న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని గోమతి నది ఆధునీకరణ కోసం గత ప్రభుత్వం 1500 కోట్లతో ప్రాజెక్టును చేపట్టింది. ఆ సమయంలో యూపీ సీఎంగా అఖిలేశ్ యాదవ్ ఉన్నారు. అయితే ఆ ప్రాజెక్టులో జరిగిన అవకతవకల విషయంలో ఇప్పటికే ఒక కేసు నమోదు అయ్యింది. తాజాగా ఆ ప్రాజెక్టుకు చెందిన రెండవ కేసును సీబీఐ నమోదు చేసింది. ఆ కేసులో అఖిలేశ్ పేరు లేకున్నా.. ఇవాళ సీబీఐ అధికారులు 42 ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. యూపీతో పాటు రాజస్థాన్, కోల్కతాలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఫ్రాన్స్ కంపెనీ అక్వాటిక్ షోపై ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలైంది. గోమతి నదిపై లక్నోలో ఆధునీకరణ కోసం అక్వాటిక్ షో కంపెనీ అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంది. దీని కోసం 55.95 లక్షల యూరోల ఒప్పందం కుదర్చుకున్నారు. అయితే టెండర్ విధానంలో కాకుండా, అక్రమ పద్ధతిలో ప్రాజెక్టును అక్వాటిక్ షోకు అప్పగించారు. రాష్ట్రానికి చెందిన ఇరిగేషన్ శాఖ అవినీతికి పాలపడిన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సీబీఐ ఆ రెండు కేసులను విచారిస్తున్నది.