చండీగఢ్ : హర్యానా ప్రభుత్వం కరోనా ప్రేరేపిత లాక్డౌన్ను మరోవారం పొడగించింది. ఈ సందర్భంగా పలు సడలింపులు ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అన్ని దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. హోటళ్లు, మాల్స్, రెస్టారెంట్లు, బార్లు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు తెరవొచ్చని పేర్కొంది. 50 శాతం సామర్థ్యంతో జిమ్లు ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. స్పాలకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్టేడియాల్లో క్రీడా కార్యకలాపాల కోసం అనుమతి ఇవ్వగా.. వీక్షకుల ప్రవేశంపై నిషేధం విధించారు.
కొవిడ్ పాజిటివిటీ రేటు, కొత్త కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నా ముందు జాగ్రత్త చర్యలు కొనసాగించేందుకు ‘మహమ్మారి హెచ్చరిక.. సురక్షిత్ హర్యానా’ కోసం లాక్డౌన్ను పొడగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. అన్ని కళాశాలలు, కోచించ్ సంస్థలు, పారిశ్రామిక శిక్షణా సంస్థలు, గ్రంథాలయాలు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మూసే ఉంటాయని పేర్కొంది. గత నెలలో 15వేల మార్క్ను దాటిన హర్యానాలో కరోనా కేసులు ప్రస్తుతం 500కు పడిపోయాయి. మరణాలు సైతం భారీగా తగ్గుముఖం పట్టాయి. కరోనా విజృంభణతో హర్యానా ప్రభుత్వం మే 3న రాష్ట్రంలో లాక్డౌన్ విధించించగా.. ఆరుసార్లు పొడగించింది.