హైదరాబాద్, జూలై 03 (నమస్తే తెలంగాణ): కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను భారత్ బయోటెక్ శనివారం వెల్లడించింది. కరోనా వైరస్పై టీకా 77.8% సమర్థతతో పనిచేస్తున్నట్టు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న డెల్టా వేరియంట్పై 65.2 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు పేర్కొన్నది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న కేసుల్లో ఇది 93.4శాతం సమర్థత కనబరచినట్టు భారత్ బయోటెక్ తెలిపింది. లక్షణాలు లేని వారిలో దీని సామర్థ్యం 63.6శాతంగా ఉందని తెలిపింది. కొవాగ్జిన్ తీసుకొన్నవారికి కరోనా సోకినా.. వారినుంచి ఇతరులకు సంక్రమించే అవకాశాలు తగ్గాయని వెల్లడించింది. డెల్టాతో పాటు కప్పా, ఆల్ఫా, బీటా, గామా వేరియంట్లపై కూడా కొవాగ్జిన్ సమర్థంగా పనిచేస్తున్నదని భారత్ బయోటెక్ పేర్కొన్నది. 2-18 ఏండ్ల మధ్య వయసువారిపై కొవాగ్జిన్ పనితీరును అంచనా వేసేందుకు ట్రయల్స్ జరుపుతున్నట్టు తెలిపింది. భారత్ బయోటెక్ దేశవ్యాప్తంగా 4 కేంద్రాల్లో కొవాగ్జిన్ను ఉత్పత్తి చేస్తున్నది. ఈ ఏడాది చివరినాటికి 100 కోట్ల డోసుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకొన్నది.
పేద దేశాలను దృష్టిలో పెట్టుకొన్నాం: కృష్ణా ఎల్ల
కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాల విడుదల సందర్భంగా భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్ల మాట్లాడారు. ‘భారతదేశం నుంచి ఉత్పత్తి అయిన టీకా మానవాళి ప్రాణాలను కాపాడుతుందని గర్వంగా ప్రకటిస్తున్నాను’ అని అన్నారు. కొవాగ్జిన్ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీకా సరఫరా వ్యవస్థకు అనుగుణంగా రూపొందించామని, ముఖ్యంగా మధ్య తరగతి, పేద దేశాలను దృష్టిలో పెట్టుకొన్నామని చెప్పారు. 2-8 డిగ్రీల మధ్య నిల్వ, సరఫరా చేయగలగడం, టీకా సీసాలు వృథా కాకుండా మల్టీ డోస్ వయల్ పాలసీని పాటించడం తమ ప్రత్యేకతలన్నారు. సంస్థ జేఎండీ సుచిత్ర ఎల్ల స్పందిస్తూ.. టీకా అభివృద్ధిలో పాలుపంచుకున్నందుకు ఐసీఎంఆర్కు, పుణెలోని ఎన్ఐవీకి, అమెరికా ఫార్మా సంస్థ విరోవాక్స్కు, డీఎస్ఎంబీకి కృతజ్ఞతలు తెలిపారు.
భిన్న వేరియంట్లను అడ్డుకోవడం శుభపరిణామం
ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ 77.8% సామర్థ్యాన్ని ప్రదర్శించడం సంతోషంగా ఉన్నదని ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ అన్నారు. ఈ వ్యాక్సిన్ భిన్న రకాల వేరియంట్లను అడ్డుకోవడం శుభపరిణామం అని పేర్కొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డైరెక్టర్ ప్రియా అబ్రహం మాట్లాడుతూ.. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, భారత నేలపై వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచానికి అందించడం గర్వంగా ఉందని అన్నారు.