Dhruv Vikram | తమిళ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులు ఆలస్యమవుతూ రాగా, ఆయనపై తాజాగా నిర్మాతలు అధికారికంగా ఫిర్యాదు చేయడం కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నీలాద్రి ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ సంస్థలు తమిళ ఫిల్మ్ ఛాంబర్ను ఆశ్రయించి ధృవ్పై చర్యలు తీసుకోవాలని కోరాయి. నిర్మాతల కథనం ప్రకారం, దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ హీరోగా ఓ సినిమా రూపొందించేందుకు ముందుగానే ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్ట్ కోసం ధృవ్కు సుమారు రూ.1 కోటి అడ్వాన్స్ కూడా చెల్లించినట్లు సమాచారం. సినిమా కోసం సంగీతం, సెట్లు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు అడ్వాన్స్లు చెల్లిస్తూ ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసినట్లు నిర్మాతలు పేర్కొన్నారు.
అయితే షూటింగ్ ప్రారంభానికి ముందు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ధృవ్ విక్రమ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు కరణ్ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించడం తమకు పెద్ద షాక్ ఇచ్చిందని వారు ఆరోపిస్తున్నారు. నిర్మాతల వాదన ప్రకారం, రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందాల్సిన చిత్రమే ధృవ్ కెరీర్లో నాలుగో సినిమా (DV4) కావాల్సి ఉందని, మైత్రీ మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ అనంతరం ప్రారంభం కావాల్సిందని అంటున్నారు. ఈ విషయంపై వివరణ కోరగా, ముందుగా మైత్రీ సినిమా పూర్తి చేసి తర్వాత తమ చిత్రాన్ని ప్రారంభిస్తానని ధృవ్ చెప్పినట్లు వారు వెల్లడించారు.
దీంతో భారీగా పెట్టుబడులు పెట్టిన తమకు ఆర్థిక భారం పెరుగుతోందని, ముందస్తు సమాచారం లేకుండా ప్రాజెక్ట్ను వాయిదా వేయడం అన్యాయమని నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై తమిళ ఫిల్మ్ ఛాంబర్ స్పందించినట్లు సమాచారం. నిర్మాతలతో కుదుర్చుకున్న ఒప్పందాలను పాటించాల్సిన బాధ్యత ప్రతి నటుడిపైనా ఉంటుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ వ్యవహారంపై ధృవ్ విక్రమ్ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ధృవ్ విక్రమ్ సినీ ప్రయాణంలో ఇలాంటి పరిస్థితులు ఎదురుకావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలు ప్రముఖ దర్శకులతో చర్చలు జరిగిన ప్రాజెక్టులు వివిధ కారణాలతో ముందుకు సాగలేదు. వరుస ఆలస్యాలు, ప్రాజెక్టుల మార్పులు ఆయన కెరీర్పై ప్రభావం చూపే అవకాశముందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.