Sanjay Dutt | బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని సందర్శించి క్యాన్సర్ రోగులకు ధైర్యాన్నిచ్చే సందేశం ఇచ్చారు. క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదని, సరైన సమయంలో పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుంటే ఈ వ్యాధిని జయించవచ్చని ఆయన అన్నారు. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకుంటూ రోగులకు ఆత్మవిశ్వాసాన్ని నింపేలా మాట్లాడారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి విచ్చేసిన సంజయ్ దత్కు ఆస్పత్రి చైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు ట్రస్టు సభ్యులు నారా బ్రాహ్మణి, జేఎస్ఆర్ ప్రసాద్ ఘన స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి, శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు.
అనంతరం ఆస్పత్రి ప్రాంగణంలోని నందమూరి తారకరామారావు, బసవతారకం దంపతుల విగ్రహాలకు పుష్పాంజలి ఘటించిన సంజయ్ దత్, ఆస్పత్రిలోని పలు విభాగాలను సందర్శించారు. ముఖ్యంగా చిన్నారుల వార్డుకు వెళ్లి పిల్లలను పలకరించి, వారికి బహుమతులు అందజేశారు. అలాగే రోగులు, వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సంజయ్ దత్ భావోద్వేగంగా మాట్లాడారు. మా అమ్మ క్యాన్సర్ కారణంగా మమ్మల్ని విడిచిపెట్టారు. కొన్నేళ్ల క్రితం నేనూ లంగ్ క్యాన్సర్ బారిన పడ్డాను. కానీ ధైర్యం కోల్పోలేదు. వైద్యుల సూచనలు పాటిస్తూ చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్నాను అని తెలిపారు.
క్యాన్సర్ వచ్చిన వెంటనే నిరాశ చెందకుండా, ముందుగానే గుర్తిస్తే చికిత్సతో పూర్తిగా కోలుకునే అవకాశాలు ఎంతో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం క్యాన్సర్ చికిత్సలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకి వచ్చాయని సంజయ్ దత్ అన్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి సమర్థవంతంగా చికిత్స పొందవచ్చని సూచించారు. మనోధైర్యమే పెద్ద మందు. క్యాన్సర్ను చూసి భయపడకండి. వైద్యులపై నమ్మకం ఉంచి ధైర్యంగా పోరాడితే తప్పకుండా విజయం మీదే అవుతుంది అని రోగులకు సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన నందమూరి బాలకృష్ణ, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి స్థాపన వెనుక ఉన్న లక్ష్యం గురించి వివరించారు.