అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ
జరిగిన కథ : ఉజ్జయినిలో నివసించే మదనాంకుడికి ఒకనాడు విద్యాధర కన్య రాగవతి కనిపించింది. ఆమెను మోహించి
ఇల్లు విడిచి హిమాలయాలకు ప్రయాణమయ్యాడు మదనాంకుడు. దారిలో అనేక గండాలు గడిచాయి. ఒకచోట శ్మశానంలో యక్షిణిని స్వాధీనం చేసుకుని, ఆమె సాయంతో విద్యాధర లోకానికి ప్రయాణమయ్యాడు. కానీ, దారిమధ్యలోనే తెల్లవారడంతో
యక్షిణి అతణ్ని ఒకచోట దింపింది.
హిమాలయాల వద్ద యక్షిణి తనను వదిలి వెళ్లిన తరువాత మదనాంకుడు కాలకృత్యాలు తీర్చుకోవడానికి తగిన ప్రదేశాన్ని వెతకసాగాడు. అక్కడొక సరస్సు కనిపిస్తే వెళ్లి, నీరు చేతిలోకి తీసుకోబోయాడు. కానీ, ఆ నీరు విషతుల్యంగా కనిపించింది. అనుమానంతో ఆ సరస్సును విడిచిపెట్టి మరికొంచెం ముందుకు వెళ్లాడు.
ఒకచోట భూమిలో పద్మరాగ మణుల్లా ఎర్రని కాంతులు విరజిమ్ముతూ రెండు గుండ్రని గోళాలు కంటబడ్డాయి. వాటిని చూసి ఆశ్చర్యపడుతూ చుట్టూ ఉన్న మట్టిని తొలగించాడు. ఆశ్చర్యకరంగా ఆ గోతిలో ఒక వానరం బయటపడింది. దాని కనుగుడ్లే అలా ఎర్రగా కనిపించాయి. కోతిని బయటికి తీసి రక్షించి, తనదారిన తాను పోబోయాడు మదనాంకుడు.
అంతలో ఆ కోతి మానవభాషలో..
“మహాత్మా! నువ్వెవరో దైవంలా వచ్చావు. నేను కోతిని కాదు.. మానవుణ్నే! నా దురదృష్టం కొద్దీ ఇలా మారాను. నువ్వు రావడం మరో పదిరోజులు ఆలస్యమైతే చచ్చిపోయేవాణ్ని. నువ్వు ఆ చెరువులో నీళ్లు తాగబోవడం చూశాను. వాటిని తాగకపోవడం మంచిదైంది. పద.. కాసిని నీళ్లు తాగి, పళ్లు ఫలాలు తిందాం” అంటూ అతణ్ని అక్కడికి దగ్గరిలోని మరో చెరువు వద్దకు తీసుకుపోయింది. కొద్దిగా సేదతీరిన తరువాత.. “ఇంతకూ ఎవరు నువ్వు? ఎందుకిలా మర్కటరూపం పొందావు?” అని ప్రశ్నించాడు మదనాంకుడు.
“మిత్రమా! నాపేరు చంద్రస్వామి. మాది కాశీనగరం. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకుని. నన్ను మావాళ్లు గారాబంగా పెంచారు. గారం ఎక్కువై నాకు చదువు అబ్బలేదు. ఆటపాటలకు మరిగాను. ఇంతలో నాలో యవ్వన వికారాలు ప్రవేశించాయి. ఒకనాడు తలకు కుచ్చుపాగా చుట్టి, చేతిలో బెత్తం పట్టుకుని నగర వీధులలో సంచరిస్తుంటే.. శ్రీగర్భుడనే వర్తకుని కూతురు, ప్రియంవద అనే సుందరి నన్ను చూసింది. నాపై మరులు గొన్నది. కానీ, అప్పటికే ఆమె మధురాపురానికి కోడలు. అయితే అప్పటివరకు అత్తవారింటి మొహం చూసి ఎరగదు. శ్రీగర్భునికి లేకలేక కలిగినందువల్ల కూతురిమీద ప్రేమకొద్దీ ఆమె యుక్తవయసుకు వచ్చినా కాపురానికి పంపకుండా కొంతకాలం పుట్టింట్లోనే ఉంచుకున్నాడు. ఈలోపుగా ఆమెకు నాపై మోహం పుట్టింది. ఆమె తన దూతికను నా దగ్గరికి పంపింది. అది మాయోపాయంతో మమ్మల్ని కలిపింది. ఎవరికీ తెలియకుండా తరచుగా మేమిద్దరం కలుసుకోసాగాం. మా ప్రణయం లోకం మెచ్చదగింది కాకపోయినా, మేం లెక్కచేయలేదు. ఈ లోకంలో ఏ శక్తీ మమ్మల్ని విడదీయలేదని ప్రణయవేళ బాసలు చేసుకునేవాళ్లం.
