Sudden Cardiac Deaths : వైద్య రంగంలో ఓ అద్భుతమైన ముందడుగు పడింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా సంభవించే ఆకస్మిక గుండె మరణాల (Sudden Cardiac Death) ముప్పును ముందుగానే పసిగట్టే ఒక సరికొత్త విధానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) సహాయంతో శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. సాధారణ ఈసీజీ (ECG) పరీక్షలో దాగి ఉన్న, ఇప్పటివరకు వైద్యులకు కూడా అంతుచిక్కని ఒక రహస్య సంకేతాన్ని ఏఐ వ్యవస్థ గుర్తించింది. ‘యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (యూసీ) బర్కలీ (University of California (UC) Berkeley)’ కి చెందిన పరిశోధకులు ఈ పరిశోధన చేశారు. ఇది లక్షలాది మంది ప్రాణాలను కాపాడేందుకు మార్గాన్ని సుగమం చేయగలదని భావిస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022 గణాంకాల ప్రకారం.. గుండె సంబంధిత వ్యాధులు ప్రపంచంలోనే అతిపెద్ద కిల్లర్గా కొనసాగుతున్నాయి. ఏడాదికి సుమారు 1.98 కోట్ల మంది గుండె సంబంధ వ్యాధులతో మరణిస్తున్నారు. గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని వైద్య పరీక్షల ద్వారా ముందే గుర్తించవచ్చు. కానీ ఆకస్మిక గుండె వైఫల్య మరణాలు చాలా ప్రమాదకరమైనవి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవనుకునే యువకులు, అథ్లెట్లలో కూడా గుండె వైఫల్య మరణం అకస్మాత్తుగా సంభవిస్తుంది. గుండెలోని విద్యుత్ వ్యవస్థలో తలెత్తే లోపాలే దీనికి కారణమని పరిశోధకులు తెలిపారు.
ప్రస్తుతం వైద్యులు గుండె పనితీరును అంచనా వేయడానికి లెఫ్ట్ వెంట్రిక్యులర్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ (LVEF) వంటి పరీక్షలపై ఆధారపడుతున్నారు. ఇది గుండె రక్తాన్ని ఎంత బలంగా పంపుతుందో కొలుస్తుంది. అయితే ఆకస్మికంగా గుండె ఆగిపోయి మరణించే చాలామందిలో ఈ పంపింగ్ సామర్థ్యం సాధారణంగానే ఉంటుంది. దాంతో ప్రస్తుత స్క్రీనింగ్ పద్ధతులు ఆకస్మిక గుండె వైఫల్య మరణ ప్రమాదం పొంచివున్న చాలా మందిని గుర్తించలేకపోతున్నాయి. ఈ సవాలును అధిగమించేందుకు యూసీ బర్కిలీ అసోసియేట్ ప్రొఫెసర్ జియాద్ ఒబర్మేయర్ నేతృత్వంలోని బృందం దాదాపు దశాబ్దకాలం పాటు పరిశోధన చేసింది.
స్వీడన్కు చెందిన 4,40,000 ఈసీజీ రికార్డులను, మరణ ధృవీకరణ పత్రాల డేటాతో అనుసంధానించి ఒక శక్తివంతమైన ఏఐ మోడల్ను అభివృద్ధి చేసింది. అనంతరం అమెరికా, తైవాన్ రోగుల డేటాతో దీన్ని పోల్చిచూసింది. ఈ పరిశోధనలో ఏఐ కేవలం ప్రమాదాన్ని అంచనా వేయడం మాత్రమే కాకుండా ఈసీజీ తరంగాలలో ఒక ప్రత్యేకమైన నమూనాను గుర్తించింది. ఈ నమూనా ఆకస్మిక గుండె మరణాల ముప్పునకు సూచిక అని, దీనిని ఇంతకుముందు కార్డియాలజిస్టులు కూడా గుర్తించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. అంటే ఏఐ కేవలం ఉన్న వైద్య పరిజ్ఞానాన్ని విశ్లేషించడమే కాకుండా ఒక కొత్త జీవసంబంధిత ఆధారాన్ని కనుగొన్నది.
ఈ ఏఐ వ్యవస్థ గుర్తించిన అధిక ప్రమాదం ఉన్న రోగుల సమూహంలో ఏడాదికి 7 శాతం మంది ఆకస్మికంగా మరణించే అవకాశం ఉండగా.. ప్రస్తుత పద్ధతులతో గుర్తించిన వారిలో ఈ ముప్పు 4.6 శాతంగానే ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా ఏఐ గుర్తించిన వారిలో 86 శాతానికిపైగా రోగులను ప్రస్తుత స్క్రీనింగ్ పద్ధతులతో గుర్తించడం అసాధ్యమని తేలింది. ‘ఈ సమస్యకు మన దగ్గర ఇప్పటికే పరిష్కారం ఉంది. కానీ అది ఎవరికి అవసరమో ముందుగా గుర్తించలేకపోవడమే అసలైన విషాదం. ఈ సమస్యను పరిష్కరించడంలో ఏఐ అద్భుతంగా సరిపోతుంది’ అని ప్రొఫెసర్ ఒబర్మేయర్ చెప్పారు.
అయితే ఏఐ హై-రిస్క్ అని చెప్పగానే వెళ్లి డీఫిబ్రిలేటర్ అమర్చుకోవాలని చెప్పడంలేదని, ప్రమాదం ఎక్కువగా ఉన్నవారిని గుర్తించి వారికి మరిన్ని సంప్రదాయ పరీక్షలు నిర్వహించడానికి ఈ ఏఐ ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని ఒబర్మేయర్ స్పష్టంచేశారు.