Mahesh Babu | సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం కొద్ది కాలం వ్యవధిలో వరుస విషాదాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ముందుగా కృష్ణ సతీమణి ఇందిరా దేవి, అనంతరం పెద్ద కుమారుడు రమేష్ బాబు, ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో ఘట్టమనేని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తండ్రి రమేష్ బాబు, తాత కృష్ణ మరణించిన సమయంలో తాను చాలా చిన్నవాడినని జయకృష్ణ తెలిపారు. ఆ పరిస్థితులు తనకు జీవితాన్ని కొత్త కోణంలో అర్థం చేసుకునేలా చేశాయని చెప్పారు. ఆ సమయంలో ఎక్కువగా తన తల్లితోనే మాట్లాడేవాడినని, ఇకపై ఎలా ముందుకు వెళ్లాలి, జీవితంలో సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అనే విషయాలపై ఇద్దరూ చర్చించుకునేవారమన్నారు.
ఆ క్లిష్ట సమయంలో మా అమ్మే నాకు ధైర్యం ఇచ్చింది. జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా నిలబడాలని ఆమె నేర్పించింది. ఆ అనుభవాలు నన్ను మరింత బలంగా మార్చాయి అని జయకృష్ణ పేర్కొన్నారు. తన తండ్రి రమేష్ బాబు, మహేష్ బాబు మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా జయకృష్ణ గుర్తు చేసుకున్నారు. ఇద్దరి మధ్య దాదాపు 12 ఏళ్ల వయసు తేడా ఉండేదని, చిన్నప్పటి నుంచి రమేష్ బాబే మహేష్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారని చెప్పారు. తాత కృష్ణ షూటింగ్లతో బిజీగా ఉన్న సమయంలో మహేష్ బాబాయ్ బాధ్యతలను మా నాన్నే చూసుకునేవారు. అందుకే ఆయనకు మా నాన్న కేవలం అన్న మాత్రమే కాదు, రెండో తండ్రిలాంటి వ్యక్తి. ఇద్దరి మధ్య ఎంతో ఆప్యాయమైన బంధం ఉండేది అని వివరించారు.
రమేష్ బాబు మరణం తర్వాత మహేష్ బాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని జయకృష్ణ తెలిపారు. నేను చిన్నవాడిని కావడంతో ఆ బాధ పూర్తిగా అర్థం కాలేదు. కానీ బాబాయ్ మాత్రం చాలా కుంగిపోయారు. నాన్నను కోల్పోవడం ఆయనకు పెద్ద షాక్. ఆ తర్వాత కొంచెం పెద్దవాడిని అయినప్పుడు ఆ బాధ ఎంత తీవ్రమైందో నాకు అర్థమైంది అని అన్నారు. తండ్రి మరణం తర్వాత తమ కుటుంబానికి మహేష్ బాబు అండగా నిలిచారని జయకృష్ణ భావోద్వేగంగా చెప్పారు. ఆ సమయంలో బాబాయ్తో నేను చాలా విషయాలు మాట్లాడేవాడిని. ఇకపై ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయాల్లో ఆయన నాకు ఎంతో మార్గనిర్దేశం చేశారు. నాన్నగారి గైడెన్స్ లేకపోయినా, బాబాయ్ ఆ లోటు తీరేలా మా కుటుంబానికి అండగా నిలిచారు. మా అమ్మ కూడా చాలా అమాయక స్వభావం కలిగిన వ్యక్తి. అలాంటి సమయంలో ఆమెకు కూడా ధైర్యం చెప్పి, మా ఇద్దరికీ అవసరమైన సహాయం చేశారు అని తెలిపారు.