KCR | పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి బలం ఇస్తేనే.. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వచ్చి హామీలను అమలు చేయిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బస్యాత్రలో భాగంగా బుధవారం మిర్యాలగూడలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తమంటున్నరు. కేసీఆర్ను తీసుకుపోయి చర్లపల్లి జైలులో వేస్తమంటరు. జైళ్లకు.. తోకమట్టకు కేసీఆర్ భయపడుతడా? అట్ల భయపడితే తెలంగాణ వచ్చేదా? 15 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణను తెచ్చాం. ఈ రోజు నిన్ను జైలులో వేస్తాం. నీ పేగులు తీసి మెడలో వేసుకుంటం. నీ గుడ్లుపీకి గోళీలు ఆడుతం.. ఇదా ఓ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషా. మిమ్మల్ని పండపెట్టి తొక్కుతం ఇదే భాషనా ? ఓ ముఖ్యమంత్రి నుంచి ఆశించేది ఇదేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘15 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి.. 10 సంవత్సరాలు తెలంగాణను ప్రజలను కులం, మతం, వర్గమనే బేధం లేకుండా అన్నివర్గాల ప్రజలను బ్రహ్మాండంగా చేసిన వ్యక్తిని పట్టుకొని.. నీ గుడ్లు పీకుతా.. నీ పేగులు మెడలో వేసుకుంటా. నిన్ను జైలులో వేస్తా ఇదా మాట్లాడాల్సిన భాషా. ప్రజలు ఆలోచన చేయాలి. అన్నీ అబద్ధాలు చెబుతూ, శ్వేతపత్రాలు విడుదల చేసి.. బోగస్ మాటలు చెబుతూ.. ఇచ్చిన హామీలను ఎగవెట్టి.. ఆరు హామీలకు పంగనామం పెట్టి.. ఈ రోజులు చేతులు ఎత్తేసి అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నరు. ఎంత మంచిగ నీరు వస్తుండే నాగార్జున సాగర్లో. ఎంత బ్రహ్మాండంగా పండుతుండే. మాకు చాలా సంతోషంగా ఉంటుండే. 18 పంటలు పండించాం సాగర్ కింద. చివరి భూములకు కూడా నీళ్లు ఇచ్చాం. కృష్ణలో నీళ్లు తక్కువైనా కాళేశ్వరం నీళ్లు తెచ్చి.. మూసీ నదిలో వేసి.. ఉదయసముద్రానికి తీసుకువచ్చి.. పెద్దదేవులపల్లి రిజర్వాయర్కి కలపాలి.. శాశ్వతంగా ఈ ప్రాంత ప్రజలకు కరువు ఉండకూడదని ప్రణాళికలు రూపొందించాం. కానీ, ఇవాళ అన్నీ బంద్.
‘కేసీఆర్ ఆనవాళ్లు తీసేస్తాం అంటున్నరు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పుణ్యమా అని మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆయనను గౌరవించాలని.. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా 125 అడుగుల ఎత్తులో హిమాలయమంత అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్లో పెడితే.. మొన్న జయంతి రోజున ముఖ్యమంత్రి.. మంత్రులు ఎవరూ పోలేదు. ఆ మహనీయుడికి ఒక్క దండ వేయలేదు. గేట్లకు తాళం వేశారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు దిక్కుమాలిన ప్రభుత్వం అంటూ తిట్టుకుంటూ వెళ్లారు. ఇవన్నీ అడ్డగోలు మాటలు.. నిందలు.. అవనసరమైన కథలు చెబుతున్నరు తప్ప న్యాయం చేసే పరిస్థితి లేదు. ఇవాళ ప్రజలకు, కాంగ్రెస్కు పంచాయితీ పడ్డది. ప్రజల పక్షాన గట్టిగా కొట్లాడేటటువంటి పంచాయితీ పెద్ద కావాలి. ఆ పంచాయితీ పెద్ద ఎవరు కేసీఆరేనా? బీఆర్ఎస్ పార్టీయేనా? నిన్ననే అన్ని విషయాలు చెప్పాను. తప్పకుండా మళ్లీ మన రాజ్యమే వస్తది. అందులో అనుమానం లేదు. ఎవడూ ఆపలేడు. బ్రహ్మాండంగా తెలంగాణ.. మనం కలగన్న బంగారు తెలంగాణ అయ్యేదాక మనం అద్భుతంగా తీసుకుపోవాలి’ అన్నారు.
‘పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బలం ఇస్తే.. అది తెలంగాణ ప్రజల బలం అవుతుంది. తెలంగాణ ప్రజల శక్తి అవుతుంది. మీ తరఫున ప్రభుత్వం మెడలు వంచగలుగుతం. ఇవాళ మీరు చూపించిన ప్రేమ, పలికిన స్వాగతం నా జన్మలో మరిచిపోను. ఇంత అద్భుతంగా ఏర్పాట్లు చేసినందుకు సంతోషం. కానీ, మే 13వ తేదీ వరకు ఇదే ఉత్సాహం కొనసాగించి పార్లమెంట్ ఎన్నికల్లో కృష్ణారెడ్డికి ఓటు వేసి గెలిపించాలి. పది పన్నెండు ఎంపీలు గెలిస్తే తెలంగాణలో భూమి ఆకాశం ఒకటి చేసినంత పోరాటం చేస్తానని మనవి చేస్తున్నా. మీరు ఇచ్చే బలంతోనే కేసీఆర్, బీఆర్ఎస్ పోరాటం చేయగలుగుతుంది. న్యాయం చేయగలగుతరు. న్యాయం చేయగలుగుతరు. ఈ కాంగ్రెస్ మెడలు వంచగలుగుతరు. రైతులకు న్యాయం జరుగుతుంది. కరెంటు సక్కగ వస్తది. కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారెడ్డి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని అందరినీ కోరుతున్నా’నన్నారు.