న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తౌటే తుఫాన్ బీభత్సం సృస్టిస్తున్నది. తుఫాన్ ప్రభావంతో నగరం అంతటా బలమైన ఈదురు గాలులతోపాటు భారీ వర్షం కురుస్తున్నది. ఈ గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు కుప్పకూలాయి. ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. అంతేగాక కరోనా బాధితులకు చికిత్స కోసం బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ కేంద్రం కూడా పాక్షికంగా ధ్వంసమైంది.
కొవిడ్ కేర్ సెంటర్ నిర్మాణం కోసం పక్కలకు గోడల్లా, పైన కప్పులాగా ఉపయోగించిన రేకులు బలమైన తుఫాన్ గాలుల ధాటికి కూలిపోయాయి. అయితే, ఈ ఘటనలో కొవిడ్ బాధితులు ఎవరికీ ఏమీ కాలేదు. ఇప్పుడు ఆ కొవిడ్ కేర్ కేంద్రాన్ని సరిచేసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.