బెంగుళూరు: దక్షిణాది రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అయితే లోక్సభ ఎన్నికలకు (Loksabha Polls)పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో.. ఓటర్లు ఆపసోపాలు పడుతూ పోలింగ్ బూత్లకు చేరుకుంటున్నారు. కేరళలో హీట్వేవ్ ఎక్కువగా ఉన్నది. పాలక్కాడ్, మలప్పురం, అలప్పుజా నియోజకవర్గాల్లో ముగ్గురు ఓటర్లు మృతిచెందారు. ఎండ వేడి తట్టుకోలేక వాళ్లు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కోజికోడ్లో ఓ పోలింగ్ ఏజెంట్ మృతిచెందాడు.
ఒట్టపాలెంలో ఓ వ్యక్తి ఓటు వేసిన తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. అతని వయసు 68 ఏళ్లు. ఒట్టపాలెం తాలూక ఆస్పత్రికి తీసుకెళ్లినా అతని ప్రాణాలు దక్కలేదు. పాలక్కాడ్లో అత్యధికంగా 40 డిగ్రీలు నమోదు అయ్యింది. తిరూర్లో ఓటు వేసిన ఓ మదరసా టీచర్ కూడా ఇంటికి వచ్చి కుప్పకూలిపోయాడు. అలప్పుజాలో ఓటు వేసి ఇంటికి వెళ్లిన తర్వాత 82 ఏళ్ల సోమరాజన్ ప్రాణాలు కోల్పోయాడు. కేరళలో మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటింగ్ 40 శాతం దాటింది.
బెంగుళూరులో కూడా హీట్వేవ్ లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు వేడి ఉష్ణోగ్రతలు ఉన్నా.. నగరం చుట్టూ ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో పోలింగ్ సాగింది. బెంగుళూరు నార్త్, బెంగుళూరు సెంట్రల్, బెంగుళూరు రూరల్, బెంగుళూరు సౌత్ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఐఎండీ వార్నింగ్ ఇవ్వకపోయినా.. సిటీలో మాత్రం చాలా వేడి వాతావరణం ఉన్నది. ఓటింగ్ రోజున నగరంలో టెంపరేచర్ 39 వరకు ఉంటుందని ఐఎండీ బెంగుళూరు డైరెక్టర్ సీఎస్ పాటిల్ తెలిపారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఓటర్లు ఎండకు దూరంగా ఉండాలని సూచించారు. దాహం లేకున్నా నీళ్లు తాగాలని, ఛత్రీలు, సన్గ్లాసులు వాడాలని సూచించారు.