జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : గణపురం మండలం గణపసముద్రం చెరువు ఆయకట్టుకు కోట, మత్తడి కాల్వల ద్వారా నీళ్లు వదిలి తమ పంటలు కాపాడాలని రైతులు వేడుకున్నారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో భూపాలపల్లి కలెక్టర్ రాహుల్శర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు బాబురావుతో పాటు పలువురు రైతులు మాట్లాడుతూ గత జూన్ చివరి వారంలో వరి పంట సాగుకు కాల్వల ద్వారా అధికారికంగా నీళ్లు వదిలారని, జూలై 17 నుంచి నిలిపివేయడంతో పోసిన వరి నారుమడులు, నాట్లు పడిన పొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.
నీటిపారుదల శాఖ అధికారులు గణపసముద్రం నీటిని విడుదల చేస్తేనే తామంతా నారు పోశామన్నారు. గణపురంలోని 90 శాతం రైతు కుటుంబాలు ఈ చెరువుపైనే ఆధారపడి జీవిస్తున్నాయని, వరి సాగే జీవనాధారమన్నారు. మిషన్ భగీరథ పనుల సమయంలో రామప్ప సరస్సు నుంచి దేవాదుల పైపులైన్ ద్వారా నీరందిస్తామని అధికారులు హామీ ఇచ్చారన్నారు.
ప్రస్తుతం రామప్పలో తగినంత నీరున్నప్పటికీ గణపసముద్రం చెరువుకు విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన కిసాన్ మేళాలో వ్యవసాయ అధికారుల ఆదేశాల మేరకు తాము 125-130 రోజుల్లో చేతికొచ్చే వరి పంట వేశామని, మరో మూడు నెలల పాటు నిరంతరాయంగా సాగునీరందించి పంటలను కాపాడాలని కోరారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సొంత మండలమైన గణపురానికి చెందిన రైతులు సాగునీటి కోసం తండ్లాడడం జిల్లాలో చర్చనీయాంశమైంది.