హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ పది సెంటీమీటర్లకుపైగా వర్షాపాతం నమోదైంది. సోమవారం ఉదయం 7 గంటల వరకు అత్యధికంగా సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 13.7 సెంటీ మీటర్ల వర్షాపాతం నమోదైంది. ఆ తర్వాత జగిత్యాల జిల్లా జెగ్గాసాగర్లో 12.9 సెంటీమీటర్ల వాన కురిసింది. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో 12.5 సె.మీ, చందుర్తి మండలం మర్రిగడ్డలో 11.5 సె.మీ, పెద్దూరులో 11.28 సె.మీ, ఆవునూరులో 11.15 సె.మీ వర్షాపాతం నమోదైంది.
ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో 11.3 సె.మీ, జగిత్యాల మెట్పల్లిలో 11.2, గోధూరులో 10.95 సె.మీ, కోరుట్లలో 10.43 సె.మీ, నిజామాబాద్ జిల్లా చీమన్పల్లిలో 11.18 సె.మీ, లక్ష్మాపూర్లో 10.85 సె.మీ, సిద్దిపేట జిల్లా రాఘవాపూర్లో 10.98 సె.మీ, జిల్లా కేంద్రంలో 10.10 సె.మీ, కరీంనగర్ జిల్లా పోచంపల్లిలో 10.98 సె.మీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 10.58 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. రాబోయే మూడు గంటల్లో నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, జనగామ, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని, పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.