వడియా: ప్రతి ఇంట్లోనూ మహిళలు వ్యభిచారులు.. మగవారు వారికి విటులను తెచ్చే బ్రోకర్లు. ఇదేమీ అమానుషం, అన్యాయంగా ఆ గ్రామస్తులు భావించరు. తరతరాలుగా తమ జాతి పాటిస్తున్న ఆచారంగా భావిస్తుంటారు. అహ్మదాబాద్ నగరానికి 200 కి.మీ దూరంలో వడియా గ్రామం.. లింగ సమానత్వాన్ని ఆకాంక్షించే ఆధునిక భారతదేశానికి పూర్తిగా పూర్తి భిన్నమైన ప్రపంచంలా ఉంటుంది. సంచార జాతికి చెందిన ఈ గ్రామంలోని మహిళల్ని బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి నెడుతుండగా, పురుషులు వారి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పుడిప్పుడే వారీ దురాచారం నుంచి బయటపడటానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. బాల్య వివాహ నిశ్చితార్థం లేదా వ్యభిచారం.. ఈ రెండే ఆ గ్రామంలోని బాలికల ముందున్న కఠినమైన ఎంపిక. తమ తల్లులు, అమ్మమ్మలు, సోదరీమణులు చిక్కుకున్న ఈ దుస్థితి నుంచి తప్పించుకునేందుకు ఇక్కడ ఏడేళ్ల వయసులోనే బాలికలకు వివాహ నిశ్చితార్థ్ధాలు చేస్తున్నారు. బాల్య వివాహం శాపం అంటూ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది.
అయితే ఆ శాపమే ఇక్కడి బాలికలకు వరం. బనస్కాంత జిల్లాలో ఉన్న ఈ గ్రామ జనాభా 750. ఈ గ్రామానికి చెందిన పురుషులు ప్రతి ఉదయం పాలన్పూర్-థారడ్ రహదారిపైకి వెళ్లి వరుసకడతారు. అయితే వారు వరుస కట్టేది ఏదైనా పనిచేసుకునేందుకు కాదు. తమ ఇంటి ఆడవారికి విటులను తీసుకువచ్చేందుకు. ఈ దురాచారాన్నుంచి బయటపడటానికి ఆ మహిళలకు ఉన్న ఏకైక మార్గం బాల్య వివాహం. దేశంలో బాల్య వివాహాలు నిషేధించినప్పటికీ అది వారికి మాత్రం వరప్రసాదమే. ఆడపిల్లలను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి నెట్టకముందే వారికి నిశ్చితార్థం చేసి వేరే గ్రామాల వారికిచ్చి వివాహం చేయం ద్వారా దాని బారిన పడకుండా కాపాడుకోవచ్చునని అక్కడి ప్రజలు భావిస్తున్నారు, దానిని అనుసరిస్తున్నారు.