ప్రియంవద భర్త కోటీశ్వరుడు. ఒకనాడు మామగారింటికి వచ్చి, తన భార్యను తనతో పంపమని గొడవ చేశాడు.
‘పదిరోజుల్లో పంపుతాను. అప్పటివరకు నువ్వు కూడా ఇక్కడే ఉండు’ అని శ్రీగర్భుడు కోరడంతో అంగీకరించాడు.ప్రియంవద గుండెల్లో రాయిపడింది. మామధ్య రాయబారం నడిపే దూతికను ఆశ్రయించింది. ఆమె బాగా ఆలోచించి ఒక పథకం వేసింది. ఒక తాంత్రికయోగిని వద్దనుంచి రెండు మూలికలు తీసుకువచ్చింది.‘ఈ మూలికను శిరస్సున తాకిస్తే మనిషి కోతిగా మారిపోతాడు. రెండో మూలిక తాకిస్తే మళ్లీ మామూలు మనిషి అవుతాడు. దీని సాయంతో చంద్రస్వామిని కోతిగా మార్చి నీతోపాటు తీసుకువెళ్లు. నీకు కావాల్సినప్పుడు మళ్లీ మనిషిగా మార్చి సుఖించు’ అని బోధించింది దూతిక.
ప్రియంవద ఆ మూలికలు తీసుకువచ్చి, నాతో ఆ విషయం చెప్పింది. ఆమె పథకానికి నేను కూడా ఆమోదం తెలిపాను.
ప్రియంవద అత్తవారింటికి వెళ్లే సమయంలో దూతిక వచ్చింది. కోతిగా ఉన్న నన్ను ప్రియంవదకు కానుకగా ఇస్తున్నానని భర్తముందు చెప్పింది. ప్రియంవద ఆనందంతో నన్ను తనతోపాటుగా పల్లకిలో కూర్చోబెట్టుకోబోయింది. కానీ, పురోహితుడు కోతిని వెంటబెట్టుకొని వెళ్లడం అమంగళమని హెచ్చరించాడు. దాంతో ప్రియంవద భర్త నన్నొక సేవకుడికి అప్పగించి.. ‘దీన్ని ఎత్తుకో’ అన్నాడు.
పల్లకితోపాటు సేవకుడి భుజాలమీద నేనున్నాను. అరణ్య మార్గంగుండా మా ప్రయాణం కొనసాగింది. ఒకనాడు అడవికోతుల గుంపు మా వెంట పడింది. ఏదో పూర్వజన్మ శత్రుత్వం ఉన్నట్లు.. అవన్నీ నా మీద పడ్డాయి. నా వెంట్రుకలు పీకి, పళ్లతో కొరికి, గోళ్లతో చీరిపారేశాయి. నన్ను ప్రాణావశిష్టుడిగా మార్చేశాయి. నన్ను చంపాల్సిందే.. కానీ ఎందుకో వదిలేసి పోయాయి.
కోతుల గుంపు మధ్యలో చిక్కుకున్న నన్ను వదిలేసి, పల్లకి ముందుకు కదిలిపోయింది. నేను ఒంటరివాడినై పోయాను. ఇక అక్కడే ఉంటే ప్రమాదమని భావించి, తెల్లవారేసరికి ఆ అడవి దాటి ఇటువైపు వచ్చాను. కొండలమీద, చెట్లమీద సంచారం చేస్తూ చివరికి ఈ కొండకు చేరుకున్నాను.
పరదారను వాంఛించినందుకు భగవంతుడు నాకు గట్టిగా బుద్ధి చెప్పాడని అర్థమైంది. దైవస్మరణతో కాలం గడుపుతున్నాను. కానీ, ఇంతలో ఒక అడవి ఏనుగు ఇటువైపు వచ్చింది. నన్ను ఆ గోతిలో తొక్కి వెళ్లిపోయింది. అప్పుడే నేను చచ్చిపోవాల్సింది. కానీ, దైవవశాత్తూ బతికి ఉన్నాను. నీవల్ల బయటపడ్డాను”.. అని చంద్రస్వామి తన కథనంతా వివరంగా చెప్పాడు.
మదనాంకుడు అతను చెప్పినదంతా విని, దీర్ఘంగా నిట్టూర్చాడు. తన సంతాపాన్ని వ్యక్తపరిచాడు.
ఇంతలో కోతిరూపంలో ఉన్న చంద్రస్వామి..
“పుణ్యాత్మా! ఇంతకూ జనసంచారం లేని ఈ అడవిలోకి నువ్వెలా వచ్చావు?” అని ప్రశ్నించాడు.
