న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కరోనా వ్యాక్సినేషన్లో దూసుకుపోతున్నది. 24 గంటల వ్యవధిలో 1,60,738 మందికి టీకా పంపిణీ చేశారు. ఇందులో 1,30,487 మందికి మొదటి డోసు, 30,251 మందికి రెండో డోసు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో 82,12,158 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. కాగా, ఢిల్లీలో వరుసగా మూడో రోజూ వందకు దిగువన కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 86 కొత్త కేసులు నమోదవగా, ఐదుగురు మరణించారు. దీంతో మొత్తం కేసులు 14,34,460కి చేరాయి. ఇందులో 14,08,465 మంది కోలుకోగా, 24,988 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో పాజిటివిఈ రేటు 0.11 శాతానికి తగ్గిందని ప్రభుత్వం వెల్లడించింది.
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 35 కోట్లకుపైగా కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. శనివారం రాత్రి 7 గంటల వరకు అందిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా 57.36 లక్షలకుపైగా డోసులు అందించినట్లు పేర్కొన్నది. 18-44 సంవత్సరాల కేటగిరిలో 28,33,691 మందికి మొదటి, మరో 3,29,889 మందికి రెండో డెసు వేసినట్లు చెప్పింది. మూడో విడుత టీకా డ్రైవ్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు కేటగిరిలో మొత్తం 9,94,34,862 మంది తొలి, మరో 27,12,794 మందికి సెకండ్ డోసు అందించినట్లు తెలిపింది.