న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్తో దేశ రాజధాని ఢిల్లీ విలవిలలాడింది. ఇటీవల మహమ్మారి రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నది. ఈ క్రమంలో ఢిల్లీ ప్రజలకు మరో శుభవార్త అందింది. ప్రస్తుతం కొనసాగుతున్న రెండు టీకాలకు తోడు కొత్తగా రష్యా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 20 నుంచి స్పుత్నిక్ వీ టీకాను పంపిణీ చేయనున్నారు. దక్షిణ ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రి ఈ టీకా పంపిణీని చేపట్టనుంది. వెయ్యి మోతాదులను కేటాయించగా.. ఇందులో 170 డోసులను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సిబ్బందికి ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు సీరం ఇన్స్టిట్యూట్ కొవిషీల్డ్, భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకాల పంపిణీ మాత్రమే కొనసాగుతున్నాయి. హాస్పిటల్ సర్వీస్ చార్జ్, పన్నులు కలుపుకుని టీకా ధర రూ. 1145గా ఖరారైనట్టుగా తెలుస్తుండగా.. కేవలం టీకాను ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలోనే పంపిణీ చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. వ్యాక్సిన్ను మొదట వంద మందికి వేసి, ఏడు రోజుల పాటు పర్యవేక్షించనున్నారు. టీకాలు వేసిన వారందరూ ఆరోగ్యంగా ఉంటే.. మిగతా వారందరికీ టీకాలు వేయనున్నారు. దేశంలో తొలిసారిగా స్పుత్నిక్ వీ టీకాల పంపిణీ మే 15న డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్లో కస్టమ్ ఫార్మా సర్వీసెస్ గ్లోబల్ హెడ్ కం కంపెనీ దీపక్ సప్రాకు టీకా ఇచ్చారు. మే 17 నుంచి రష్యన్ వ్యాక్సిన్ను పైలట్ ప్రాతిపదికన వేస్తున్నారు. కాగా, డీసీజీఐ అత్యవసర అనుమతి పొందిన ఈ టీకాను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ హైదరాబాద్, విశాఖపట్నంలోని కంపెనీలో ప్లాంట్లలో తయారీ చేస్తున్నారు.
అలాగే టీకాను భారత్లో తయారు చేసేందుకు ఐదు ఫార్మా కంపెనీలు ఇప్పటివరకూ అనుమతులు పొందాయి. ప్రతి ఏటా 850 మిలియన్లు టీకా డోసులు ఉత్పత్తి చేయాలని కంపెనీ భావిస్తోంది. రష్యాకు చెందిన గమలేయా నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. కొవిడ్కు వ్యతిరేకంగా టీకా 91.6శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్లు టీకా కంపెనీ తెలిపింది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్)తో దేశంలో టీకా పంపిణీ, ఉత్పత్తి కోసం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఒప్పందం చేసుకుంది.