లి, మల్లాది, దాశరథి, బోయి భీమన్న, గంగరాజు సుశీలాదేవి వంటి గొప్ప గీత రచయితలు రాసిన పాటలకు పాల గుమ్మి విశ్వనాథం, వింజమూరి శివరామారావు, కలగా కృష్ణమోహన్ వంటివారు సంగీతం సమకూర్చేవారు. నెలకొకసారి ‘ఈ మాసపు పాట’ వచ్చేటప్పుడు హడావుడిగా పేపర్, పెన్నూ (దొరక్కపోతే పెన్సిలయినా) పట్టుకుని తొందర తొందరగా రాసుకుని తరువాత ఫెయిర్ చేసుకునేవాళ్లం. ‘ఈ పాట నేర్చుకుందాం’ కూడా అంతే!
ఇక జానపదాలు జోరుగా ఉండేవి. పొలాల్లో పనిచేసుకునే వాళ్ల పాటలు, దంపుళ్లు, విసుర్రాయి పాటలు, గొబ్బెమ్మ, బతుకమ్మ, హోలీ వంటి పండుగల పాటలు, పెళ్లి పాటలు.. ఎన్నెన్నో సీత, అనసూయ, నరసింహమూర్తి గార్ల గొంతుల్లో హుషారుగా కదం తొక్కేవి. ‘కోడి బాయె లచ్చమ్మది’; ‘మందులోడా ఓరి మాయలోడా’; ‘ఏటికేతం బట్టి ఎయి పుట్లు పండించి ఎన్నడూమెతుకెరుగనన్నా’.. ఈ పాటలన్నీ వింటూ మళ్లీ రాయడానికి ప్రయత్నించేవాళ్లం గానీ జానపద గేయాలు వేరే యాసలో, వేగంగా పాడేవారు గనుక రాయడం కుదిరేది కాదు. గొంతులో ఆ విరుపూ వచ్చేది కాదు.
రాత్రి కాగానే వారంలో రెండు రోజులు మాత్రం ‘చిత్రసీమ’ సినిమా పాటలు వచ్చేవి. వాటికోసం ఎంత ఎదురు చూసేవాళ్లమో! అన్నాలు తిని పక్కల మీద వాలి ఆ పాటలు వినడం చాలా బాగుండేది. వేసవి కాలంలో అయితే మరీ! ఆరుబయట మంచాలూ, వాటి మీద పక్కలూ వేసి పడుకుని చల్లగా గాలి వీస్తూంటే, ఆకాశంలో చుక్కల్ని లెక్కపెట్టుతూ ఆ పాటలు వింటూంటే.. ఎంతో ఆనందం కలిగేది. ఆ పాటల్లో చాలావరకు వినీవినీ నోటికొచ్చేవి.
మిగతా రోజుల్లో శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు ప్రసారం అయ్యేవి. మా నాన్న తప్ప వాటిని ఎవ్వరమూ వినేవాళ్లం కాదు. అలా ఎప్పుడు నిద్రలోకి జారుకునేవాళ్లమో కూడా గుర్తుండేది కాదు.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి