తిరుమల : తిరుమల ( Tirumala ) లో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు ( Brahmotsavams ) జరుగనున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 14వ తేదీ సాయంత్రం అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమై , ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు , సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వాహన సేవలు ఉంటాయని టీటీడీ అధికారులు తెలిపారు.

15వ తేదీన సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం. 16న ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనంపై స్వామివారు మాడ వీధుల గుండా విహరిస్తారని తెలిపారు. 17న ఉదయం 8 గంటలకు సింహ వాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం, 18న ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనంపై ఊరేగుతారని వివరించారు.

19న ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం, 20న ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం, 21న ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై విహరిస్తారని తెలిపారు.
22న ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం, 23 ఉదయం 6 నుంచి 9 వరకు చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వివరించారు.