న్యూఢిల్లీ: బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తంచేశారు. సాంస్కృతిక ప్రపంచానికి ఆయన మరణం తీరని లోటని అన్నారు. సినిమా లెజెండ్గా ఆయన ఎప్పుడూ గుర్తుండిపోతారని చెప్పారు. అసమాన తేజస్సు దిలీప్ కుమార్ సొంతమని, దీంతో తరతరాలుగా ప్రేక్షకులు ఆయనను చూసి మంత్రముగ్ధులవుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
లెజండరీ యాక్టర్ దిలీప్ కుమార్ ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని హిందూజా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తన 98 ఏండ్ల వయస్సలో తుదిశ్వాస విడిచారు. 1922 డిసెంబర్ 11న పాకిస్థాన్లోని పెషావర్లో దిలీప్ కుమార్ జన్మించారు. దిలీప్ కుమార్గా ప్రసిద్ధి చెందిన ఆయన అసలు పేరు మహమ్మద్ యూసుఫ్ ఖాన్. సినిమాల్లోకి రాకముందు తండ్రితో కలిసి పండ్లు అమ్మారు. 1944 నుంచి 1998 వరకు చిత్రసీమను ఏలారు. ఉత్తమ నటుడిగా ఎనిమిది సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. 1994లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. సినీపరిశ్రమకు ఆయన చేసిన సేవలకుగాను 1991లో పద్మభూషణ్, 2015లో పద్మవిభూషణ్ పురస్కారాలతో ప్రభుత్వం సత్కరించింది.
1993లో దిలీప్కు ఫిలింఫేర్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. 1998లో నిషాన్-ఇ-ఇంతియాజ్ అవార్డుతో పాకిస్థాన్ ప్రభుత్వం సత్కరించింది. 2000 నుంచి 2006 వరకు రాజ్యసభ సభ్యుడిగా దిలీప్ కుమార్ సేవలు అందించారు. ఆయన మృతిపై భారతీయ సినీ పరిశ్రమతోపాటు, పలువులు ప్రముఖులు సంతాపం తెలిపారు.