అప్పుడు మదనాంకుడు తాను ఉజ్జయినిలో రాగవతి అనే విద్యాధర కన్యను కలుసుకోవడం, ఆమె కోసం ఇంతదూరం రావడం వరకు గల కథనంతా చెప్పుకొచ్చాడు. అతని మాటలు విన్న చంద్రస్వామి ముక్కుపై వేలుంచుకుని..
“అయితే నువ్వు కూడా నాలాగా ఆడవాళ్ల మూలంగానే బాధలు పడుతున్నావన్నమాట. ఆడది, ధనము అనే రెండూ ఎక్కడా స్థిరంగా ఉండవు. సంధ్యాకాలంలో కిరణాల్లా క్షణానికో రంగు మార్చుకుంటాయి. నదుల్లా లోతు కలిగినచోట నిలవుండి చెడిపోతుంటాయి. పాముల్లా అవిశ్వాసాన్ని, మెరుపులా చంచలత్వాన్ని ప్రదర్శిస్తాయి. అయ్యో! ఆ విద్యాధర కన్యక కూడా నీయందు ఆ సమయంలో ఆసక్తి కనబరిచి ఉండవచ్చు. కానీ ఆ ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుందని పొరబాటున కూడా అనుకోకు సుమా!” అని హితవు పలికాడు.
కానీ, మదనాంకుడు అందుకు ఒప్పుకోలేదు.
“నా రాగవతి అటువంటిది కాదు” అన్నాడు.
అతనికి కనువిప్పు కలిగేందుకు చంద్రస్వామి తన మిత్రుడైన భవశర్మ కథ చెప్పసాగాడు.
..“ప్రియంవద నన్ను కోతిగా మార్చి, తనతో తీసుకువెళ్తానని చెప్పినప్పుడు నేనా విషయాన్ని నా మిత్రుడైన భవశర్మతో చెప్పాను. అప్పుడతను నన్ను వారించాడు. నచ్చ చెప్పజూశాడు.
‘చంద్రా! ఇంతకంటే నీచం మరొకటి లేదు. పోవద్దు. రూపం మార్చుకుంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇటువంటి విషయాల్లో నాకు చాలా అనుభవం ఉంది. నీకు తెలియదు కానీ, ఈ కాశీలోనే ఒక స్వైరిణి ఉండేది. దాని పంచన చేరిన మగాళ్లలో నేను కూడా ఒకణ్ని. అప్పట్లో ఒక్కసారి దానిపొందు దొరికితే చాలనుకుని, అంగలార్చేవాణ్ని.
ఒకసారి ప్రణయపూర్వకంగా దాని బుగ్గమీద చిటికె వేశాను. అంతమాత్రానికే ఆ క్రూరాత్మురాలు సహించకుండా పళ్లు పటపట కొరుకుతూ.. ‘మూర్ఖుడా! నేనేమన్నా నీ పెళ్లాన్ని అనుకుంటున్నావా.. ఇలా కొట్టావేంటి? చూడు నీ గతి’ అంటూ నా మెడలో ఏదో తాడు తీసుకొచ్చి కట్టింది.
వెంటనే నేనో ఎద్దుగా మారిపోయాను. ఆ స్వైరిణి నన్ను సంతకు తోలుకుపోయి పశువుల వర్తకులకు అమ్మేసింది. వాళ్లు నాపై గోనెసంచులు వేసి మోయిస్తూ రోజూ సంతలకు తిప్పసాగారు. కొన్నిరోజులు నేను గొడ్డుచాకిరీ చేస్తూ చాలా కష్టాలు పడ్డాను.
ఇంతలో నా అదృష్టం కొద్దీ బంధమోచనిక అనే యోగిని నన్ను చూసింది. ఆమెకు నా మీద దయకలిగింది. నా మెడలో తాడు లాగిపారేసింది. దాంతో మళ్లీ మామూలు మనిషినయ్యాను. నేనామెకు నమస్కరించి, స్తోత్రం చేశాను. ఆమె నన్ను వెంటపెట్టుకుని పోతుండగా.. మునుపటి స్వైరిణి దారిలో ఎదురుపడింది. కన్నులెర్రజేస్తూ బంధమోచనికతో..
‘నువ్వు వీడికి పశుత్వం వదిలించావా? దీనికి తగిన ఫలమనుభవిస్తావు’ అంటూ విసవిసా వెళ్లిపోయింది.
బంధమోచనిక మహాయోగిని.. భూత భవిష్యత్ వర్తమానాలు ఎరిగినది. ఆమె నావైపు తిరిగి..
‘ఓయీ! ఇది మహా క్రూరాత్మురాలు. దీనికి చాలా తంత్రాలు తెలుసు. రేపు ఇది ఎర్రగుర్రమై మా ఇంటికి వచ్చి నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది. నేనప్పుడు నల్లగుర్రమై దానితో కలియబడతాను. కానీ, మా ఇద్దరిలో ఎవరమూ గెలవలేం. కాబట్టి ఆ సమయంలో కత్తి చేతపుచ్చుకుని, నేను సైగ చేసినప్పుడు దాని పాదాలు నరికేయి. మిగతాది నేను చూసుకుంటాను’ అని చెప్పింది.
