ముంబై : నిరాశ్రయులు, బిచ్చగాళ్లు కూడా దేశం కోసం పనిచేయాలని, అందరికీ అన్నీ కల్పించడం ప్రభుత్వానికి సాధ్యం కాదని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. ముంబైలో యాచకులు, పేదవాళ్లు, నిరాశ్రయులకు మూడు పూటలా భోజనం, వసతి ఇతర సదుపాయాలు కల్పించేలా బృహణ్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దీనికి బీఎంసీ స్పందిస్తూ.. నగరంలోని పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ వర్గాల ప్రజలకు ఆహారం అందిస్తున్నామని, మహిళలకు శానిటరీ నాప్కిన్లు కూడా ఇస్తున్నామని కోర్టుకు తెలిపింది.