Chopra – Gopichand : యువ క్రీడాకారులను సానబెట్టేందుకు ఇద్దరు దిగ్గజాలు చేతులు కలిపారు. జావెలిన్ స్టార్ నీరచ్ చోప్రా(Neeraj Chopra), బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్(Pullela Goipchand) కొత్తగా కోచింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ కోచింగ్ ఎక్సలెన్స్ (ICSE)ను గురువారం చోప్రా, గోపిచంద్లు ఆవిష్కరించారు. భారత క్రీడా వ్యవస్థను పటిష్టం చేయడమే తమ ఉద్దేశమంటున్నారీ స్టోర్ట్స్ స్టార్స్.
నూట నలభై కోట్లకుపైగా జనాభా ఉన్నా.. ఇప్పటికీ ఒలింపిక్స్ పతకాలను వేళ్లమీద లెక్చించాల్సిన పరిస్థితి మనదేశానిది. ప్రతిభావతులున్నా.. అవకాశాలు రాక కొందరు, సరైన మార్గనిర్దేశం లేక మరొకొందరు ఆటల్లో రాణించలేకపోతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్ది.. క్రీడా భారత్ను సాకారం చేయాలనే లక్ష్యంతో మందుకొచ్చారు పుల్లెల గోపిచంద్, నీరజ్ చోప్రాలు. ఇండియన్ స్కూల్ ఆఫ్ కోచింగ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన వీరు.. క్రీడా వ్యవస్థను పటిష్టం చేయాలనుకుంటున్నారు.
Neeraj Chopra, Gopichand launch Indian School of Coaching Excellence
https://t.co/6eEStI4jFQ— Economic Times (@EconomicTimes) August 13, 2026
ఇండియన్ స్కూల్ ఆఫ్ కోచింగ్ ఎక్సలెన్స్లో పలు అంశాలు ప్రాధాన్యమివ్వనున్నారు. కోచ్లకు పలు కార్యక్రమాలు, శారీరకంగా సిద్ధంగా ఉండడం, స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ ఎడ్యుకేషన్, సాంకేతికత, కెరీర్ డెవలప్మెంట్.. వంటివి చేపట్టనున్నారు. అథ్లెట్లకు వివిధ దశల్లో అవసరమైన శిక్షణ ఇచ్చేలా కోచ్లకు నైపుణ్యాలు అలవర్చడం ఈ కోచింగ్ ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి. భారత క్రీడాధికార సంస్థ, స్పోర్ట్స్ సమాఖ్య, సంఘాలు, హై పెర్మారెన్స్ కేంద్రాలు, విద్యా సంస్థలు, ప్రైవేట్ కోచింగ్ సంస్థలతో కలిసి ఐఎస్సీఈ పనిచేయనుంది.

”ప్రతి అథ్లెట్ కెరీర్ కోచ్ల సలహాలతోనే రూపొందుతుంది. క్రీడాకారులకే కాదు వ్యక్తిగతంగా ఎవరికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. కోచ్లు నిరంతరం నేర్చుకునేలా, యువతలో స్ఫూర్తి రగిలించేలా ఐఎస్సీఈతో పాటు నీరజ్ చోప్రా ఫౌండేషన్ చేయూతనిస్తుంది’. అని నీరజ్ చోప్రా వెల్లడించాడు. ‘భారతదేశం క్రీడా వ్యవస్థ పురోగతి అనేది మనం కల్పించే వనరులపై ఆధారపడి ఉంటుంది. కోచ్లే క్రీడాకారుల భవిష్యత్తులో కీలకం. వారు నిరంతరం నేర్చుకునేలా, తమ నైపుణ్యాలు పెంచుకునేలా మా సంస్థ సహకరిస్తుంది’ అని గోపిచంద్ పేర్కొన్నాడు.