గత కొద్ది నెలలుగా ఇండస్ట్రీకి చెందిన ఎందరో లెజండ్స్ కరోనాతో లేదంటే ఇతర కారణాల వలన మృత్యువాత పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ (98) బుధవారం (జూలై 7న) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటీవల ఆసుపత్రిలో చేరారు. ప్లూరల్ ఎఫ్యూషన్తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు.
98 ఏండ్ల వయస్సున్న దిలీప్ కుమార్ గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుండగా, ఆయనకు ముంబైలోని హిందూజా దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం 7.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. 1922 డిసెంబర్ 11న పాకిస్థాన్లోని పెషావర్లో దిలీప్ కుమార్ జన్మించారు. సినిమాల్లోకి రాకముందు తండ్రితో కలిసి పండ్లు అమ్మారు.
1944 నుంచి 1998 వరకు చిత్రసీమను ఏలిన దిలీప్ కుమార్ ఉత్తమ నటుడిగా ఎనిమిది సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. 1994లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. సినీపరిశ్రమకు ఆయన చేసిన సేవలకుగాను 1991లో పద్మభూషణ్, 2015లో పద్మవిభూషణ్ పురస్కారాలతో ప్రభుత్వం సత్కరించింది. 1993లో దిలీప్కు ఫిలింఫేర్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది.
1998లో నిషాన్-ఇ-ఇంతియాజ్ అవార్డుతో పాకిస్థాన్ ప్రభుత్వం సత్కరించింది. 2000 నుంచి 2006 వరకు రాజ్యసభ సభ్యుడిగా దిలీప్ కుమార్ సేవలు అందించారు. ఆయన మృతిపై బాలీవుడ్ పరిశ్రమతోపాటు, పలువులు ప్రముఖులు సంతాపం తెలిపారు.కాగా, కొద్ది రోజుల క్రితం ఆయన ఇద్దరు సోదరులు కరోనాతో కన్నుమూసిన విషయం తెలిసిందే.