International Sailing Championship | చండూరు, జూలై 25: నిరుపేద కుటుంబానికి చెందిన బీసీ గురుకుల విద్యార్థి అంతర్జాతీయ క్రీడా వేదికపై అడుగుపెట్టనున్నాడు. నల్గొండ జిల్లా పి.ఏ.పల్లి మండలం నంబాపురం గ్రామానికి చెందిన వడ్త్యా హనుమంత్ ఇటలీలో జరగనున్న అంతర్జాతీయ సెయిలింగ్ (యాచింగ్) పోటీలకు ఎంపికై అరుదైన ఘనత సాధించాడు.
హనుమంత్ ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలం బోడంగిపర్తి గ్రామంలో ఉన్న మహాత్మ జ్యోతిబా పూలే బాలుర బీసీ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. కూలీ దంపతులు వడ్త్యా సైదా, సుజాతల కుమారుడైన హనుమంత్ చిన్న వయస్సులోనే క్రీడల్లో అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నాడు.
జాతీయ స్థాయి సెయిలింగ్ పోటీల్లో హనుమంత్ సిల్వర్, బ్రాంజ్ పతకాలు సాధించి ప్రతిభ చాటుకున్నాడు. గతంలో చెక్ రిపబ్లిక్లో జరిగిన అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలకు ఎంపికైనప్పటికీ, అనివార్య కారణాల వల్ల పాల్గొనే అవకాశం కోల్పోయాడు. ఈసారి ఇటలీలో జరిగే అంతర్జాతీయ పోటీలకు మరోసారి ఎంపిక కావడంతో తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభించింది.
అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ గురుకులాల కార్యదర్శి బి.సైదులు, నల్గొండ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ ఇ.స్వప్న, పాఠశాల ప్రిన్సిపాల్ జాలా రామకృష్ణ, ఉపాధ్యాయులు హనుమంత్ను ఘనంగా సన్మానించి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.