ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. పైగా వ్యాక్సిన్ ప్రక్రియకూడా బాగానే జరుగుతున్నది. లాక్డౌన్ ఎత్తేయడంతో ప్రజలు పూర్తిస్థాయిలో ఆఫీసులకు, పనులకు వెళ్తున్నారు. ఇన్ని రోజులూ ఇంటి భోజనాన్నే తిని ఆరోగ్యంగా ఉన్నారు. మళ్లీ బయట దొరికే ఆహారాన్ని కొందరు ఇష్టంగా, మరికొందరు తప్పనిసరిగా తినాల్సి వస్తున్నది. దీంతో కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటప్పుడు, ప్రతి చిన్న దానికి మెడికల్ షాపుకెళ్లి ట్యాబ్లెట్లు తెచ్చుకోవడం కంటే ఇంట్లోనే పాత పద్ధతులను ఉపయోగించాలి.
పెరుగు – ఈసబ్గోల్ (సైలియం ఊక): పొట్టకు సంబంధించిన అసౌకర్యాన్ని తగ్గించడానికి పెరుగు, ఈసబ్గోల్ బాగా పనిచేస్తాయి. ఫైబర్ పుష్కలంగా ఉండే ఈసబ్గోల్ను పెరుగుతో కలిపి తీసుకుంటే ఉదర సమస్యలు తగ్గడంతోపాటు శరీరం ఎక్కువ నీళ్లను గ్రహించేలా చేస్తుంది. నీళ్ల విరేచనాలు, మలబద్ధకంతో వచ్చే కడుపు నొప్పికి కూడా ఈ మిశ్రమం చెక్ పెడుతుంది.
అల్లం: ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉదర సమస్యలను, కళ్లు తిరగడాన్ని తగ్గిస్తాయి. అలాగే, అల్లంలోని పోషకాలు మెటబాలిజాన్ని మెరుగుపరిచి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కడుపు నొప్పిగా ఉన్నప్పుడు అల్లాన్ని సన్నగా తరిగి కప్పు నీళ్లలో వేసి బాగా మరిగించాలి. కావాలంటే, ఇందులో కాస్తంత తేనె కలుపుకొని తాగొచ్చు.
గంజి: కడుపులో నొప్పి, ఉబ్బరంగా ఉన్నప్పుడు గంజి మంచి ఫలితాన్నిఇస్తుంది. అరకప్పు బియ్యాన్ని ఆరు కప్పుల నీళ్లలో వేసి, పావుగంట మరిగించాలి. అలా తయారైన గంజిని తాగితే నొప్పి తగ్గుతుంది. విరేచనాలతో వచ్చే నొప్పికి కూడా ఇది విరుగుడు.