హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. లాక్డౌన్ మనందరి మంచికోసమేనని చెప్పారు. ఆయన ఇవాళ సుచిత్ర, అల్వాల్, గోల్నాక క్రాస్రోడ్స్, ఆల్విన్ కాలనీ, దూలపల్లి క్రాస్రోడ్స్ ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కమిషనరేట్ పరిధిలో దాదాపు ఐదు వేల మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఎస్సీఎస్సీతో కలిసి త్వరలో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
కాగా, లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపు హైకోర్టు సంతృప్తి వ్యక్తంచేసింది. పోలీసుల పనితీరును ప్రశంసించింది. మూడు కమిషనరేట్ల పోలీసుల పనితీరు అభినందనీయమని పేర్కొన్నది. పోలీసులు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టించింది. ఈ సందర్భంగా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు విచారణకు హాజరయ్యారు.
లాక్డౌన్, కరోనా నిబంధనల అమలుపై డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఔషధాల బ్లాక్ మార్కెట్పై 98 కేసులు నమోదుచేశామని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో 57 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామని, లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ పకడ్భందీ అమలుకు చర్యలు తీసుకుంటున్నామని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా ఈ నెల 1 నుంచి 14 వరకు 4,31,823 కేసులు నమోదుచేశామని, మాస్కులు లేనివారిపై 3,39,412 కేసులు, రూ.31 కోట్లు జరిమానాలు విధించామని, భౌతిక దూరం పాటించనందుకు 22,560 కేసులు, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనపై 26,082 కేసులు నమోదుచేసినట్లు వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి