న్యూఢిల్లీ, జూలై 3: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై మళ్లీ దుమారం రేగింది. రూ.59 వేల కోట్లతో 36 యుద్ధ విమానాల కొనుగోలుకు భారత ప్రభుత్వం ఫ్రాన్స్తో కుదుర్చుకున్న ఒప్పందంలో అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణలపై ఫ్రాన్స్ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించడం భారత్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. న్యాయ విచారణకు ఫ్రాన్స్ ప్రత్యేకంగా ఓ న్యాయమూర్తిని నియమించినట్టు ఆ దేశానికి చెందిన ప్రముఖ మీడియా సంస్థ ‘మీడియా పార్ట్’ వెల్లడించింది. 2016లో కుదిరిన ఈ ఒప్పందంపై గతనెల 14వ తేదీనే ఫ్రాన్స్ అధికారికంగా దర్యాప్తు ప్రారంభించిందని తెలిపింది. డీల్ కుదిర్చినందుకు రాఫెల్ తయారీ సంస్థ దసాల్ట్ ఏవియేషన్ భారత్కు చెందిన మధ్యవర్తికి (సుషేన్ గుప్తా-అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణంలోనూ నిందితుడు ) సుమారు 10 కోట్ల ముడుపులు చెల్లించినట్టు గత ఏప్రిల్లో మీడియా పార్ట్ కథనాన్ని ప్రచురించింది. ఆ దేశ అవినీతి నిరోధక సంస్థ ఆడిటింగ్లో ఈ విషయం బయటపడినట్టు తెలిపింది. ‘గిఫ్ట్ టు క్లయింట్స్’ కింద ఆ సంస్థ భారీగా ఖర్చును చూపించినట్టు పేర్కొన్నది. 50 రాఫెల్ నమూనాలను తయారు చేయించేందుకే సుషేన్గుప్తాకు చెందిన డెఫిసిస్ సొల్యూషన్స్ కంపెనీకి ఆ మొత్తం చెల్లించినట్టు దసాల్ట్ పేర్కొన్నా.. అందుకు ఎలాంటి ఆధారాలు చూపించలేదని తెలిపింది. ఈ కథనాలతోపాటు ఆర్థిక నేరాల పరిశోధనలో ప్రావీణ్యమున్న షెర్పా అనే స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేషనల్ ఫైనాన్షియల్ ప్రాసిక్యూటర్స్ (పీఎన్ఎఫ్) కార్యాలయం దర్యాప్తు ప్రారంభించిందని మీడియా పార్ట్ వెల్లడించింది. వాస్తవానికి 2018లోనే పీఎన్ఎఫ్కు మొదటి ఫిర్యాదు రాగా, అప్పటి పీఎన్ఎఫ్ చీఫ్ దాన్ని తొక్కి పెట్టారని ఆరోపించింది.
2016లో ఒప్పందం
రూ.59 వేల కోట్లతో 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం మోదీ సర్కారు 2016 సెప్టెంబర్ 23న ఫ్రాన్స్కు చెందిన దసాల్ట్ ఏవియేషన్తో ఒప్పందం కుదుర్చుకున్నది. వాస్తవానికి 2012లలో 126 జెట్ల కొనుగోలు కోసం అంతకుముందు యూపీఏ ప్రభుత్వం దసాల్ట్ సంస్థతో చర్చలు జరిపింది. భారత భాగస్వామిగా హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్(హెచ్ఏఎల్)తో ఆ సంస్థ సంప్రదింపులు జరిపింది. 2015 మార్చిలో ఒప్పందం దాదాపు కొలిక్కి వచ్చింది. అయితే మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చర్చలను నిలిపివేశారు. 36 యుద్ధ విమానాల కోసం కొత్తగా ఒప్పందం కుదుర్చుకున్నారు. హెచ్ఏఎల్ స్థానంలో.. రక్షణ రంగంలో ఏమాత్రం అనుభవం లేని అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థ వచ్చి చేరింది. ఒప్పందంపై చర్చలు జరిగే సమయంలో.. 2016 జనవరిలో నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్సిస్ హొలాండే భాగస్వామి అయిన జూలీ గయెట్ నిర్మించిన చిత్రానికి రిలయన్స్ ఫైనాన్స్ చేసింది. ప్రతిగా దసాల్ట్ భారత భాగస్వామిగా రిలయన్స్ను ఎంపిక చేశారని షెర్ప్ సంస్థ ఆరోపించింది. అయితే దీనిని హొలాండే ఖండించారు. అలాగే ఫ్రాన్స్లో రిలయన్స్కు చెందిన సంస్థకు 143.7 మిలియన్ యూరోల పన్నును ప్రభుత్వం రద్దు చేసిందని ఆ దేశ పత్రిక ప్రచురించింది.
అవినీతి జరిగినట్టు స్పష్టమైంది: కాంగ్రెస్
రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు నిజమేనని రుజువయ్యాయని కాంగ్రెస్ పేర్కొన్నది. ఒప్పందంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేసి దర్యాప్తు జరుపాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా శనివారం విలేకరులతో మాట్లాడారు. ‘ఫ్రాన్స్ ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో రాఫెల్ ఒప్పందంలో అవినీతి జరిగిందని స్పష్టంగా అర్థమవుతున్నది. ప్రధాని మోదీ ఇప్పటికైనా ముందుకొచ్చి ఈ అంశంపై జేపీసీ ఏర్పాటు చేసి దర్యాప్తునకు ఆదేశించాలి. నిజం బయటకు రావాలంటే జేపీసీ దర్యాప్తు ఒక్కటే మార్గం’ అని అన్నారు. ఇది బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయం కాదని, దేశభద్రతకు, అతిపెద్ద రక్షణ ఒప్పందంలో అవినీతికి సంబంధించిన విషయం అని పేర్కొన్నారు.
భారత్ను బలహీనపర్చే ప్రయత్నమే:బీజేపీ
రాఫెల్ ఒప్పందంపై ఫ్రాన్స్ దర్యాప్తును బీజేపీ తేలిగ్గా కొట్టిపారేసింది. రాఫెల్ వ్యవహారంపై కాంగ్రెస్ అబద్ధాలను ప్రచారం చేస్తున్నదని, ఆ పార్టీ అబద్ధాలకు పర్యాయపదంగా మారిందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. ‘రాఫెల్ డీల్లో గాంధీ కుటుంబానికి కమీషన్ ముట్టలేదు కాబట్టే రాహుల్ గాంధీ అవినీతి ఆరోపణలు చేస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. దసాల్ట్కు పోటీగా ఉన్న కంపెనీలకు రాహుల్ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దసాల్ట్పై అసత్యప్రచారాలకు ప్రత్యర్థి కంపెనీలు రాహుల్ను ఓ పావుగా వాడుకొంటున్నాయని పేర్కొన్నారు. రాఫెల్ ఒప్పందంపై పదే పదే ఆరోపణలు చేయడం భారత్ను బలహీనపర్చాలన్న ప్రయత్నమే అని అసహనం వ్యక్తం చేశారు.