నేను ఆ రాత్రి నిద్రపోకుండా ధ్యానంలో గడిపాను. తెల్లవారిన తరువాత బంధమోచనిక చెప్పిన సమయానికి ఆమె ఇంటికి వెళ్లాను. అప్పటికే అక్కడో నల్లగుర్రం, తెల్లగుర్రం భీకరంగా పోట్లాడుకుంటున్నాయి. నేను కొంచెంసేపు వేచిచూసి, నల్లగుర్రం సకిలించగానే.. తెల్లగుర్రం కాళ్లు నరికేశాను. అది నేలమీద పడిపోయింది. వెంటనే బంధమోచనిక దానిపై పడి కరిచి దాన్ని గడియలో చంపివేసింది.
తిరిగి తనరూపం తెచ్చుకున్న తరువాత నేను బంధమోచనిక పాదాలపై పడ్డాను. ఆమె నన్ను చూసి..
‘ఓయీ! ఎన్నడూ పరస్త్రీ సంగమానికి ప్రయత్నించకు. వాళ్లు నెత్తిపై పెట్టుకుంటున్నారు కనుక, అదంతా నీమీద ఇష్టమేనని భ్రమలో పడకు. అవకాశం ఇస్తే పాతాళానికి అణగదొక్కుతారు.. జాగ్రత్త!’ అని నన్ను హెచ్చరించింది.
కనుక నువ్వు కూడా నాలాగే బుద్ధిగా ఉండు.
ప్రియంవద జోలికి పోకు!’ అని ఎంతగానో నచ్చజెప్పాడు. కానీ, నేనా మిత్రుని మాటలు లక్ష్యపెట్టకపోవడం వల్ల కోతిగా మారి నానాకష్టాలు పడుతున్నాను. మా ఇద్దరి కథలూ విన్న తరువాతైనా నువ్వు మనసు మార్చుకో!” అని చెప్పడం పూర్తి చేశాడు చంద్రస్వామి.
ఆ మాటలు పూర్తిగా ఆలకించిన తరువాత కూడా మదనాంకుడు తన బుద్ధి మార్చుకోలేదు.
“చంద్రా! నా రాగవతి మామూలు స్త్రీ కాదు. విద్యాధర కాంత. ఆమె మానవ స్త్రీలలా మోసగత్తె కాదు. అయినా ఇంతదూరం ఎలాగూ వచ్చాను. ఏది ఏమైనా ఆమెను కలిసిన తర్వాతే తిరిగి వెళతాను” అన్నాడు.
అంతలోనే సాయంత్రమైంది. మదనాంకుణ్ని
అక్కడ దించి, చీకటి పడగానే వస్తానని మాటిచ్చిన శృంగోత్పాదిని అనే యక్షిణి వచ్చింది. ఆమె భుజాలపై ఎక్కి, పుష్కరావతి నగరానికి ప్రయాణమయ్యాడు మదనాంకుడు.
మర్కట రూపంలో ఉన్న చంద్రస్వామి..
“మిత్రమా! ఒక్కరోజులో మనకు గాఢమైన స్నేహం కుదిరింది. దేవతాస్త్రీ వ్యామోహంలో పడి నామాట మరిచిపోయేవు సుమా! ఎలాగైనా నువ్వే తిరిగి వచ్చి నా రూపం మారేందుకు సాయపడాలి” అని కోరాడు.
మదనాంకుడు సరేనంటూ ముందుకు సాగాడు.
యక్షిణి అతణ్ని ఒక ఉద్యానంలో దించింది. రాగవతి వద్దకు ఒంటరిగా వెళ్లి..
“రాగవతీ! నేను మదనాంకుడి పరిచారికను. నా పేరు శృంగోత్పాదిని. నేనే అతణ్ని ఇక్కడికి మోసుకొచ్చాను. ఊరిబయట తోటలో ఉన్నాడు. నువ్వెప్పుడో ఉజ్జయినీ నగరానికి వెళ్లి, అతణ్ని ఇక్కడికి రమ్మన్నావట కదా! ఈ కబురు నీకు తెలియచేసి రమ్మన్నాడు” అని పలికింది.
అప్పుడు రాగవతి గుర్తు వచ్చినట్లు అభినయిస్తూ..
“ఔరా! ఆ మానవుడు ఇంతదూరం వచ్చాడా? నిజంగా వాడి సామర్థ్యం మెచ్చుకోవాల్సిందే” అంటూ యక్షిణి వెంట తోటలోకి వచ్చింది.
(వచ్చేవారం.. పాపం మగవాళ్లు)